AP Politics : మరో మూడు నెలలు చాలు. సీఎం జగన్ (YS Jagan) కి ఓ గండం గట్టెక్కినట్టే. వైసీపీ (YSRCP) ప్రభుత్వానికి ఓ పెద్ద ఉపశమనం లభించినట్టే. టీడీపీ (TDP) బలం తగ్గినట్టే. టీడీపీ బలగం పోయినట్టే. కేవలం మూడు నెలల్లో ఏపీ రాజకీయాల్లో కొన్ని కీలక మార్పులు జరగబోతున్నాయి. ఇన్నాళ్లు వైసీపీ ప్రభుత్వాన్ని ఆడుకోడానికి.., ఇబ్బంది పెట్టడానికి చంద్రబాబు ఏ బలాన్ని వాడుకున్నారో… ఆ బలం ఇక వైసీపీ పరం అయిపోతుంది. శాసనసభలో బలంగా ఉన్న వైసీపీ.. ఇక మండలిలో కూడా బలాన్ని అమాంతం పెంచేసుకోబోతుంది. కేవలం మూడు నెలల వ్యవధిలోనే వైసీపీకి మండలిలో కొత్తగా 22 మంది రానున్నారు. ఇవన్నీ టీడీపీకి మైనస్. సో.. ఇక టీడీపీ పాత్ర లేనట్టే..!!
AP Politics : 22 ఖాళీ అవ్వనున్నాయి.. ఎలా అంటే..!?
ఏడాదిన్నర కిందట.. అలిగి, కోపం వచ్చి ఆవేశంలో ఏపీ శాసనమండలిని రద్దు చేసేయాలని సీఎం జగన్ అన్నారు కానీ.. ఇప్పుడు తేరుకున్నారు. శాసనమండలిని ఎలా వాడుకోవచ్చో.., దాని కేంద్రంగా ఎన్ని రాజకీయాలు చేయొచ్చో తెలుసుకున్నారు. అందుకే మండలి రద్దు విషయంలో వెనక్కు తగ్గారు. తప్పని పరిస్థితుల్లో మడమ తిప్పారు.
ఏపీలో శాసనమండలిలో మొత్తం స్థానాలు 58. వీటిలో శాసనసభ్యుల కోటాలో 20 .., స్థానిక సంస్థల కోటాలో 20 .., ఉపాధ్యాయుల కోటాలో 5 .., పట్టభద్రుల కోటాలో 5 .., నామినేటెడ్ కోటాలో 8 స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం చూసుకుంటే టీడీపీకి 29 .., వైసీపీకి 13 .., బీజేపీకి 3 , స్వతంత్రలు 3 , పీడీఎఫ్ సభ్యులు 5 .. ఖాళీలు 5 ఉన్నాయి. ఈ బలం చూసుకుని టీడీపీ శాసనమండలి వేదికగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టింది. ప్రభుత్వం తీసుకున్న కీలకమైన బిల్లులను వ్యతిరేకించింది. మండలి ద్వారా తిప్పికోట్టింది. సో… వచ్చే నెల నుండి టీడీపీ బలం తగ్గనుంది. వచ్చే నెలలో 4 , మే నెలలో 3 , జూన్ లో 15 … ఇలా మొత్తం మీద జూన్ నాటికి 22 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవ్వనున్నాయి. వీటిలో టీడీపీవి 17 ఉన్నాయి. అంటే ఇప్పుడు 29 ఉన్న టీడీపీ బలం జూన్ నెలాఖరుకి 12 కి పడిపోతుంది. ప్రస్తుతం 13 సభ్యులు ఉన్న వైసీపీ బలం జూన్ నెలాఖరు నాటికి కనీసం 30 కి చేరనుంది. అంటే ఇక మండలి వేదికగా టీడీపీ బలం చాలదు. వైసీపీ బలం అమాంతం పెరిగిపోనుంది.
వైసిపికే ఎలా అవకాశాలు..!?
ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో ఉన్నవారిలో మార్చి నెలలో నలుగురు (మూడు టీడీపీ, ఒకటి వైసీపీ) .., మే నెలలో ముగ్గురు (బీజేపీ, టీడీపీ, వైసీపీ ఒక్కొక్కరు) పదవీ గడువు తీరిపోతుంది. ప్రస్తుతం శాసనసభలో ఉన్న బలం దృష్ట్యా ఈ స్థానాలన్నీ మళ్ళీ వైసీపీ ఖాతాకే చేరనున్నాయి.
* స్థానిక సంస్థల కోటాలో జూన్ నాటికి 11 ఖాళీ అవుతున్నాయి. వచ్చే నెలలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల ఆధారముగా ఈ స్థానాలకు ఎన్నిక ఉంటుంది. జిల్లాల్లో ఏ పార్టీ పట్టు గట్టిగా ఉంటుందో.. ఆ పార్టీకే ఎమ్మెల్సీ బలం ఉంటుంది. సో.., ఇవి కూడా వైసీపీకె అవకాశాలున్నాయి.
* ఇక నామినేటెడ్ క్యాటగిరిలో నాలుగు ఖాళీలు అవ్వనున్నాయి. దీనిలో మూడు టీడీపీ (టిడి జనార్దన్, బీద రవిచంద్ర, శ్రీనివాసులు) ఉండగా.., ఒకరు వైసీపీ (శమంతకమణి) ఉన్నారు. ఇవి కూడా వైసిపికి దక్కే వీలుంది. సో… ఖాళీ అవ్వనున్న 22 స్థానాల్లో తక్కువలో తక్కువ 18 స్థానాలు వైసీపీకి దక్కనున్నాయి. అందుకే ఆ పార్టీ బలం పెరుగుతుంది..!!
(ఇక ఈ స్థానాలు ఎవరికీ దక్కనున్నాయి. సీఎం జగన్ మనసులో ఎవరున్నారు..? జిల్లాల వారీగా ఆశావహుల పరిస్థితి ఏమిటి..? అనే కీలక విశ్లేషణని వచ్చే కథనంలో చూద్దాం)