AP SEC ; జస్టిస్ కనగరాజ్ ఏపీలో అందరికీ బాగా గుర్తుండే పేరు. ఏపీలో రెండు వ్యవస్థల మధ్య జరిగిన పోరులో ఆయన మధ్యలో దూరి.., అభశుభాలుపాలయ్యారు..! గత ఏడాది ఏ కుర్చీలో ఆయన్ను కూర్చేబెట్టడానికి ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకువచ్చిందో… ఇప్పుడు అదే కుర్చీలో ఆయన కాకుండా మరో ముగ్గురు పేర్లని సిఫారసు చేసింది. దీనికి కొన్ని న్యాయ పరమైన కారణాలు ఉన్నప్పటికీ.., ప్రభుత్వం పరిష్కరించుకోలేనివి ఏమి కాదు..!!
గత ఏడాది నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని తొలగించే క్రమంలో ప్రభుత్వం రెండు అత్యవసర ఆర్డినెన్సులు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. “ఒకటోది ఎన్నికల కమీషనర్ పదవీ కాలం కుదింపు. రెండోది ఎన్నికల కమీషనర్ గా విశ్రాంత ఐఏఎస్ కాదు, విశ్రాంత జడ్జి ఉండాలి”.. ఈ రెండూ సుప్రీం కోర్టు కొట్టేసింది. నిమ్మగడ్డని మళ్ళీ కుర్చీ ఎక్కించింది. కాకపోతే ఇప్పుడు నిమ్మగడ్డ స్వతహాగా దిగిపోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు ప్రభుత్వం ఓ ఆర్డినెన్సు ని తీసుకొచ్చి జస్టిస్ కనగరాజ్ ని నియమించే వీలుంది. దీనికి న్యాయపరంగా చిక్కులు ఏమి ఉండబోవు. అప్పుడంటే నిమ్మగడ్డ తనకు అన్యాయం జరిగింది, ఆర్డినెన్సులు చెల్లవు అని కోర్టుకి వెళ్లారు కాబట్టి… సుప్రీం స్పందించింది. ఇప్పుడు మాత్రం ఫ్రెష్ నియామకం కాబట్టి ప్రభుత్వ ఇష్టమే. కనగరాజ్ కి కూడా అవకాశం ఇవ్వవచ్చు. కానీ ప్రభుత్వ ప్రయారిటీలు వేరే ఉన్నాయి.
AP SEC ; జగన్ ఆశించిన ఫలితం చూపలేదనా..!?
జస్టిస్ కనగరాజ్ నియామకంలో సీఎం జగన్ కొన్ని ట్రిక్కులు వాడారు. నిమ్మగడ్డ కోర్టుకి వెళ్తే.. ఈయన ఎలాగూ జస్టిస్ కాబట్టి… కొన్ని ప్రాధమిక న్యాయ సూత్రాల ఆధారంగా ప్రభుత్వాన్ని సేవ్ చేస్తారని అనుకున్నారు. కానీ కనగరాజ్ వల్ల ఆ పని కాలేదు. ఈయన బాగా స్లో. నెమ్మదస్తుడు. పైగా వయసు కూడా 75 కి పైబడింది అని అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. మనిషి నెమ్మదస్తుడు కావడం.. గత ఏడాది తన లీగల్ పవర్ చూపకపోవడం సహా… వయసు పైబడిన రీత్యా మళ్ళీ అతనికి అవకాశం ఇవ్వకూడదు అనుకున్నారేమో.. మొత్తానికి ఈ వ్యవహారంతో కనగరాజ్ కొంచెం హర్ట్ అయ్యే ఉంటారు.
ప్రత్యేక పదవి..!? న్యాయ సలహాదారుడిగా..!?
ఆయనను రాత్రికి రాత్రి చెన్నై నుండి పిలిపించారు. బాధ్యతలు స్వీకరించేలా చేశారు. మొత్తంగా బాగానే ఉంది. ఎన్నికల కమీషనర్ గా నిమ్మగడ్డ మళ్ళీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా కొన్ని నెలలు కనగరాజ్ ఏపీలోనే ఉన్నారు. అప్పుడప్పుడూ ఏపీ ఉన్నతాధికారులు, రాజకీయ నేతలతో భేటీలు వేశారు. ఆయన అద్దెకు ఉన్న భవంతి కూడా పెద్దదే. అప్పుడు అలా ముగిసిన తర్వాత కొంచెం అవమానకర రీతిలో ఏపీ నుండి వెళ్లిపోయారు. తాజగా ఆయనను ఇక ఎన్నికల కమీషనర్ గా నియమించే అవకాశం లేదు అని స్పష్టత వచ్చేసింది. అందుకే జస్టిస్ కనగరాజ్ ని ఏపీ ప్రభుత్వ న్యాయ సలహాదారుగా నియమిస్తే బాగుంటుంది అని సీఎం జగన్ భావిస్తున్నారట. గత ఏడాది తాను పిలిచిన వెంటనే రావడం.., బాధ్యతలు స్వీకరించడం.. ఇన్నాళ్లు వేచి చూడడంతో జగన్ కి, కనగరాజ్ కి మధ్య బాగానే గురి కుదిరినట్టు ఉంది. అందుకే తెరవెనుక జస్టిస్ చలమేశ్వర్ ఉంటూ.., తెరముందు మాత్రం కనగరాజ్ ద్వారా ప్రభుత్వ లీగల్ సెల్ నడిపించాలని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తుంది..!!