AP Ministers: రాజకీయాల్లో నేతలకు ఆ పార్టీపై నమ్మకం ఉండవచ్చు..! సవాళ్లు చేయవచ్చు, ప్రత్యర్ధులను మాటల ద్వారా ఢీ కొట్టవచ్చు, కానీ ప్రస్తుతం వైసీపీలో ఉన్న కొందరు మంత్రులలో చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది.. తమ నేత జగన్ పై నమ్మకమో.. తమ పాలనపై విపరీతమైన నమ్మకమో.. లేదా ప్రజలు మళ్ళీ ఓట్లేస్తారులే అనే ధీమానో కానీ.. విపరీతమైన సవాళ్లు చేస్తున్నారు.. వాళ్ల రాజకీయ భవిష్యత్తును రిస్క్ లో పెట్టుకుని సవాళ్లు చేస్తున్నారు. మంత్రుల్లో ధర్మాన కృష్ణదాసు, కొడాలి నాని, బాలినేని శ్రీనివాసరెడ్డి సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్లు కూడా ప్రత్యర్ధులకు సవాల్ చేసే క్రమంలో కొన్ని ఊహాతీతమైనవి ఊహించలేని సవాళ్లు చేస్తుండటమే మంత్రులను హైరిస్క్ లో పెడుతుందేమో అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
AP Ministers: ఒక్కొక్కరూ ఒక్కో రకంగా… కానీ అదే పాయింట్..!!
రీసెంట్ గా మంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో జగన్మోహనరెడ్డి మళ్లీ సిఎం అవ్వకపోతే, చంద్రబాబు సీఎం అయితే తాను రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పారు. తాను రాజకీయాల్లో ఉండను అని స్పష్టం చేశారు. ధర్మాన కృష్ణదాసు నమ్మకం అని అనుకుంటే.. తరువాతి రోజే కొడాలి నాని కూడా ఇదే తరహా కామెంట్స్ చేశారు. కొడాలి తన దైన శైలిలో ఛాలెంజ్ విసిరారు. “చంద్రబాబు జీవితంలో సీఎం కాలేడు. టీడీపీ అనేది భవిష్యత్తులో ఎప్పుడూ అధికారంలోకి రాదు” అని స్పష్టం చేస్తూనే ఒక వేళ చంద్రబాబు సీఎం అయితే తాను రాజకీయాల నుండి తప్పుకోవడంతో పాటు రాష్ట్రం విడిచి వెళతాను అంటూ సవాల్ విసిరారు. ఒక్క రోజు వ్యవధిలో ఇద్దరు మంత్రులు ఒకే తరహా కామెంట్స్ చేశారు. బాలినేని శ్రీనివాసరెడ్డి అంతకు ముందు సందర్భంలో జనసేన, టీడీపీకి కలిపి సవాల్ చేశారు. అలానే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా కామెంట్స్ చేశారు. చంద్రబాబు రాజకీయ జీవితం ఇక ముగిసినట్లే, చంద్రబాబు సీఎం అవ్వడం కాదు కుప్పంలో ఎమ్మెల్యే గా గెలవడం కూడా కష్టమే అని వ్యాఖ్యానించారు. కుప్పంలో గెలిచి చూడమని సవాల్ చేశారు పెద్దిరెడ్డి. కొంత మంది కీలకమైన మంత్రులు ఇలా సవాల్ చేయడం వెనుక ఏమైనా వ్యూహం దాగి ఉందా..? లేదంటే వాళ్ల ప్రభుత్వంపై అతి నమ్మకం ఏర్పడింది అనుకోవచ్చు.
* రాజకీయాల్లో సవాళ్లు చేయవచ్చు. “మీ ప్రభుత్వం రాదు. వస్తే మేము రాజీనామా చేస్తాం. మీ ప్రభుత్వం వచ్చే అవకాశమే లేదు..జనాలు మీకు ఓట్లు వేయరు..దమ్ము ఉంటే గెలవండి.. ఇన్ని సీట్లు గెలవండి” అని సవాల్ చేయవచ్చు. కానీ ..”మేము రాజకీయంగా పోటీ చేయము, రాజకీయ సన్యాసం తీసుకుంటాం” అనే సవాళ్లు సాధారణంగా ప్రతిపక్షంలో ఉన్న వాళ్లు చేస్తుంటారు. అధికారంలో ఉన్న వాళ్లు ఇటువంటి సవాళ్లు చేయరు. రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఈ వ్యాఖ్యలు, సవాళ్లు చూస్తుంటే ఏదైనా వ్యూహం దాగి ఉందా..? ఒక వేళ టీడీపీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు సీఎం అయితే.. వాళ్లు తాము ఆనాడు పరిస్థితులను బట్టి ఆ కామెంట్స్ చేశామని చెప్పుకుంటారేమో. !
టీడీపీని టెన్షన్ పెడుతున్నారు..!!
ఇప్పుడు సవాళ్లు చేస్తున్న వారు ఆ పార్టీలో సీనియర్ నేతలే. ప్రజల్లోకి ఒక సందేశం తీసుకువెళ్లాలి, “టీడీపీ అధికారంలోకి రాదు, తరువాత కూడా జగన్మోహనరెడ్డే సీఎం అవుతారు’ అని ప్రజల్లో ఒక ధృఢమైన విశ్వాసం కల్గించడానికి, క్యాడర్ లోనూ కల్గించడానికి సవాళ్లు చేస్తున్నారు అని అనుకోవచ్చు. జనంలో కూడా ఒక ఆలోచన రేకెత్తించే ఎత్తుగడ ఇది. “చంద్రబాబు శపథం చేశారు. శపథం నెరవేర్చుకునేందుకు రివ్యూలు చేస్తున్నారు. జగన్మోహనరెడ్డి మీద కొన్ని వర్గాల్లో వ్యతిరేకత కనబడుతున్నట్లు ఉంది. వైసీపీ వచ్చే ఎన్నికల్లో ఏమైనా ఓడిపోతుందా” అన్న సందేహాలు వచ్చినప్పుడు ఆ పార్టీలోని నేతలు.. మన మంత్రులు రాజకీయ సన్యాసం చేస్తామని సవాళ్లు చేశారు. అంత కాన్ఫిడెన్స్ లేకపోతే ఎందుకు చేస్తారు అన్నట్లు చెప్పి వారిలో ఉన్న సందేహాలను పాలద్రోలే అవకాశం ఉంటుంది. ప్రశాంత్ కిషోర్ (పీకే) తెరవెనుక రాజకీయ స్ట్రాటజీ తో ఇలాంటి ఛాలెంజ్ లు వస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పైగా మంత్రుల ఈ వరుస కామెంట్లు, సవాళ్లతో టీడీపీలో కొత్త టెన్షన్ పడుతుంది. టీడీపీలో ఏ ఇద్దరు నాయకులు కలిసినా ఇదే తరహా చర్చ జరుగుతుందట..!