2019 ఎన్నికల్లో తగిలిన దెబ్బతో చతికిలపడ్డ చంద్రబాబు…కిందపడ్డ తనదే పై చేయి అన్నట్టుగా రాజకీయాలు చేస్తారు.
ఏడాది జగన్ పాలనలో టీడీపీ చేసినన్ని విమర్శలు దేశంలో ఏ ప్రభుత్వంపైనా… మరే పార్టీ కూడా చేసి ఉండదేమో… వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి సర్కారు మంచి చేసిందా… చెడు చేసిందా… అన్న విషయం పక్కనబెడితే… ఏకిపాకాన పెట్టడం టీడీపీకే సాధ్యమవుతోంది. చేతిలో ఉన్న మీడియా సంస్థలు, అందివచ్చిన జర్నలిస్టుల బ్యాచ్, మేధావుల రూపంలో ఉన్న పచ్చదండు మొత్తంగా జగన్మోహన్ రెడ్డి సర్కారును కళ్లబొడుస్తోంది. లేనివి… ఉన్నవి అన్నీ కలిపి ఇచ్చినమ్మ వాయినం.. పుచ్చుకుంటినమ్మా వాయినం అంటూ వచ్చే ఎన్నికల్లో మాదే విజయమంటూ ఎల్లో సైరన్స్ ఇప్పటికే అమరావతి చుట్టూ విన్పిస్తూనే ఉన్నాయ్.
దేవుడు మీకు చరిత్రలో ఎంతో గొప్ప స్థానమిచ్చారు. ఎవరూ ఊహించని విధంగా ఎన్టీఆర్ని పదవిలోంచి తప్పించినా అది ప్రజాస్వామ్య పరిరక్షణ అన్న సూక్తిముక్తావళి లంఖించుకున్నారు. ఆ తర్వాత వాజ్పేయి చరిష్మాతో రెండోసారి కార్గిల్ సాక్షిగా గెలిచిపోయారు. ఆ తర్వాత మీ పప్పులు ఉడకలేదు. అడ్మినిస్ట్రేటర్ గా మీరు మంచి నాయకుడే కానీ… మీరు ప్రజా నాయకుడు కాదు. కాలేరు. నాయకుడికి మనస్సుండాలి. మనసుతో ఏదైనా చేయాలి. అలాంటివి జీవితంలో చోటు లేని మాటలు. మీరు ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. 23 స్థానాలకే పరిమితమైపోయారు. ఎంత మంది మీకు తోడుంటారో తెలియని పరిస్థితి. ఇప్పటికే అవినీతి ఆరోపణలతో అచ్చెన్న జైళ్లో ఉంటే మరికొందరికి సైతం అదే గతి పట్టబోతుందని ప్రచారం జరుగుతోంది. కొందరు జంప్ అయ్యి… అవనట్టుగా పార్టీ మారేందుకు కూడా సిద్ధమైపోయారు.
విభజన తర్వాత ఏ నాయకుడికీ లభించని గొప్ప అవకాశం మీకు అమరావతి రూపంలో వచ్చింది. అమరావతి మీరు పూర్తి చేసి ఉంటే అడ్డుకునేవాళ్లెవరుండేవారు. అమరావతిలో అన్ని కులాలు, అన్ని వర్గాలు ఉండాలి. ఇది మీరు చెప్పేమాట. అయితే అక్కడి వాస్తవ చిత్రాలు మరో రకంగా ఉంటాయ్. ఇక్కడ మీరు తప్పు చేశారని… మీ వల్లే అంతా జరిగిపోయిందని కాదు… మీరు అమరావతి భ్రమల్లో ఉండి… రాజధాని నిర్మాణం అంతగా చేయలేకపోయారు. మీరు చేసిన నిర్మాణాల్లో కక్కుర్తి కూడా చాలానే. పైపెచ్చు మీడియా గురువులు ఇచ్చిన పుచ్చు సలహాలతో బీజేపీతోనే పెటాకులు చేసుకొని… రాజకీయంగా ఘోర తప్పిదం చేశారు. లేకుంటే జగన్మోహన్ రెడ్డికి ఇంతటి అఖండ విజయం సాధ్యమయ్యేది కాదు. వాస్తవానికి మరో పార్టీతో పొత్తు లేకుండా గెలిచిన చరిత్ర మీకు లేదు. అన్నీ తెలిసి కూడా బొటన వేలుతో మీ కంటినే పొడుచుకున్నారు.
అసలు విషయానికి వద్దాం.. రాజధాని విషయంలో మీ స్టాండ్ క్లియర్. అమరావతిని మరో హైదరాబాద్ చేయడం… అది ఒక బ్రాండ్… ఒక బంగారు బతుగుడ్డు. ఒక సంపద నిలయం. అయితే అన్ని సందర్భాల్లో ఇలాంటి ఫార్ములాలు వర్కౌట్ అయిన దాఖలాలు పెద్దగా లేవు. తెలంగాణలో హైదరాబాద్ని అంతగా అభివృద్ధి చేయడం వల్లే కదా… ఉద్యమానికి పరోక్షంగా దోహదకారి అయ్యింది. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న స్టాండ్ తప్పేమీ కాదు.. అలాగని అమరావతి అభివృద్ధిని ఎవరు ఆపగలరు. అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియ. ఈ అంశాలు మీకు తెలియనివి కావు.. కానీ ఇక్కడ చెప్పొచ్చేదేంటే… టీడీపీలో ఉన్న అతిరథమహారథులతోపాటు, చోటామోటా నాయకులందిరినీ మీరు బీజేపీలోకి పంపించేశారు. బీజేపీలో అధికార ప్రతినిధులుగా, మీడియా ప్రతినిధులుగా వచ్చేలా కూడా చక్రం తిప్పారు. రోజూ చర్చావేదికల్లో 1+1 ఆఫర్లతో జనాలకు ఏడాదిలో చుక్కలు చూపించారు. మరో నాలుగేళ్లు ఈ స్టీరియో డిబేట్స్ చూడటం జనాలకు కష్టమే. ఎల్లో బ్రదర్స్ అందరూ కూడా తమ సహజసిస్ధ స్వభావాన్ని బయట పెట్టుకోవడంతో అసలు గందరగోళం మొదలై… బీజేపీతో తాడోపేడో తేల్చుకోవాల్సిన పరిస్థితిలోకి నెట్టబడ్డారు.
నిన్ననే ఏపీలో కొత్త రాజకీయ పార్టీకి అంకురార్పణ జరిగింది. వాళ్లందరూ కూడా టీడీపీకి మద్దతిచ్చేవారే. పైకి కాంగ్రెస్ నేతలు కూడా ఉన్నారన్న వర్షన్ విన్పిస్తున్నారు. ఐతే అసలు విషయం ఏంటంటే… వికేంద్రీకరణకు గవర్నర్ ఆమోదం తెలపడమంటే కేంద్రం అందుకు సై అనడమేనన్న అభిప్రాయానికి బీజేపీలో చేరిన టీడీపీ దండు భావిస్తోంది. అందుకే ఇకపై బీజేపీని తిట్టేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకొంది. బీజేపీ నాయకులు అమరావతికి జై కొడుతుంటే.. ఢిల్లీ మాత్రం సపోర్ట్ చేయడం లేదంటూ ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి పెడబొబ్బలు పెట్టేందుకు టీం తయారైపోయింది. మీకు నచ్చినట్టుంటే ఓకే… లేకుంటే యధవలంటూ విమర్శలు గుప్పిస్తారా… రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవని మీరు 2019 ఎన్నికలకు ముందు దేశానికి చూపించారు. బీజేపీని, మోదీని ఓడించేందుకు దేశమంతా కాళ్లకు బలపాలు కట్టుకొని మరీ తిరిగారు. ఎన్నికలు పూర్తయ్యాక… మోదీ అంటే వ్యతిరేకత లేదంటూ నాలికకు నరం లేనట్టుగా మార్చేశారు.
మళ్లీ చెప్పొచ్చేదేంటంటే… అమరావతి రక్షించడం కోసం టీడీపీ దండు బీజేపీలోకి వెళ్లింది. ఇప్పుడు బీజేపీ అందుకు సిద్ధంగా లేకపోవడంతో బయటకు వచ్చి విమర్శలు గుప్పిస్తారనమాట. అమరావతిని ఎవరూ ఏం చేయలేరని సుజనా చౌదరి లాంటి నాయకులు పదేపదే మీడియా సాక్షిగా వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఆయన కూడా ఈ మధ్య పెద్దగా మాట్లాడిన సందర్భాల్లేవ్… ఇప్పటికే ఎగవేతల తంతు వ్యవహారంలో ఏపీ టీడీపీ నాయకులపై ఈడీ, ఐటీ కాచుక్కుర్చోంది. ఇలాంటి తరుణంలో బీజేపీపై విమర్శలకు ఒక చిన్న టీం మాత్రమే రంగంలోకి దిగే అవకాశముంది. అందుకే డాక్టర్ గారిని బూచిగా చూపించి… తెర వెనుక కొంత, తెర ముందు కొంత కుండబద్ధలు కొట్టడం ఖాయం. ఏదేమైనా ఇప్పుడు లక్ష్మణరేఖ దాటితే టీడీపీ నేతలకు సుర్రు సుమ్మైపోవడం ఖాయం…