AP Sea Ports: విద్య, వైద్యం, రక్షణ, హోమ్ తప్ప మిగిలిన అన్ని రంగాలను ప్రైవేట్ పరం చేస్తామన్నా కేంద్రం నిర్ణయం ఎంత వరకు అమలవుతుందో అనుమానమే..! కానీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆ నిర్ణయాలను సమర్ధవంతంగా అమల్లోకి తీసుకొస్తుంది. పాల సేకరణని ఎవ్వరూ ఊహించని విధంగా కార్పొరేట్ కంపెనీ అయిన అమూల్ కి అప్పగించారు. పాడి పరిశ్రమ అభివృద్ధి అంటే ఏపీ డెయిరీ ద్వారా వృద్ధి లోకి తీసుకొస్తారని చాల మంది భావించారు.. కానీ సీఎం జగన్ మాత్రం కార్పొరేట్ ద్వారానే తన లక్ష్యం నెరవేరుతుందని అమూల్ ని రంగంలోకి దించారు.. ఇక తీర ప్రాంతాల్లో కార్పొరేట్ కి పూర్తిగా పచ్చ జెండాలు ఊపుతున్నారు. ఏపీలో కీలక పోర్టులుగా ఉన్న గంగవరం, కృష్ణపట్నం పోర్టులు ఇప్పటికే ప్రైవేట్ పరం అయ్యాయి. దేశంలో టాప్ లో ఉన్న కార్పొరేట్ దిగ్గజం.. గుజరాత్ కి చెందిన అదానీ పోర్టు కంపెనీకి వెళ్లిపోయాయి. తాజాగా కాకినాడ పోర్ట్ కోసం బేరాలు జరుగుతున్నాయి..!
AP Sea Ports: మంచికా..? చెడుకా..!?
నిజానికి ఏపీలోని పోర్టుల్లో ఇప్పటి వరకు ప్రైవేట్ పరంగా ఉన్నవి ఏమీ లేవు. ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రైవేట్ కంపెనీలు నడుపుతున్న పోర్టులు ఉన్నాయి. విశాఖలోని మేజర్ పోర్ట్ మొత్తం కేంద్రం చేతిలో ఉంటుంది. మిగిలిన కాకినాడ, గంగవరం, కృష్ణపట్నం తరహా మైనర్ పోర్టులు రాష్ట్రం – ప్రైవేట్ కంపెనీ భాగస్వామ్యంతోనే నడుస్తున్నాయి. మేజర్ పోర్టుల్లో వాటాకి, వ్యాపారానికి రాష్ట్ర ప్రభుత్వాలకు ఏమి సంబంధం ఉండదు. మైనర్ పోర్టులు మాత్రమే రాష్ట్రాలకు వాటా ఉంటుంది. సో.. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయ వనరుగా ఉన్న కృష్ణపట్నం పోర్టు, గంగవరం పోర్టులు ప్రైవేట్ కి అప్పగించేశారు. ఇప్పటి వరకు ఉన్న 25 శాతం వాటాని కూడా రాష్ట్రం వదులుకుంది. ఏపీకి తీరాన ఉన్న ఏకైక ఆదాయ వనరు కాకినాడ పోర్టు. తాజాగా జరుగుతున్నా చర్చల ప్రకారం ఈ పోర్టు కూడా పూర్తిగా అమ్మకానికి సిద్ధమవుతోంది. ఓ ఎంపీ బంధువులకు చెందిన కంపనీకి అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది రాష్ట్రానికి మంచి చేస్తుందా, చెడు చేస్తుందా అనేది ఒకసారి ఆలోచించాల్సి ఉంది.
టీడీపీ ముద్ర పూర్తిగా పోయేలా..!?
కృష్ణపట్నం పోర్టు అదానీ తీసుకోక మునుపు నవయుగ చేతిలో ఉండేది. పూర్తిగా కమ్మ సామాజికవర్గందే ఆధిపత్యం. వైఎస్ సీఎం అయిన తర్వాత కూడా వారిని కాదనకుండా జాగ్రత్తగానే చూసుకున్నారు. గంగవరం పోర్టు డీవీఎస్ రాజు చేతిలో ఉండేది. కాకినాడ పోర్ట్ ప్రస్తుతం కర్నాటి వెంకటేశ్వరరావు చేతిలో ఉంది. ఆయన కమ్మ సామాజికవర్గం. గత పదిహేడేళ్ళుగా కాకినాడ పోర్టు, కాకినాడ సెజ్, ఆ సమీప వ్యాపార సముదాయాలన్ని ఆయన పేరిట ఉన్నాయి. వైఎస్ రాజకేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు ఈ ముఖ్యమంత్రులు ఎవ్వరూ వారి జోలికి వెళ్ళలేదు. మరో 13 ఏళ్ళు ఒప్పందం ఉంది. కానీ జగన్ అలా సైలెంట్ గా ఉందేరకం కాదు. పోర్టులైనా.., కంపెనీలైనా తాను అనుకున్న వారికి కట్టబెట్టడానికి ఏ మాత్రం వెనుకంజ వేయరు. అందుకే తాను రాజకీయ శత్రువులుగా భావిస్తున్న కమ్మ సామాజికవర్గం ఆర్ధిక మూలాలు దెబ్బతీసే క్రమంలో ఒక్కోటీ నష్టం చేసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే కాకినాడ పోర్టుని కూడా వారికి కాకుండా చేయాలనేది సీఎం వ్యూహం. అందుకే తనకు అత్యంత నమ్మకమైన ఏ ఎంపీ బంధువుల ద్వారా ప్రస్తుతం పోర్టుకి బేరసారాలు జరుగుతున్నట్టు సమాచారం..!