Covid : కోవిడ్ Covid దేశంలో తగ్గిందనుకున్న కరోనా తీవ్రత మళ్లీ ప్రళయంలా విరుచుకుపడుతోంది. దేశ ఆర్ధిక వ్యవస్థ, ప్రజా జీవనం, వ్యవస్థలన్నీ గాడిన పడుతున్న తరుణంలో మళ్లీ మునుపటి ఏడాది పరిస్థితులు తీసుకొస్తున్నాయి. దేశంలో ప్రధానంగా పది రాష్ట్రాల్లోనే కరోనా పెను ప్రభావం చూపిస్తున్నా.. ఇది దేశం మొత్తానికి హెచ్చరిక అని చెప్పాలి. ఏకంగా గడచిన 24 గంటల్లో 89,129కేసులు నమోదవడం.. 714 మంది ప్రాణాలు కోల్పోవడమే పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. దేశంలో కరోనా గాలులు వీయడం మొదలైనప్పటి నుంచీ ఇప్పటివరకూ మొత్తంగా 164,110మంది చనిపోగా.. 1,23,92,260 మంది కరోనా బారిన పడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా పరిస్థితి కాస్తంత తీవ్రంగానే ఉంది. ఇదంతా కేవలం మనిషి చేసుకున్న ‘నిర్లక్ష్యం’.
ప్రపంచం మొత్తం మీద ఒక దేశం నుంచి రెండు కరోనా వ్యాక్సిన్లు రావడం కేవలం భారత్ లో మాత్రమే జరిగింది. అగ్రరాజ్యం అమెరికా నుంచి వెస్టిండీస్ వంటి దీవులకు కూడా వ్యాక్సిన్లు పంపించాం. ‘ఇదే కదా మన గొప్పదనం’ అనుకున్నారేమో.. ప్రజలు కరోనాను తక్కువ అంచనా వేశారు. మాస్కులు, శానిటైజర్లు, భౌతికదూరం పాటించడం మానేశారు. మహారాష్ట్రలో మొదలైన ఉత్పాతం మళ్లీ దేశం మొత్తం ఇబ్బందిపడేలా చేస్తోంది. గడచిన తెలుగు రాష్ట్రాల్లో గడచిన 24 గంటల్లో ఏపీలో 1398, తెలంగాణలో 1321 కేసులు నమోదయ్యాయి. ఈక్రమంలో ఈ నెల మధ్యనాటికి కరోనా ఉగ్రరూపం చూపి ఆ తరువాత కేసులు తగ్గుతాయని.. మళ్లీ మే 15-20 మధ్య కేసులు గరిష్ట స్థాయికి చేరుతాయని అంటున్నారు.
సూత్ర SUTRA (Susceptible, Undetected, Tested (positive), Removed (recovered or dead) అనే గణిత నమూనా తో మహేంద్ర వర్మ సారథ్యంలోని కాన్పూర్ శాస్తవేత్తల బృందం ఈ లెక్కలు వేసింది. మొదటి దశ సమయంలోనూ ఇదే నమూనా శాస్త్రవేత్తలు అనుసరించారు. గతంలో 2020 సెప్టెంబర్ కి గిరిష్టానికి పెరిగి 2021 ఫిబ్రవరికి తగ్గుతాయని వేసిన అంచనాలు సక్సెస్ కావడంతో ప్రస్తుత నివేదికపై ఆసక్తి నెలకొంది. ఈక్రమంలో ఒడిషా, పంజాబ్ రాష్ట్రాలను హెచ్చరించింది. మహారాష్ట్రలో తీవ్రత కొనసాగుతుందని తెలిపింది. మొత్తంగా మే చివరి వరకూ చాలా అప్రమత్తంగా ఉండాలని పరిస్థితులు చెప్తున్నాయి.