సాధారణంగా భారతదేశంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి మరియు మంత్రులు. అధిష్టానం ఇచ్చిన మంత్రి పదవులలో ఒక్కొక్కరికి ఒక్కొక్క శాఖను ఖరారు చేసి ఉంటారు. ఆయా శాఖల పై సంబంధిత అధికారులతో సమీక్ష జరిపించవలసిన బాధ్యత మంత్రులది. దానికి సంబంధించి ఏ శాఖలో అయినా ఎలాంటి సమస్య వచ్చినా సంబంధిత మంత్రి స్పందిస్తాడు మరియు బాధ్యుడు కూడా.
కానీ ఆంధ్రప్రదేశ్ సర్కారు తీరు మాత్రం వేరు. అతను ఏ శాఖకు సంబంధించిన మంత్రి అయినా సరే అన్నింటిపైనా స్పందిస్తారు. తనకు సంబంధం లేని శాఖలపై ప్రెస్ మీట్ పెట్టి విమర్శకులకు ఎడాపెడా సమాధానాలు ఇచ్చేస్తారు. ఇక ఆ శాఖకు సంబంధించిన మంత్రి అయితే కనీసం అడ్రస్ కూడా ఉండరు. మొన్న రాష్ట్రవ్యాప్తంగా విపరీతమైన రచ్చ లేపిన కరెంటు బిల్లుల విషయంలో కూడా ఇదే జరిగింది.
విద్యుత్ శాఖ మంత్రి ప్రకాశం జిల్లాకు చెందిన బాలినేని శ్రీనివాసరెడ్డి. కరెంట్ బిల్లు విషయంలో అంత పెద్ద రచ్చ జరిగితే ఆయన తాపీగా కేవలం రెండు ముక్కలు మాట్లాడేసి అసలు కరెంటు బిల్లులు అన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి అని చెప్పారు. ఇక ఇతర మంత్రులు బుగ్గన, కన్నబాబు, హోంమంత్రి సుచరిత అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇస్తున్నారు. ఈ కరోనా దెబ్బకు తమ శాఖ ఏదో మంత్రులంతా మర్చిపోయినట్లుంది. ఇతరుల మంత్రుల శాఖల లోని అంశాలను వివరిస్తూ అసలు ఇది తమ శాఖే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మీడియా ముందుకి వచ్చి కెమెరా ఉంది కదా అని గంటల తరబడి ఇంటర్వ్యూ ఇస్తున్నారు.
ఇక విపత్తు నిర్వహణ శాఖా మంత్రి కరోనా వ్యవహారాన్ని డీల్ చేయాలి కానీ మన వ్యవసాయ మంత్రి కన్నబాబు మాత్రం ఒక సీనియర్ గా బాధ్యతలు తీసుకొని కెమెరా ముందు తన వాదనను వినిపించారు. విపక్షాల నుంచి ఏ ఒక్క మాట వచ్చిన తనే బాధ్యత తీసుకొని వారికి సమాధానం ఇస్తారు. అసలు నా శాఖ వ్యవసాయం కాదు విపత్తు నిర్వహణ అన్నట్లుగా ఇన్వాల్వ్ అయిపోతారు. అసలు మంత్రి మాత్రం ప్రెస్ మీట్ కు వచ్చి రెండు ముక్కలు మాట్లాడేసి హడావిడిగా వెళ్ళిపోతారు.
ఇక మొన్న జరిగిన ఘోరమైన ఎల్ జి పాలిమర్స్ గ్యాస్ లీక్ విషయంలో మాట్లాడాల్సిన పరిశ్రమ శాఖ మంత్రి బదులు ఒక శాసనసభ్యుడు వచ్చి మాట్లాడాడు. కరెంట్ బిల్లు విషయంలో ఆర్థిక మంత్రి బుగ్గన విపక్షాలకు సవాల్ విసురుతున్నారు. సీనియర్ గా బాధ్యతలు పంచుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి వీరంతా స్పందించారు అనుకుందాం కానీ అన్నీ మంత్రిత్వశాఖలలో ఇదే పరిస్థితి కొనసాగితే ఏమని చెప్పాలి?
ఆర్థికమంత్రి పంచాయతీరాజ్ చట్టం గురించి అనర్గళంగా ప్రసంగిస్తారు స్థానిక ఎన్నికల గురించి పంచాయతీరాజ్ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పాలి కానీ ఆయన ఆర్థిక అంశాలు, వ్యవసాయ అంశాలపై ప్రకటనలు ఇస్తూ ఉంటారు. రైతుల విషయంలో అయితే బొత్స కలగజేసుకున్నట్లు మరెవరూ కలగచేసుకోరు. పౌరసరఫరాల శాఖ మంత్రి రేషన్ పంపిణీ విషయంలో ఇవ్వాల్సిన వివరణ సమాచార శాఖ మంత్రి పేఱ్ని నాని అని పిలుస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో.
ప్రభుత్వానికి కొంత మంది సలహాదారులు ఉన్నారు. వారే అనధికారిక పాలకులు. ఇద్దరు ముగ్గురు సలహాదారులు చాలా యాక్టివ్ గా ఉంటారు. మొత్తం వ్యవహారాలన్నీ వాళ్లే చక్కబెడతారని.. సెక్రటేరియట్లో ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఇదంతా అదేనంటారా మరి?