AP Police ; ప్రతిభ ఉన్న చోట అహం ఉంటే..? ప్రతిభ ఉన్న చోట ఒత్తిడి ఉంటే..!? ప్రతిభ ఉన్న చోట స్వేచ్ఛ లేకపోతే..!? ఏపీలో పోలీసుల తీరు ఇలాగే ఉంది. ఆంధ్ర ప్రదేశ్ లో పోలీసుల పనితీరుని వంకలు పెట్టలేం. కానీ.., ఖాకీలని ఖద్దరు శాసిస్తున్నప్పుడే ఏపీ పోలీసులకు మరకలు అంటుతున్నాయి. ఇప్పుడు అదే జరుగుతుంది. AP Police ఏపీ పోలీసులపై ఖద్దరు స్వారీ జరుగుతుంది..!
ఏపీలో పోలీసుల ప్రతిభకు కొదవ లేదు. సీఐడీ సాధించిన అవార్డులు.., పోలీసులకు వచ్చిన స్కాచ్ అవార్డులు.., ఏపీ పోలీసులకే ఎక్కువ. దేశంలోని ఏ ఇతర రాష్ట్రాల్లోనూ పోలీసులకు ఇన్ని అవార్డులు లేవు. ఏపీ పోలీసుల మేథస్సు అటువంటిది. ఎంత కఠినమైన కేసునైనా సులువుగా ఛేదించి.., పరిష్కరించే సత్తా ఉంది. కానీ.. కొన్నేళ్లుగా పోలీసులపై మరకలు పడుతున్నాయి. పోలీసుల పనితీరుపై విమర్శలు వస్తున్నాయి.
AP Police ; ఏపీ పోలీస్ నాడు – నేడు..!!
ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉంటే.. ఆ పార్టీకి అనుకూలంగా పోలీసులు, అధికారులు పని చేయడం సహజమే. ఇది ఎవ్వరూ కాదనలేరు. కాకపోతే గత టీడీపీ హయాం నుండి ఇది మరింత పీక్స్ కి చేరింది. ప్రతిపక్ష నేతలపై చీటికీ మాటికీ కేసులు నమోదు చేయడం, అరెస్టులు చేయడం.. అధికార పార్టీ వాళ్లయితే వదిలేయడం ఎక్కువగా ఉంది. 2014 లో తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ పంథా ఎక్కువగా ఉంది. * 2015 లో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇసుక వ్యవహారంలో తలదూర్చి తహసీల్దారు వనజాక్షిని కొట్టినంత పని చేశారు. ఆయనపై అనేక పిర్యాదులు అందినప్పటికీ ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఆ అయిదేళ్ల వ్యవధిలో చింతమనేనిపై అనేక వివాదాలు ఉన్నప్పటికీ అరెస్టు చేసిన దాఖలాలు ఏమి లేవు. * అప్పట్లోనే బోండా ఉమామహేశ్వరరావు.., బుచ్చయ్య చౌదరి, కూన రవికుమార్ వంటి నేతలు వ్యవహరించిన తీరు రాష్ట్రం మొత్తం చూసింది. కానీ వీరిపై పోలీసులు ఏనాడూ చర్యలు తీసుకోలేదు. అదే సమయంలో వైసీపీ నేతలపై ఎక్కువగా కేసులు పెట్టారు. సోషల్ మీడియా పోస్టింగులకు కూడా కేసులు పెట్టి అరెస్టులు చేశారు.
సో.. దానికి కొనసాగింపుగా జగన్..!!
టీడీపీ ఒకటి చేస్తే వైసీపీ రెండు చేస్తుంది. టీడీపీ యాభై చేస్తే.. వైసీపీ వంద చేస్తుంది..! అందుకే ఇప్పుడు పోలీసుల వ్యవహారశైలి మరింత మారింది. పోలీసులపై ఒత్తిళ్లు ఇంకాస్త ఎక్కువయ్యాయి. పోలీసులకు స్వేచ్ఛ కరువయింది. అడ్డగోలు కేసులు, అరెస్టులు ఎక్కువయ్యాయి. టీడీపీ ప్రవేశపెట్టిన పంథాని జగన్ మరింత పీక్స్ కి తీసుకెళ్లి కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసులపై మరకలు ఎక్కువవుతున్నాయి..!!
* నిన్న అచ్చెన్నాయుడిని అరెస్టు చేసారు. వైసీపీ తరపున సర్పంచిగా పోటీ చేస్తున్న అభ్యర్థిని అచ్చెన్నాయుడు బెదిరించారనేది ఆరోపణ. ఇది భలే విడ్డూరమైన కేసు. అచ్చెన్నాయుడు ఏం మాట్లాడారో..? అప్పన్నతో ఎలా మాట్లాడారో..? చాల మంది వినే ఉంటారు. దీనిలో బెదిరింపులు ఏమి లేవు. ఇది కుటుంబ వ్యవహారమే. కాకపోతే అవకాశం దొరికింది.., ప్రతిపక్ష నేతపై కేసు పెట్టి, అరెస్టు చేసేద్దాం అనే ధోరణిలో ఇక్కడ వ్యవహారం సాగింది..!
* అంతకు ముందు టీడీపీ మహిళా విభాగం ఆధిక్యక్షురాలు అనితపై ఎస్సి , ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కూడా అటువంటిదే. ఆమె ఒక ఎస్సి.., ఆమెపై అట్రాసిటీ కేసుతో పోలీసుల తీరు నవ్వుపాలయింది. * పది రోజుల ముందు.. సీఎం జగన్ నివాసం వద్ద ఆందోళన చేయబోయిన వ్యక్తులపై అత్యాచారయత్నం కేసు నమోదు చేయడం విడ్డురమే..! * మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుపై నిర్భయ కేసు.. మాజీ హోమ్ మంత్రి చినరాజప్పపై అట్రాసిటీ కేసు కూడా అటువంటి కోవకే వస్తాయి. మధ్య మధ్యలో టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై నమోదవుతున్న కేసుల్లో అయితే మరీ డొల్లతనం కనిపిస్తుంది. ఈ వ్యవహారం మొత్తంతో మసకబారుతున్నది ఖాకీల ప్రతిష్ట మాత్రమే..!!