సంక్షేమ పథకాల అమలులో దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విధాన పరమైన నిర్ణయాలను తీసుకోవడంలో తడబడుతున్నారా అంటే… వరుసగా జరుగుతున్నా పలు పరిణామాలు నిజమనేలా ఉన్నాయి. తాజాగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఇసుక విధానం మొత్తం మారిపోయేలా కొత్త విధానం ప్రభుత్వం తీసుకువచ్చేందుకు సిద్ధం అయ్యింది. దీన్ని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థలకు నిర్వహణ అప్పగించాలని అనుకున్నారు. అయితే సుమారు 10 కేంద్ర సంస్థలను సంప్రదించిన ఎవరు ఇసుక విషయంలో తలదూర్చి తర్వాత చేతులు కాల్చుకునేందుకు ముందుకు రాలేదు. ఫలితంగా ఇసుక నిర్వహణ బాధ్యత ప్రైవేట్ సంస్థలు, వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు ప్రభుత్వం దాదాపు సిద్ధంగా ఉంది.
ఎందుకీ తడబాటు !!
టీడీపీ హయాంలో ఇసుక విషయంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఆ పార్టీ ప్రతిష్టను అభాసుపాలు చేసాయి. దింతో వైస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇసుక పాలసీ విషయంలో అప్పటికి అప్పుడు కొత్త విధానం తీస్కుని వచ్చారు. దీని మీద కొన్ని రోజుల కసరత్తు జరిగింది. సుమారు 2 నెలల వరకు ఇసుక రీచ్ లను మూసేసి మరి కొత్త పాలసీ పారదర్శకంగా ఉంటుందని మొదలు పెట్టారు. ఇసుక దొరక్క భవననిర్మాణ రంగ కార్మికులు సైతం రోడ్డున పడ్డారు. తర్వాత ఆన్లైన్ విధానం ద్వారా ఇసుక బుక్ చేసుకునేలా ఏర్పాట్లు చేసారు. అవసరం అయినా వాళ్ళు ఈ సేవ కేంద్రాల ద్వారా ఇసుక బుక్ చేసుకుంటే వెంటనే ఇసుక వస్తుంది అని ప్రకటించారు. ఏది క్షేత్ర స్థాయిలో పనిచేయలేదు. దింతో పటు ఇసుక రీచ్ ల వద్ద ఉన్న సిబ్బంది అడ్డదారుల్లో దళారులను ప్రోత్సహహించడంతో సామాన్యుడికి ఇసుక దూరం అయ్యే పరిస్థితి వచ్చింది. ఇసుక ఆన్లైన్లో బుక్ చేస్తే ఎప్పటికి వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. దింతో ప్రస్తుత ఇసుక పరిస్థితి మళ్ళీ పాత కథే. ఇసుక దొరక్క సామాన్యుడు ఇబ్బంది పడుతున్నాడు. నిర్మాణాలు ఆగిపోతున్నాయి. మరోపక్క సిబ్బంది అవినీతి పుణ్యమా అని ప్రైవైట్ వ్యక్తులు బాగుపడుతున్నారు.
తప్పెక్కడ జరుగుతుంది అంటే?
ఎపిఎండిసి (ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ) ద్వారా ఇసుక నిర్వహణ బాధ్యతలు ప్రభుత్వం చేపట్టింది. రీచ్లను గుర్తించి అక్కడ నుంచి ఇసుకను ఓ ప్రదేశంలో డంప్ చేసి, అక్కడ నుంచి ఆన్లైన్ లో డబ్బు చెల్లించిన వినియోగదారునికి ఇవ్వాలి. ఈ వ్యవహారాలు అన్ని చూసేందుకు అవుట్ సోర్సింగ్ సిబ్బందికి బాధ్యతలు అప్పగించారు. క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేయకుండా ఆన్ లైన్ చేయడం వాళ్ళ ఇబ్బందులు తలెత్తాయి.
* ఇసుక రీచ్లు అన్ని చోట్ల అందుబాటులో లేవు. నది పరివాహక ప్రాంతాలు, వంకలు ఉన్న చోట్ల ఇసుక లభ్యం అవుతుంది. అయితే ఇసుక రీచ్ లు దూరంగా ఉన్న ప్రాంతాలకు రవాణా భారం ఎక్కువ అవుతుంది.
* ఇసుక భవన నిర్మాణంలో అత్యవసరం. ఆన్ లైన్ లో ఇసుక బుక్ చేస్తే నిర్దిష్ట తేదీల్లో వస్తుంది అనే గ్యారంటీ లేదు. దింతో నిర్మాణాలు మధ్యలో ఆగిపోతున్నాయి. కార్మికులకు పని ఉండటం లేదు. ఇక అవసరాన్ని బట్టి సిబ్బంది వినియోగదారులను ఏమరుస్తున్నారు. అర్జెంటు ఉన్నవారిని గుర్తించి వారికీ ఇసుక రావడం ఆలస్యం చేస్తున్నారు. రెండు, మూడు రోజులు తిరిగాక ప్రైవేట్ వ్యక్తుల వద్దకు వీరే పంపి అధిక ధరలకు కొనుగోలు చేసేలా చూస్తూ, కమిషన్ దండుకుంటున్నారు.
* ఇసుక విధానంలో చిన్న పాటి పనికి ఇసుక తీస్కుని రావడం గగనం అయిపోతుంది. ఆన్ లైన్లో వంతుల వారీగా తమ పేరు ఎప్పుడు వస్తుందో తెలియక వినియోగదారులు సతమత మవుతున్నారు.
* ఇది విజయవంతం అవుతుందా?
ప్రైవేట్ సంస్థలకు ఇసుక నిర్వహణ అప్పగించడం అంత మంచి నిర్ణయం కాదు. కేంద్ర సంస్థలకు అప్పగిస్తే, దానిలో ఏమైనా లోపాలుంటే కేంద్రం పైకి నెపం నెట్టేయవచ్చు అని భావించిన అది సాధ్యం కాలేదు. కేంద్ర సంస్థలేవి దీనిలోకి రాకపోవడంతో ప్రైవేట్ సంస్థలకే దీన్ని అప్పగించేలా చూస్తున్నారు. ఆఫ్ లైన్లో డబ్బులు కట్టి ఇసుక తీస్కుని వెళ్లొచ్చని చెబుతున్నా, ఇది బ్లాక్ మార్కెట్లోకి వెళ్లే అవకాశం ఉంది. గంపగుత్తగా కొందరు తీస్కుని, తర్వాత అధిక ధరలకు అమ్ముకోవచ్చు. సిబ్బందిపై అజమాయిషీ ఉండదు. ప్రైవేట్ సంస్థలు తమ ఇష్టానుసారం చేసే అవకాశం ఉంది. ప్రైవేట్ కు నిర్వహణ బాధ్యతలు, వారికీ సర్వం అధికారం అప్పగిస్తే కొత్త చిక్కులు రావొచ్చు. అయితే దీనికి ఎలాంటి విధివిధానాలు రూపొందిస్తున్నారు అనేది వేచి చూడాలి.