AP Movie Tickets: అక్రమాలు చేస్తున్నారన్న ఆధారాలున్నాయి.. పన్నులు ఎగ్గొడుతున్నారన్న లెక్కలున్నాయి.. సామాన్యుల నుండి దోపిడీ చేస్తున్నారన్న ఉదాహరణలున్నాయి.. ఇంకా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే అది ప్రభుత్వం ఎందుకవుతుంది..? ఆ సీఎం జగన్ ఎందుకవుతారు..!? సో.., సినిమా టికెట్ల వ్యవహారంలో జగన్ తన మాటని నెగ్గించుకునే దిశగా అన్ని మార్గాలు సుగమం చేసుకున్నారు. థియేటర్లు, ఆ నిర్మాతల.. ఆ సినీ పెద్దల అక్రమ బాగోతాలు ఇక మీదట సాగకుండా చాలా పకడ్బందీగా తాడు చుట్టేశారు.. ఇక వాళ్ళు కోర్టుకి వెళ్లినా పప్పులుడీకే అవకాశమే లేదు.. ఎందుకంటే…!?
AP Movie Tickets: అసలు ఏం జరిగింది..!?
సినిమా టికెట్ల ధరలకు సంబంధించిన వివాదం సద్దుమణగకముందే ఏపీ ప్రభుత్వం నిన్న మరో కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా టికెట్ల విక్రయాలు ప్రభుత్వం ద్వారానే జరిగే విధంగా జీవో నెం. 142 ను జారీ చేసింది. ఈ జీవో ప్రకారం టికెట్ల అమ్మకాలన్నీ ప్రభుత్వ పరిధిలోనే జరుగుతాయి. ఈ బాధ్యతను ఏపీఎఫ్డీసీ (ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్)కి అప్పగించింది. ఐఆర్సీటీసీ తరహాలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్టు జీవోలో పేర్కొంది. అతి త్వరలోనే ఈ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. ఇకపై ప్రైవేటు ప్లాట్ఫామ్లపై టికెట్ బుక్ చేసుకునే అవకాశం, థియేటర్లలో టికెట్ కొనుక్కునే సదుపాయం ఉండదని సమాచారం. సినిమా టికెట్ ధరల నిర్ణయం విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైన సంగతి తెలిసిందే. టికెట్ రేట్లను తగ్గించాలంటూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం. 35ను సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే, కేవలం పిటిషన్ దాఖలు చేసిన వారికి మాత్రమే టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఉంటుందని మిగిలిన అన్ని థియేటర్లలో ప్రభుత్వం నిర్ణయించిన ధరకే టికెట్లు అమ్మాలని రాష్ట్ర హోంశాఖ వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే.
AP Movie Tickets: పాపం ఆ సినిమాలు..!?
ప్రభుత్వ వాదన ఏమిటంటే.. సినీ ఫీల్డ్ లో అవినీతి జరుగుతోంది. నిర్మాతలు పన్ను ఎగ్గొడుతున్నారు. పారదర్శకత లేదు, కలెక్షన్ తక్కువగా చూపుతున్నారు అందుకే పారదర్శకత కోసం మరియు ప్రజలకు తక్కువ ధరలకు టికెట్లు విక్రయించేందుకు ఆన్ లైన్ విధానం అవసరం అన్న వాదనను ప్రభుత్వం చేస్తోంది. ఈ విధానం వల్ల ప్రజలకు మేలు జరుగుతుంది, ప్రభుత్వానికి కశ్చిత ఆదాయం వస్తుంది అన్నది వారి లెక్క. ప్రజలకు మంచి చేస్తుంటే మేకు ఏమిటి అభ్యంతరం అని ప్రభుత్వం స్పష్టమైన వాదనతో సిద్ధం అయ్యింది. అయితే దీనికి చిన్నచిన్న సినిమాల వాళ్లు పెద్దగా అభ్యంతం వ్యక్తం చేయరు. కానీ భారీ బడ్జెట్ సినిమాల వాళ్లు మాత్రం కశ్చితంగా అభ్యంతరం వ్యక్తం చేస్తారు. త్వరలో భారీ బడ్జెట్ మువీ ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల అవుతోంది. ఆ సినిమాకు ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం టికెట్లు అమ్మితే ఏపిలో 40 నుండి 50 శాతం కలెక్షన్ కోల్పోతుంది. ఆర్ ఆర్ ఆర్ సినిమాకు మొదటి మూడు రోజులు రూ.250ల నుండి రూ.300లు చొప్పున పెట్టాలని వాళ్లు అంతర్గతంగా నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇప్పుడు ఏపిలో అవేమీ కుదరవు. ఇప్పుడు వాళ్లు నైజాం ఏరియాలతో పాటు ఇతర రాష్ట్రాల కలెక్షన్ పై మాత్రమే ఆధారపడాల్సి ఉంటుంది. కానీ ఆర్ఆర్ఆర్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న రాంచరణ్, ఎన్టీఆర్ మువీ కాబట్టి ఏపిలో వచ్చే కలెక్షన్ లపై ఎంతో ఆశ పెట్టుకున్నారు. దీని వల్ల ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయాన్ని ఆర్ఆర్ఆర్ నిర్మాతలే సవాల్ చేసే అవకాశం ఉంటుంది.
న్యాయ నిపుణులు ఏమంటున్నారు..!?
అయితే కొందరు న్యాయనిపుణులు మాత్రం వీళ్లు కోర్టుకు వెళ్లినా ప్రభుత్వానికి అనుకూలంగానే తీర్పు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వం చెబుతున్న కారణాలు సహేతుకంగా ఉంటున్నాయని అందుకే ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టు సమర్ధించే అవకాశం ఉండవచ్చని పేర్కొంటున్నారు. ప్రభుత్వ అంతర ఉద్దేశం ఏది ఉన్నప్పటికీ ఈ నిర్ణయం ప్రజలకు ఉపయోగపడేలా ఉందా లేదా. చట్టపరంగా చేశారా లేదా అన్నదే కోర్టులు పరిగణలోకి తీసుకుంటాయని అంటున్నారు. ప్రభుత్వం మాత్రం సినిమా పరిశ్రమను తమ ఆధీనంలో పెట్టుకోవాలనో లేక అవినీతి కట్టడి చేయాలనో మరే ఇతర కారణాలతో నూతన నిర్ణయం తీసుకువచ్చినా అంతిమంగా అది ప్రజలకు మేలు జరిగేదా కాదా చట్టపరంగా చేశారా అనేదే ముఖ్యం. ఇటీవల పుష్ప సినిమా విడుదల అయిన సమయంలో సరైన విధానం లేకపోవడంతో చాలా చోట్ల బ్లాక్ లో టికెట్లు విక్రయించారు. తాజాగా ఆర్డీఓలు, జాయింట్ కలెక్టర్ లు సినిమా థియేటర్ల తనిఖీ చేసి టికెట్లు ఏ విధంగా విక్రయాలు సాగిస్తున్నారు అనేది రిపోర్టులు తయారు చేశారు. వీటిని వాళ్లు కోర్టుకు చూపుతారు. నియంత్రణ లేని కారణంగా వీళ్లు ధరలు పెంచి టికెట్లు విక్రయిస్తున్నారని చెబుతారు. సో.. కోర్టుకి వెళ్లినా నిర్మాతలు, థియేటర్లకు పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు..!