AP Municipal Elections: ఏపీలో మునిసిపల్ ఎన్నికల సందడి నెలకొంది.. నామినేషన్లు ముగిసాయి.., ప్రచార ఘట్టం ఊపందుకుంది.. మరో వారం రోజుల్లో పోలింగ్ జరగనుంది.. ఆ వెంటనే రెండు రోజుల వ్యవధిలో ఫలితాలు ప్రకటించనున్నారు.. ఈ ఏడాది మార్చిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లా ఏకపక్షంగా కాకుండా ఈ ఎన్నికల్లో టీడీపీ కాస్త గట్టి పోటీనిస్తుంది.. ఏకగ్రీవాలకు అంగీకరించలేదు. దాదాపు అన్ని చోట్లా పోటీలోనే దిగింది.. రాష్ట్రవ్యాప్తంగా 12 మున్సిపాలిటీలు, ఒక్క మున్సిపల్ కార్పొరేషన్ నెల్లూరులో ఎన్నికలు జరుగుతున్నాయి.. నెల్లూరు కార్పొరేషన్ సహా 8 మున్సిపాలిటీల్లో వైసీపీకి తిరుగులేనట్టే అనుకుంటున్నారు. గురజాల, దాచేపల్లి, రాజంపేట ప్రాంతాల్లో టీడీపీ కాస్త ప్రతిఘటిస్తున్న.. ఆ పార్టీకి మున్సిపల్ చైర్మన్ కి కావాల్సిన వార్డులు గెలిచే సత్తా లేదని అంచనాలు వేస్తున్నారు. వాటిపై వైసీపీకి కూడా భయం లేదు. ఏ మాత్రం సందేహం లేదు.. కానీ “కుప్పం, ఆకివీడు, జగ్గయ్యపేట, కొండపల్లి మున్సిపాలిటీల్లో గట్టి పోటీ ఉంటుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.. సో.. ఈ మున్సిపాలిటీల్లో ప్రస్తుత పరిస్థితిలు.., పార్టీల అంచనాలపై “న్యూస్ ఆర్బిట్” ప్రత్యేక విశ్లేషణ అందిస్తుంది..!
AP Municipal Elections: కుప్పంలో టీడీపీకి ఈజీ కానీ..!?
మొత్తం 25 వార్డులున్న కుప్పం మున్సిపాలిటీలో ఒక్క వార్డు వైసీపీకి ఏకగ్రీవం అవ్వగా.., మిగిలిన 24 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ రాజకీయం, పార్టీల బలం గురించి ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరం లేదు. కాకపోతే అధికార వైసీపీ బలంగా దృష్టి పెట్టడం.., అధికార బాలం, బలగం మొత్తాన్ని కుప్పంలో దించడంతో టీడీపీకి కాస్త గుబులు పట్టుకుంది. నిజానికి కుప్పం మున్సిపాలిటీలో స్వేచ్ఛగా.., స్వతంత్రంగా ఎన్నికలు జరిగితే టీడీపీ సునాయాసంగా గెలిచే అవకాశాలున్నట్టు చెప్తున్నారు. 24 వార్డులకు గానూ టీడీపీ ఈజీగా 20 వార్డుల్లో గెలుస్తుందని చెప్పుకుంటున్నారు. కాకపోతే వైసీపీ అధికార బలం, పోల్ మేనేజ్మెంట్, పొలిటికల్ వ్యూహాలు కలిసొస్తే వైసీపీ మున్సిపా పీఠం చేజిక్కించుకున్నా ఆశ్చర్యం అవసరం లేదని కొన్ని వర్గాల్లో వినిపిస్తుంది. అదే జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నీరసించినట్టే.. టీడీపీ శ్రేణుల ఆత్మస్థైర్యం దెబ్బతీసినట్టే.. వైసీపీ టార్గెట్ అదే.. అందుకే ఎంత దూరమైనా.. ఎలాగైనా గెలవాలని ప్రణాళికలు వేస్తుంది..!
AP Municipal Elections: ఆకివీడులో పొత్తు సూత్రం..!
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మున్సిపాలిటీలో టీడీపీ బలమైన పోటీనిస్తుంది. కుప్పం తర్వాత టీడీపీ సులువుగా గెలిచే మున్సిపాలిటీ ఇదే అనేది ఆ పార్టీ పెద్దల అంచనా.. పార్టీకి ఉన్న సంస్థాగత బలం, ఎమ్మెల్యే రామరాజు వర్గం.., మాజీ ఎమ్మెల్యే శివరామరాజు వర్గం.. సామజిక ఓటింగ్.., జనసేనతో పొత్తు కలిసి వస్తాయని టీడీపీ భావిస్తుంది. 2019 సాధారణ ఎన్నికల్లో ఆకివీడు మున్సిపాలిటీలో టీడీపీకి 3500 ఓట్లు ఆధిక్యత వచ్చినట్టు ఆ పార్టీ లెక్కలు వేస్తుంది. అయితే ఇక్కడ వైసీపీ కూడా స్ట్రాంగ్ పునాదులతో ఉంది. మంత్రి శ్రీరంగనాథరాజు ఆధ్వర్యంలో నలుగురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు ఈ మున్సిపాలిటీలో చేజిక్కించుకునే ప్రణాళికల్లో నిమగ్నమయ్యారు. అటు టీడీపీ – జనసేన – వామపక్షాలు పొత్తు పెట్టుకోవడంతో మ్యాజిక్ ఫిగర్ కి కావాల్సిన వార్డులు గెలుచుకోగలమని అంచనా వేస్తుండగా.., సంక్షేమ పథకాలు, జగన్ చరిష్మా, పార్టీ బలం కలిసొచ్చి 13 వార్డులను ఈజీగా గెలుచుకుంటామని వైసీపీ ధీమాగా ఉంది..!
జగ్గయ్యపేట.. ఆ ఓటింగ్ పై నమ్మకం..!!
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మున్సిపాలిటీ కూడా ఇరు పార్టీలకు ప్రతిష్టాత్మకమే. 2019 సాధారణ ఎన్నికల్లో జగ్గయ్యపేట పట్టణంలో వైసీపీకి కేవలం 250 ఓట్లు ఆధిక్యత మాత్రమే వచ్చింది. ఈ పట్టణంలో ఆర్యవైశ్య, కమ్మ సామాజికవర్గ ఓటింగ్ బలంగా ఉండడంతో టీడీపీ క్షేత్రస్థాయిలో పాతుకుపోయింది. అయితే ఎమ్మెల్యే సామినేని ఉదయభానుకు మంత్రి పదవి ఊరిస్తుంది. తన బలం పెంచుకుని.., పార్టీలో పట్టు నిలుపుకోవాలంటే ఈ పట్టణంలో వైసీపీ సునాయాసంగా గెలవాలి. అందుకే ఆయన అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం తానుగా వ్యవహరిస్తున్నారు. ఇటు టీడీపీ, అటు వైసీపీ కూడా పోటాపోటీగా ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. అధికార బలం, పోల్ మేనేజ్మెంట్ ప్రణాళికలు వైసీపీకి కలిసొస్తాయని భావిస్తున్నారు. టీడీపీ కాస్త గట్టి పోటీదారుగా ఉంటుందని అంచనా..!
కొండపల్లి.. కృష్ణప్రసాద్ – దేవినేని ఊహలు..!
విజయవాడ పక్కనే.. ఇబ్రహీంపట్నంని ఆనుకుని ఉన్న పట్టణం కొండపల్లి.. ఈ ఎన్నికలు కూడా రాష్ట్రవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కి.. మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుకి వ్యక్తిగత వైరం పెరిగింది. రాజకీయంగా పట్టుకోసం ఇరు వర్గాలు పాకులాడుతున్నాయి. ఇటీవల వ్యక్తిగత విమర్శలు, సవాళ్లు, కేసులతో ఈ మైలవరం నియోజకవర్గం రాష్ట్రస్థాయిలో వేడెక్కింది. ఈ వేడి చల్లారక మునుపే కొండపల్లి ఎన్నికలు రావడంతో టీడీపీ, వైసీపీ బలంగా ఢీ కొడుతున్నాయి. కమ్మ, కాపు, బీసీ ఓటింగ్ అధికంగా ఉన్న ఈ కొండపల్లి పట్టణంలో మొదటి నుండి టీడీపీదే పైచేయి. కానీ ఎమ్మెల్యేగా వసంత కృష్ణ ప్రసాద్ గెలిచిన తర్వాత సంస్థాగతంగా వైసీపీకి పై చేయి వచ్చింది. వైసీపీ నేతల్లో ఊపొచ్చింది. టీడీపీ నేతలు అనేకమంది వైసీపీలో చేరిపోయారు. అదే ఊపుతో కొండపల్లి మున్సిపాలిటీలో సునాయాసంగా 15 స్థానాలు గెలుచుకుంటామని వైసీపీ లెక్కలు వేస్తుండగా.., కనీసం 11 స్థానాలు గెలిచి, మున్సిపల్ చైర్మన్ సీటు కొడతామని టీడీపీ చెప్పుకుంటుంది. అయితే ఏ పార్టీకి గెలుపు అందినా.. కుర్చీకి ఒకటో, రెండో వార్డులు మాత్రమే ఎక్కువ వస్తాయని రాజకీయ అంచనా అందుతుంది..!