AP Politics ; విశాఖ ఉక్కు ఉద్యమం… విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ పేరుతో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసారు..! విశాఖలో మొత్తం 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.. నగరం పరిధిలోనే 4 ఉన్నారు. వీరిలో ఏ ఒక్కరూ తీసుకొని నిర్ణయాన్ని గంటా తీసుకుని, రాజీనామా చేసేసి.. త్వరగా ఆమోదించేయాలని పట్టుపడుతున్నారు..! ఇదంతా ఉక్కు ఉద్యమం కోసమని.., ఆయన గొప్పతనమని కొందరు అనుకుంటే అనుకోవచ్చు..!! కానీ దీని వెనుక కొన్ని కీలక కారణాలు / రాజకీయ అంశాలు ముడిపడి ఉన్నాయి. “న్యూస్ ఆర్బిట్” ప్రత్యేకంగా ఈ విశ్లేషణ అందిస్తుంది.
AP Politics ; మొదట ఒక సూటి విషయం ఆలోచిద్దాం..!!
విశాఖ ఉక్కు ఉద్యమం ప్రస్తుతం ఆ ఉద్యోగులు, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల చేతిలో ఉంది. ఇంకా రాజకీయ రంగు పులుముకోలేదు. అన్ని పార్టీలు మద్దతుగా వెళ్తున్నాయి. ఇక్కడ ఏ ఎమ్మెల్యేకు రాజీనామా చేయాలనే ఆలోచన రాకుండా.. కనీసం ఉద్యమకారుల నుండి ఆ డిమాండ్ కూడా లేకుండా..
కేవలం గంటా శ్రీనివాసరావుకు మాత్రమే రాజీనామా ఆలోచన వచ్చింది అంటే..? కొన్ని ప్రత్యేక కారణాలు, అంశాలు కచ్చితంగా ఉంటాయి. గంటా ఉన్న రాజకీయ పరిస్థితులు, ఆయన మలుపులు ఆలోచిస్తే ఇది తెలుస్తుంది. ఒక ఎమ్మెల్యే తన పదవిని తృణ ప్రాయంగా వదులుకునేంత స్వచ్ఛ రాజకీయాలు మన రాష్ట్రంలో లేవు.., గంటా గత రాజకీయ నేపథ్యం చూస్తే ఆ స్వచ్ఛత మచ్చుకైనా లేదు..!
MLA Ganta ; చీకటి నుండి వెలుగులోకి.. ఒక అవకాశం..!!
గంటా శ్రీనివాసరావు ప్రస్తుతం చీకటిలో ఉన్నారు. 2019 వరకు వరుసగా రెండు ప్రభుత్వాల్లోనూ మంత్రిగా చక్రం తిప్పిన చోట ఆయనను ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదు. పార్టీ మారాలని ప్రయత్నం చేసినప్పటికీ జగన్ దగ్గర ఆమోదం దొరకడం లేదు. ఆయన టీడీపీలో నమ్మకంగా ఉండడంలేదు కాబట్టి.. ఇటు టీడీపీ కూడా ఆయన్ను పట్టించుకోవడం లేదు. బీజేపీలోకి వెళ్లాలని ఆ మధ్య ప్రయత్నాలు చేసినప్పటికీ.. అలా చేస్తే తన ప్రత్యక్ష ప్రజాసంబంధాల పోతాయని వెనుకడుగు వేశారు. సో… ఆయన ఒక రాజకీయ కూడలిలోకి వచ్చేసారు.
* విశాఖ ఉత్తర నియోజకవర్గం నుండి 2019 లో గెలిచినప్పటికీ.. పెద్దగా ఉనికి చాటలేదు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా తన పాత్ర పోషించలేదు. గడిచిన 21 నెలల్లో ఎక్కడా ఉనికి కూడా లేదు. అంటే “పార్టీ మార్పు కుదరక, ప్రతిపక్షంలో ఉండలేక, ప్రజల్లోకి వెళ్లలేక, తాను నిర్మించుకున్న అక్రమ సామ్రాజ్యం అక్కడక్కడా కూలుతుంటే చూస్తూ ఉండలేక”… ఒకరకమైన చీకటిలోకి వెళ్లిపోయారు. సరిగ్గా అటువంటి సమయంలో “విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ” అనే ఉద్యమం ఊపిరి పోసుకుంది. ఒక రాజకీయ నాయకుడికి ఉనికి చాటుకోవాలంటే ఉద్యమమే కదా ప్రధానం. “ఈ ఉద్యమం పేరిట తన రాజకీయ ఒత్తిళ్లు తీరుతాయి.. పైగా ఉద్యమం కోసం రాజీనామా చేశారు అనే పేరు మిగులుతుంది”..! అందుకే తన చీకటిని వదిలేసి, వెలుగులోకి వచ్చే ప్రయత్నంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఆయన ఉండలేకపోతున్నారు. సో.., ఆ పదవి తనకు ఉన్నా, లేకపోయినా ఒకటే. అలా ఉద్యమాన్ని సాకుగా చూపి బయటకు రాగలిగారు.
ఇప్పుడు ఏం చేస్తారు..!?
గంటా తన రాజీనామాను ఆమోదించుకునే పనిలో ఉంటారు. అంటే ఒక బాధ్యత నుండి తప్పించుకుంటారు. ఆ తర్వాత స్వేచ్ఛగా ఉండగలుగుతారు. ఈ ఉద్యమం జరిగినన్నాళ్లు కొన్నాళ్ళు ఉద్యమ బాటలోనే ఉంటారు. మొత్తం చల్లారిన తర్వాత మళ్ళీ సైలెంట్ అవుతారు. అప్పటికి ఒకవేళ టీడీపీ యాక్టీవ్ అయితే.. పార్టీ పరిస్థితి బాగుంది అనుకుంటే అదే పార్టీ నుండి మళ్ళీ పోటీ చేస్తారు. లేకపోతే వైసీపీలోకి ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఈ లోగా విశాఖ ఉత్తర నుండి రాజీనామా చేశారు – ఉద్యమం కోసం పదవిని వదిలేశారు అనే పేరు ఎలాగూ ఉంటుంది కాబట్టి…, అక్కడ పరిస్థితులు అన్నీ అనుకూలిస్తే అక్కడి నుండి పోటీ చేస్తారు.. లేకపోతే నియోజకవర్గం మార్చుకుంటారు. తనకు మారడం కొత్త కాదు..!!
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?