నవ్యాంద్ర రాజధానిని అమరావతి నుంచి విశాఖపట్నం తరలించేందుకు కంకణం కట్టుకున్న వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసిపి ప్రభుత్వం ఆ ప్రయత్నంలో శాసనసభ మజిలీ దాటింది. 175 మంది సభ్యుల సభలో 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న అధికారపక్షానికి అసెంబ్లీలో అవరోధం ఎదురవుతుందని ఎవరూ అనుకోలేదు. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేసేందుకు పుట్టిన సిఆర్డిఎ చట్టం రద్దు బిల్లునూ, మూడు రాజధానుల ఏర్పాటుకు సంకల్పించిన పాలనా వికేంద్రీకరణ బిల్లునూ రాత్రి పొద్దుపోయేంతవరకూ జరిగిన చర్చ తర్వాత అసెంబ్లీ ఆమోదించింది.
ఇక అధికార విపక్షాల మధ్య రాజధాని సమరం విధానమండలికి మారింది. విధానమండలిలో టిడిపికి మెజారీటీ ఉన్న కారణంగా అక్కడ అధికారపక్షానికి వ్యవహారం నల్లేరు మీద నడక కాదు. అయినా మండలిలో ఎదురయ్యే అవరోధాలు తాత్కాలికమే తప్ప శాశ్వతం కాదు. మహా అయితే బిల్లుల ఆమోదం కాస్త ఆలస్యం అవుతుంది. ఆ మాత్రం ఆలస్యం కూడా వద్దని ప్రభుత్వం అనుకున్నట్లుయితే ఆర్డినెన్స్ దారి ఉండనే ఉంది.
ఇక ఇప్పుడు నిజంగా ఆలోచించాల్సిన విషయం ఏమంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఈ విషయంలో ఎలా వ్యవహరిస్తుందన్నది. ప్రదాని మోదీతో, హోంమంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి జగన్ ముందే మాట్లాడుకుని రాజధాని తరలింపు ప్రయత్నాలు ప్రారంభించారన్న బలమైన వాదన ఒకటి ప్రచారంలో ఉంది. బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఈ రోజు ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన మాటలు చూస్తే నిజంగానే వారు ఈ ఆంశానికి పెద్ద ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనబడడం లేదు. రాజధాని తరలింపునకు తాము వ్యతిరేకం అని చెబుతూనే, కేంద్రం జోక్యం చేసుకోబోదని వారు స్పష్టంగా చెప్పారు. రాజధాని తరలింపునకు వ్యతిరేకంగా ఉద్యమం చేసే విషయంలో కూడా వారిద్దరూ జనసేనతో కలిసి మాట్లాడాల్సి ఉందని చెప్పారు.
నిజానికి నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంలో రాష్ట్ర విభజన చట్టం ప్రకారమే కేంద్ర ప్రభుత్వం పాత్ర ఉంది. రాజధాని నిర్మాణానికి కేంద్రమే నిధులు సమకూరుస్తుంది. ఆ ప్రకారం కేంద్రం గత అయిదేళ్లలో అమరావతి నిర్మాణానికి కొంతమేర నిధులు సమకూర్చింది కూడా. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా తన చేతులతో అమరావతికి శంఖుస్థాపన చేశారు. ఆ కారణంగా అమరావతి విషయంలో కేంద్రప్రభుత్వానికి ఎంతోకొంత సెంటిమెంట్ ఉంటుందని కూడా అమరావతి గ్రామాల ప్రజలు ఆశ పడ్డారు. ఉద్యమం ప్రారంభంలో వారు మోదీ ఫొటో పెట్టుకుని కూర్చున్నారు. కేంద్రంపై పెట్టుకున్న ఆశలు క్రమంగా ఆవిరయ్యాయి. దానితో పాటు శిబిరాలలో మోదీ చిత్రాలు కూడా మాయమయ్యాయి. కేంద్రప్రభుత్వం నిజంగా జోక్యం చేసుకోదలచుకుంటే వారికి ఏదోఒక దారి దొరకకపోదనీ, బిజెపి పోరాటంతో ఒరిగేది ఏముంటుందనీ రాజధాని గ్రామాలలో ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
బిల్లులు ఉభయసభల ఆమోదం పొందిన తర్వాత అవి గవర్నర్ ఆమోదం కోసం వెళతాయి. గవర్నర్ కూడా మండలిలో లాగా బిల్లులను తొక్కిపట్టవచ్చు. లేదా మళ్లీ పరిశీలించాల్సిందిగా కోరుతూ వెనక్కి పంపవచ్చు. మండలి ఆమోదం కోసం వేచి ఉండకుండా రాష్ట్రప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయాలన్నా బంతి మళ్లీ గవర్నర్ కోర్టుకే వెళ్లకతప్పదు. అయితే గవర్నర్ కూడా ఒక్కసారి వెనక్కు పంపడం తప్ప బిల్లును లేదా ఆర్డినెన్స్ను ఆమోదించకుండా ఉండడం కుదరదు. కొన్ని ప్రత్యేక సందర్బాలలో బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు పంపవచ్చు. అంటే కేంద్ర హోంశాఖ పరిశీలనకు పంపడం అన్నమాట. అయితే ఇలాంటి విషయాలలో గవర్నర్ కేంద్రం సలహా మేరకు వ్యవహరిస్తారన్న సంగతి అందరికీ తెలిసిందే. రాజధాని తరలింపు విషయంలో జోక్యం చేసుకోవడానికి సిద్ధంగా లేని కేంద్రప్రభుత్వం గవవర్నర్ ద్వారా పావులు కదుపుతుందని ఆనుకోవడం అత్యాశే అవుంతుంది
కేంద్రం ద్వారా ఎలాంటి సహాయం అందదని నిర్ధారణ అయితే, అమరావతి రాజధానిగా కొనసాగాలని కోరుతున్న వారికి ఇక మిగిలిన దారి ఉన్నత న్యాయస్థానాలు. పాలనా వికేంద్రీకరణ పేరుతో అమరావతి నుంచి రాజధానిని తరలించేందుకు ప్రభుత్వం నియమించిన వివిధ కమిటీలకు వ్యతిరేకంగా ఇప్పటికే హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే అప్పటికి అధికారికంగా ఎలాంటి నిర్ణయం రానందున తక్షణం స్పందించేందుకు హైకోర్టు నిరాకరించింది. కానీ పిటిషన్లు పెండింగ్లోనే ఉన్నాయి.
రాజధానిగా అమరావతి నిర్ణయం 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం జరిగింది కాబట్టి రాజధానిని మార్చాలంటే ఆ చట్టం సవరణ అవసరమని కొందరు న్యాయనిపుణులు వాదిస్తున్నారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులు ఒప్పందం కుదుర్చుకున్నది సిఆర్డిఎతో కాబట్టి ఆ సంస్థను ఏకపక్షంగా రద్దు చేయడం చట్టవిరుద్ధమని వాదించేవారూ ఉన్నారు. వారి వాదన ప్రకారం అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేస్తామన్న షరతు పైనే రైతులు భూముంలు ఇచ్చారు కాబట్టి, ఆ షరతును ఒకపక్క ఉల్లంఘించి మరోపక్క వారితో కుదుర్చుకున్న ఒప్పందాలను గౌరవిస్తామని ప్రకటించడం కుదరదు. ఆ షరతుకు ప్రభుత్వం లోబడినపుడే రైతులతో చేసుకున్న ఒప్పందాన్ని గౌరవించినట్లు లెక్క. ఈ వాదనలు న్యాయస్థానంలో నిలబడేదీ లేనిదీ తేలేందుకు ఎక్కువ కాలం పట్టకపోవచ్చు.
సురయ్యా