AP PRC: ప్రభుత్వం అంటే అనేక ఒత్తిళ్లుంటాయి.. అనేక వ్యవహారాలుంటాయి.. అన డిమాండ్లుంటాయి.. అనేక వ్యతిరేకతలుంటాయి.. అనేక వ్యవహారాలకు చాలా సున్నితంగా డీల్ చేయాల్సిన అవసరం ఉంటుంది.. కానీ ప్రస్తుతం ఏపీలో ఉద్యోగుల నిరసనలను, పోరాటాలను, ఉద్యమాలను వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా డీల్ చేస్తుంది..!? అనేది ఆలోచించాల్సిన అంశమే..! ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉద్యోగుల ఆందోళన హాట్ టాపిక్ గా నడుస్తోంది. నూతన పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగులు సమ్మె బాట పట్టడం, ప్రభుత్వానికి
వ్యతిరేకంగా మారటం కీలక పరిణామం. దీన్ని వైసీపీ ఏ విధంగా డీల్ చేస్తోంది..? సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి టీమ్ ఏ విధంగా డీల్ చేస్తుంది అంటే కొన్ని అనూహ్యమైన, ఆశ్చర్యమైన దారులు తోస్తున్నాయి..!
AP PRC: ఇంటింటికీ పత్రాలు పంపిణీ..!
ఉద్యోగులకు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను, వేతనాల వివరాలను వాలంటీర్ల ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉద్యోగులనే తప్పు బట్టే పరిస్థితికి తీసుకువస్తుంది. ఉద్యోగులారా ఆలోచించండి అంటూ కరపత్రాలను ముద్రించి వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పంపిణీ చేస్తున్నారు. ప్రజల వద్ద ఉద్యోగులను చెడు చేయాలన్నది ఇక్కడ ప్రధాన ఉద్దేశం. ఇది ఒక విధంగా కరెక్టు కాకపోయినా ప్రభుత్వం ఆ విధంగా చేస్తుంది. వాస్తవానికి ఉద్యోగులను దారికి తెచ్చుకునేందుకు కమిటీలను వేయాలి, చర్చలకు పిలవాలి. చర్చలు జరిపి సమస్యను సానుకూలంగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలి. ఉద్యోగులకు హెచ్ఆర్ఏ, ఐఆర్ తగ్గడంతో ఉద్యోగుల్లో ఆ దామాషా ప్రకారం వేతనం తగ్గుతోంది. కానీ ఆ విషయాన్ని ప్రభుత్వం చెప్పకుండా వేతనాలు పెరిగాయని ప్రచారం చేస్తోంది. ఉద్యోగులకు సంబంధించి హెచ్ఆర్ఏలు, డీఏలు, ఐఆర్ ల గురించి ప్రజలు అసలు పట్టించుకోరు. వారికి ఆ అవసరం కూడా ఉండదు. ఇవి అన్నీ ప్రజలకు తెలియకపోవడం వల్ల జీతాలు పెంచినా ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు అంటూ ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకువెళుతోంది. దీని వల్ల ఉద్యోగుల పట్ల ప్రజల్లో సానుభూతి రాకుండా చూస్తోంది. వాస్తవానికి ఈ విషయంలో ప్రభుత్వం చేస్తున్నది తప్పుడు విధానమే అయినప్పటికీ ఓటర్లను ఉద్యోగులు ప్రభావితం చేయకుండా ఉండటం కోసం ఇది చైతన్య కార్యక్రమంగా చెప్పుకోవచ్చు.
సమ్మె చేస్తే.. ప్రభుత్వ దారి..!?
ఉద్యోగులు ప్రస్తుతం సమ్మె నోటీసు ఇచ్చారు. ఫిబ్రవరి 7 నుండి సమ్మెకు దిగడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వం ఏ మాత్రం తలొగ్గడం లేదు. పీఆర్శి విషయంలో ఆ మాత్రం వెనక్కు తగ్గడం లేదు.. అంటే దాదాపు సమ్మె ఖాయమైనట్టే.. ఈ లోగా జరిగే చర్చల ఫలితంగా సమ్మె సైరన్ మోగుతుంది.. అయితే ప్రభుత్వమే కాస్త ఆలోచన చేస్తే మంచిది అనేది పెద్దలు సూచిస్తున్నారు. ఉద్యోగులను వ్యతిరేక ధోరణిలో చూసేకంటే.., దారిలోకి తెచ్చుకునే మార్గాలు వెతకడం మంచిదని గత అనుభవాలు తెలిసిన నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎన్టీఆర్, వైఎస్, చంద్రబాబు లాంటి వాళ్ళు కూడా ఎప్పుడు ఉద్యోగులకు వ్యతిరేకంగా ఇంత ఘాటుగా నిర్ణయాలు తీసుకోలేదని.. జగన్ ప్రభుత్వం ఉద్యోగులకు నచ్చని నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా.. వారికి వ్యతిరేకంగా మీడియాల్లో, సోషల్ మీడియాల్లో ప్రచారానికి దిగడమే ఇప్పుడు ఉద్యోగ సంఘాలను ఎక్కువగా రెచ్చగొట్టేలా ఉంది..!