AP Politics: ఏపీ రాజకీయాల్లో సంచలన మార్పులకు బీజాలు పడుతున్నాయి.. పార్లమెంట్ స్పీకర్ పరిధిలో ఉన్న ఒక నిర్ణయం ఇప్పుడు ఏపీ రాజకీయాలను శాసించనుంది.. ఏపీలో ఒక్కసారిగా రాజకీయ పొయ్యి వెలిగించనుంది..! వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణం రాజు ఆ పార్టీకి, ప్రభుత్వానికి, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డికి కొరకరాని కొయ్యగా మారిన సంగతి తెలిసిందే. ఏడాదిన్నరగా సొంత ప్రభుత్వ విధానాలను, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 11 నెలల క్రితం రఘురామపై అనర్హత వేటు వేయాలంటూ ఆ పార్టీ నేతలు లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాకు పిటిషన్ అందజేసినా నెలలు గడుస్తున్నా చర్యలు కనబడలేదు. ఆ తరువాత రఘురామ మరింత రెచ్చిపోయి విమర్శల దాడి పెంచారు. దీంతో ఏపి సీఐడీ ఆయనపై రాజద్రోహం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి జైలుకు పంపడం, సుప్రీం కోర్టు బెయిల్ మంజూరుతో ఆయన బయటకు రావడం జరిగింది. ఇంత జరిగినా రఘురామ తగ్గారా అంటే అదీ లేదు. మీడియా ముందుకు వచ్చి మాట్లాడవద్దని సుప్రీం కోర్టు సూచనలు చేస్తే రచ్చబండ కార్యక్రమానికి స్వస్తి పలికి సీఎం జగన్ కు లేఖాస్త్రాలు సంధిస్తూ మీడియాలో నిత్యం కనిపిస్తూనే ఉన్నారు.
AP Politics: అటూ ఇటూ కీలక వాదనలు..!!
ఇక లాభం లేదని భావించిన వైసీపీ అధిష్టానం..రఘురామ పై ఇక అనర్హత వేటు వేయించాల్సిందే అన్న కృతనిశ్చయంతో మరిన్ని బలమైన ఆధారాలతో మరో సారి అనర్హత పిటిషన్ ను స్పీకర్ ఓంబిర్లాకు అందించింది. అయితే ఈ పిటిషన్ తో స్పీకర్ కార్యాలయం నుండి కొంత కదలిక అయితే వచ్చింది. చర్యలు ఎంత వరకూ ఉంటాయనేది ప్రస్తుతం చెప్పలేని పరిస్థితి ఉన్నా రఘురామతో సహా టీఎంసీ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపిలకు పార్టీ దిక్కార ఆరోపణలపై వివరణలు ఇవ్వాలంటూ లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా నోటీసులు జారీ చేశారు. ఓ సభ్యుడిపై అనర్హత వేటు పడాలంటే.. ప్రాధమికంగా ఓ పార్టీ నుండి గెలుపొంది ప్రత్యర్థి పార్టీతో కలిసి పని చేయడం, లేదా పార్టీ విప్ దిక్కరించి ఓటింగ్ లో పాల్గొనడం, ప్రత్యర్థి పార్టీ కండువా కండువా కప్పుకొని ఆ పార్టీ ర్యాలీలో పాల్గొనడం, పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడటం లాంటివి నిరూపించాలి. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని రఘురామపై చేస్తున్న ఫిర్యాదుకు ఆయన పార్టీలో, ప్రభుత్వంలో లోపాలను మాత్రమే ఎత్తి చూపుతున్నానని రఘురామ సమర్థించుకుంటున్నారు.
అయితే రఘురామపై అనర్హత వేటు వేయించాలని వైసీపీ తీవ్ర స్థాయిలో పట్టుదలతో ఉన్న నేపథ్యంలో 70 శాతం తనపై అనర్హత వేటు పడదన్న ధీమాతో రఘురామ ఉన్నారు. ఒక వేళ అనర్హత వేటు పడితే నర్సాపురం నుండి ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం. వైసీపీకి వ్యతిరేకంగా పోటీ చేస్తూ టీడీపీ, బీజేపీ, జనసేన మద్దతు తీసుకోవాలని ఆలోచన చేస్తున్నారనీ, అందుకు ఓ పత్రికాధిపతి మధ్యవర్తిత్వం నడుపుతున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఒక వేళ రఘురామపై అనర్హత వేటు పడితే…ఇక్కడ ఏపి అసెంబ్లీలో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలపైనా స్పీకర్ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
అదే కోవలోకి ఈ నలుగురి సంగతి..!?
రఘురామపై ఏవైతే నిబంధనలు వర్తిస్తాయో ఇక్కడ టీడీపీ నుండి గెలిచి వైసీపీ పంచన చేరిన ఎమ్మెల్యేలపైనా స్పీకర్ తమ్మినేని చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. దీనిపైనా వైసీపీ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించడం గానీ లేక రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు వెళ్లడానికి అంతర్గతంగా వైసీపీ చర్చిస్తున్నట్లు సమాచారం. సో.. ఒక వేళ ఉప ఎన్నికలు గనుక వస్తే నర్సాపురం ఎంపి స్థానంతో పాటు గన్నవరం, చీరాల, విశాఖ దక్షిణ, గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతాయి. ఒక్క అనర్హత వేటు పడితే ఏపిలో రాజకీయాలు ఇంతగా మలుపులు తిరిగే అవకాశం ఉంది. ఒక వేళ ఉప ఎన్నికలు వస్తే మాత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా మారే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.