ఏపీలో కమ్మ కులం కొత్త ఎత్తులేమిటి..?
వారి తాజా రాజకీయ ఆలోచనలేమిటి..?
వారి ఎదుగుదల అడుగులు ఎటువైపు..?
చంద్రబాబుకి ఇన్నాళ్లు ఊడిగం చేసి, బాబు విజయంలో కీలకంగా పనిచేసిన కమ్మ సామాజికవర్గం.., ఇప్పుడు లోకేష్ కి అలా చేయడానికి సిద్ధంగా లేదు. టీడీపీకి కొత్త నాయకత్వం వచ్చే అవకాశం కనిపించడం లేదు. అందుకే కొత్త ఎత్తులు వేస్తుంది. కమ్మ సామాజికవర్గంలోని కొందరు కీలక నాయకులు కొత్త ఆలోచనలు చేస్తున్నారు. అవేమిటో… వాటి అమలు ప్రణాళికలు ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం..!
అంతర్గత ఆలోచనలతో రగులుతున్నారు…!
గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలో కమ్మ సామజిక వర్గం ఇబ్బందులు పడుతుంది. ఎవరు అంగీకరించిన, ఎవరు ఒప్పుకోకపోయినా వైసీపీ ప్రభుత్వం, అధినేత జగన్ కమ్మ సామాజికవర్గంపై ఓ కన్నేసి ఉంచారు. తన కింద, తన నీడలో ఉంటె అభయం.., లేకపోతే ఆ “భయం” అనేట్టుగా వ్యవహరించడానికి వెనుకాడడం లేదు. అందుకే కొందరిని టార్గెట్ చేశారు, కొందరిని తన పార్టీలో చేర్చుకున్నారు. మరి జగన్ అంటే గిట్టని వారి సంగతేమిటి…? జగన్ అంటే అసలు గిట్టక అతన్ని ఎలాగైనా దించేయాలి అనుకుంటున్న వారి సంగతి ఏమిటి..? 2024 టీడీపీ వలన అది సాధ్యమవుతుందా..? 2024 వరకు పక్కన పెడితే అప్పటి వరకు తాము ఎంత వరకు భద్రంగా ఉండగలం..? తమ వ్యవహారాలు, వ్యాపారాలు ఎంత వరకు భద్రంగా ఉంటాయి…? అనే అంతర్గత ఆలోచనలతో రగులుతుంది ఓ వర్గం.
బీజేపీలోకి వెళ్తే “కాపు”రం చేయాల్సిందేనా…!!
ఇక టీడీపీపైనా… లోకేష్ పైన నమ్మకం లేని కొందరు కమ్మ నాయకులు సరికొత్త ఎత్తులు వేస్తున్నారు. వారికి ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం బీజేపీలోకి వెళ్లడం. అక్కడకు వెళ్లినా కొన్ని చిక్కులు ఉన్నాయి..!
* బీజేపీలో ఇప్పటికే కాపు హవా ఎక్కువగా ఉంది. జనసేన పార్టీతో కలిసి నడుస్తున్న బీజేపీలో కాపు నాయకులు అధికంగానే ఉన్నారు. నిజానికి ఈ రాష్ట్రంలో బీజేపీ ఆశలు కూడా ఆ సామాజికవర్గంపైనే ఉన్నాయి. అటువంటి సమయంలో కమ్మ సామాజికవర్గం బీజేపీలోకి దూరి.., కాపుల కింద, లేదా కాపులతో కలిసి పని చేయగలదా..? “సుజనా చౌదరి” అంటే పెద్ద స్థాయిలో లాబీయింగులు చేసుకుని నెట్టుకొస్తున్నారు.., కానీ అందరికీ అది సాధ్యం కాదు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీలోకి వెళ్లి కాపులతో కలిసి నడిచి 2024 నాటికి అధికారం పొందడం ఒక ఎత్తు..!
* ఇక గంపగుత్తగా కమ్మ సామాజికవర్గంలోని కీలక నాయకులు ఒకేసారి బీజేపీలోకి వెళ్లి రాష్ట్రంలో ఆధిపత్యం అడగడం మరో ఎత్తు. ఈ సామాజికవర్గంలో రాజకీయ తెగువ, తెలివి అధికం. అందుకే మూకుమ్మడిగా బీజేపీ పెద్దలతో (వెంకయ్య) అండతో ఆ పార్టీలో నాయకత్వం చెలాయించడం కూడా మార్గమే. బీజేపీలో ఇప్పటికే పురంధేశ్వరి, కావూరు సాంబశివరావు, కామినేని శ్రీనివాస్ వంటి కమ్మ సామాజికవర్గం నాయకులు ఉన్నప్పటికీ పెద్దగా వెలుగులోకి రావడం లేదు. ఇప్పుడు టీడీపీలోని కీలక నాయకులూ కూడా చేరిపోతే బీజేపీలో హవా నడిపించడం అనేది వ్యూహంగా కనిపిస్తుంది.
ఈ కథనానికి ముందు భాగం… రాష్ట్రంలో కమ్మ సామాజికవర్గం – టీడీపీ మధ్య వ్యవహారం మొత్తం దిగువ పేర్కొన్న కథనంలో రాసాము.
“చంద్రబాబూ- కులమూ.! “కమ్మ”దనం ఎక్కడ చెడింది.? (ఎక్సక్లూసివ్ స్టోరీ)”