అయోధ్యకు అంకురార్పణ జరిగింది. శ్రీరామ మందిరానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. యావద్దేశం, యావత్ హిందూ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన క్షణాల సాకారం అయ్యాయి. ఇక మందిరం రూపుదిద్దుకోవడమే తరువాయి. మూడేళ్లలో శ్రీ రామ మందిరం పూర్తికావొచ్చి రామ పట్టాభిషేకం కూడా జరిగి పోతుంది. అయితే అయోధ్య, శ్రీ రామ మందిరం అంశం మాట్లాడుకోవాలంటే బిజెపి గురించి మాట్లాడుకోవాలి. ఆ బిజెపిలో ఎల్ కె అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి నాయకుల గురించి కూడా మాట్లాడుకోవాలి. మరి నిన్న భూమి పూజ, శంకుస్థాపనలో వాళ్ళు ఎవరూ కనిపించలేదు. నాడు అంత చురుగ్గా లేని మోడీ నేడు హవా చాటారు. నాడు చురుగ్గా ఉంటూ హవా చాటిన అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి నాయకులు నేడు కనుమరుగయ్యారు. వీళ్ళు తప్పుకున్నారా లేదా బిజెపి నేతలే తప్పించారా అనేదే ఇక్కడ కీలకమైన అంశంగా మారింది. నాడు అయోధ్య ఉద్యమంలో ఎవరెవరు ఎటువంటి పాత్ర పోషించారా అనేది ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాని కోసమే న్యూస్ ఆర్బిట్ అందిస్తున్న ఈ కధనం.
అద్వానీ
భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు హోదాలో అయోధ్య రామాలయం నిర్మాణ లక్ష్యంగా రామ రధయాత్ర నిర్వహించారు. అద్వానీ చేపట్టిన రథయాత్ర వల్ల హిందూ సెంటిమెంట్ వర్క్ అవుట్ అవ్వడంతో బీజేపీకి రాజకీయ లబ్ది చేకూరింది. అయన చేపట్టిన రధయాత్ర ను బీహార్ లో ప్రభుత్వం అడ్డుకొని అద్వానీని అరెస్ట్ చేసింది. అనంతరం రెండేళ్ల తరువాత కరసేవకులు బాబ్రీ మసీదును కూల్చివేశారు. ఆ సమయంలో అయోధ్యలోనే ఉన్న అద్వానీ సహా ముఖ్య నేతలను బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో ప్రధాన నిందితులుగా ప్రభుత్వం పేర్కొన్నది. ఎప్పటికి ఆ కేసు విచారణ నడుస్తున్నది. ఇది జరిగిన తర్వాతే ఉత్తరాది రాష్ట్రాలలో బీజేపీ అనూహ్యంగా బలోపేతం అయ్యింది. రెండు పార్లమెంట్ స్తనాల నుండి 200 స్థానాలకు ఎదిగి కేంద్రం అధికారంలోకి వచ్చింది. 2004, 2009 ఎన్నికల్లో బీజేపీ అద్వానీ ని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించినా పార్టీ అధికారంలోకి రాలేదు. 2014లో ఎన్డీఏ అధికారంలోకి వచ్చి మోడీ ప్రధాన మంత్రి అయిన తరువాత పార్టీలో అద్వానీ ప్రాధాన్యత కనుమరుగు అయ్యింది.
మురళీ మనోహర్ జోషి
అద్వానీ తరువాత జోషి పార్టీ పగ్గాలు చేపట్టారు. రామజన్మభూమి ఉద్యమంలో అద్వానీతో కలిసి క్రియాశీలకంగా పని చేశారు. ప్రజల్లో జాతీయ భావాన్ని పెంపొందించేందుకు తిరంగా యాత్ర చేశారు. బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో అద్వానీతో సహా నిందితుడుగా ఉన్నారు.
ఉమాభారతి
అయోధ్య ఉద్యమంలో పాల్గొన్న కీలక నేతలలో ఉమా భారతి కూడా ఒకరు. వాజపేయి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉమా భారతి పని చేశారు. తన వాక్చాతుర్యంతో రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందారు. అనారోగ్యం వల్ల 2019 ఎన్నికల్లో పోటీ చేయలేదు. అయోధ్య భూమి పూజా ఆహ్వానం అందుకున్నారు. తొలుత హాజరు కాలేనని ప్రకటించినా చివరి నిమిషంలో మనసు మార్చుకొని భూమి పూజ కార్యక్రమానికి హాజరయ్యారు.
ప్రమోద్ మహాజన్
జనబలం లేనప్పటికీ తన వాక్ చాతుర్యంతో బీజేపీలో ఎదిగారు. వాజపేయి, అద్వానీ శకంలో రాజకీయ వ్యూహకర్త గా ఉన్నారు. అయోధ్య రామాలయం కొరకు తొలుత అద్వానీ సోమనాధ్ నుండి పాదయాత్ర చేయాలని భావించగా తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించాలంటే పాదయాత్ర కంటే రథయాత్ర బెటర్ అని సలహా ఇచ్చి మార్పు చేసింది ప్రమోద్ మహజన్ యేనట. మోడీ సహాయంతో అద్వానీ రథయాత్ర ను ఆయన పర్యవేక్షించారు.
సాద్వి రితింబర
విశ్వ హిందూ పరిషత్ అనుబంధ విభాగం దుర్గా వాహిని అధ్యక్షులుగా పని చేశారు. ముస్లింలకు వ్యతిరేకంగా తన వాగ్ధాటితో విద్వేషపూరిత ప్రసంగాలు చేసి ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందారు. బాబ్రీ మసీదు విధ్వంసం తరువాత క్రియాశీల కార్యక్రమాలకు గుడ్ బై చెప్పి ఆశ్రమ జీవనం గడుపుతున్నారు.
ప్రవీణ్ తొగాడియా
అద్వానీకి సన్నిహితుడు. అశోక్ సింఘాల్ తర్వాత వీ హెచ్ పీ అధ్యక్షుడుగా బాధ్యతలు నిర్వహించారు. రామాలయ ఉద్యమ వ్యూహకర్తల్లో తొగాడియా కూడా ఒకరు. అద్వానీతో పాటే తొగాడియాకు మోడీ అధికారం లోకి వచ్చిన తరువాత పార్టీలో ప్రాధాన్యత తగ్గిపోయింది. అయోధ్య భూమి పూజకు వెళ్ళలేదు.
వినయ్ కతియార్
బజరంగ్ దళ్ కీలక నాయకుడు. 1992 తరువాత రాజకీయంగా ఎదిగారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గా బాధ్యతలు నిర్వహించారు. దేశ వ్యాప్తంగా బజరంగ్ దళ్ బలోపేతానికి తీవ్ర కృషి చేశారు. రామ మందిర భూమి పూజకు వెళ్ళలేదు.