Big Boss Politics: బిగ్ బాస్ (Big Boss 5 Telugu) చూస్తున్నారుగా.. బిగ్ బాస్ ఎప్పుడూ హౌస్ సభ్యులకు కొన్ని టాస్కులు అప్పగిస్తారు. కొన్ని టార్గెట్లు పెడతారు. గెలవడానికి సభ్యులు నానా తంటాలు పడినప్పటికీ.., ఏదోలా గోల గోల చేసుకుని గెలుస్తుంటారు.. ఇలాగే టాస్కులు, టార్గెట్లు (Big Boss Task) బిగ్ బాసులోనే కాదు.., రాజకీయాల్లో కూడా ఉంటాయి. బిగ్గు బాసులు అక్కడే కాదు, రాజకీయాల్లో కూడా ఉంటారు..! వాటిని ఛేదించే, సాధించే క్రమంలో నాయకులు అటూ, ఇటు చక్కర్లు కొడుతుంటారు. ఈ మధ్య పొలిటికల్ బిగ్ బాస్ బాగా ఆడుతున్న నాయకులూ ఎవరంటే ఓ ముగ్గురు ఎంపీలు గుర్తుకొస్తారు. చంద్రబాబు (Nara Chandrababu Naidu)కి అత్యంత సన్నిహితులు, ఒకరకంగా బినామీలు అని పిలిపించుకున్న ఎంపీలు టీడీపీని వీడి బీజేపీలో చేరడం ఒక పెద్ద వింత. కానీ కళ్ళెదురుగా జరిగింది, దాదాపు 28 నెలలకు పైగా జరుగుతూనే ఉంది. అయితే ఇది మొత్తం ఒక టాస్క్.., ఒక ప్లాన్.., ఒక టార్గెట్ ప్రకారం అనేది కాస్త లోతుగా ఆలోచించే వారికి అర్ధమవుతుంది.. ఇప్పుడు ఆ ముగ్గురు మళ్ళీ టీడీపీ(Telugu Desam Party)లోకి రావడమే మరో పెద్ద వార్త..!
Big Boss Politics: కేసుల కోసం.. కాసుల రక్షణ కోసం..!
విషయం ఏమిటంటే.. టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్, గరికపాటి రామ్మోహనరావులు రాష్ట్రంలో టీడీపీ అధికారం కోల్పోయి వైసీపీ అధికారంకి రావడంతో బీజేపీలో చేరారు. వీరు నలుగురు బీజేపీలో విలీనం కావడంతో టీడీపీకి రాజ్యసభలో కనకమేడల రవీంద్రకుమార్ ఒక్కరే ముగిలారు. గరికపాటి రామ్మోహన రావు ప్రస్తుతం సైలెంట్ గా ఉండగా సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్ ల పరిస్థితి ప్రస్తుతం అగమ్య గోచరంగా ఉందట. వీరు ముగ్గురు పారిశ్రామిక వేత్తలు. పెద్ద పెద్ద వ్యాపార లావాదేవీలు ఉండటంతో బ్యాంకు రుణాల ఎగవేత కేసులు, ఇతర సమస్యలు, కాంట్రాక్ట్ లావాదేవీలు ఉండటంతో చంద్రబాబు ఆదేశం మేరకు వారి రక్షణ కోసం బీజేపీని ఆశ్రయించారనే ప్రచారం ఉంది.
సుజనా చౌదరి, సీిఎం రమేష్ లకు టీడీపీతో రెండున్నర దశాబ్దాల బంధం ఉంది. పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా చంద్రబాబుకు బ్యాక్ బోన్ గా వ్యవహరిస్తూ వచ్చిన వీరు టీడీపీని వీడి బీజేపీలోకి వెళ్లడమే పెద్ద షాకింగ్ న్యూస్. వాళ్ల అవసరాల దృష్యా తప్పనిసరి పరిస్థితిలో వాళ్లు వెళ్లారు. అయితే వీరిని చంద్రబాబే తన రక్షణ కోసం బీజేపీలోకి పంపించారని కూడా నాడు వైసీపీ నేతలు ఆరోపణలు చేశారు. వారు బీజేపీలో చేరినప్పటికీ చంద్రబాబు కు అనుకూలంగా ఉంటున్నారని ఆరోపణ కూడా ఉంది. అయితే ఇప్పుడు ఈ ముగ్గురు బీజేపీలో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. దానికి కారణం ఏమిటంటే.. ఇప్పటి వరకూ కేంద్రంలో బీజేపీకి రాజ్యసభ సభ్యుల అవసరం ఉండేది. అందు కోసం వీరిని పార్టీలో చేర్చుకున్నారు పార్టీ కండువా కప్పారు. ఇప్పటి వరకూ ఉపయోగించుకున్నారు. మరో ఏడు నెలల్లో వీరి పదవీ కాలం ముగిసిపోతోంది. దీంతో వీళ్లతో బీజేపీకి అవసరం తీరిపోయింది. వీళ్లను బీజేపీ పట్టించుకోవడం లేదు.
అమిత్ షా కి ఫిర్యాదు.. వెంకయ్య అండ..!?
రాష్ట్ర బీజేపీలో రెండు వర్గాలు ఉన్నాయి. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు వర్గీయులుగా భావిస్తున్న కంభంపాటి హరిబాబు, కన్నా లక్ష్మీనారాయణ, కామినేని శ్రీనివాస్ తదితరులు ఒక వర్గంగా ఉండగా జీవీఎల్ నర్శింహరావు, సోము వీర్రాజు తదితరులు మరో వర్గంగా ఉన్నారు. ఈ రెండవ వర్గానికి అనుకూలంగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల సహా ఇన్ చార్జి సునీల్ ధియోధర్ ఉన్నారు. ఇటీవల సునీల్ ధియోధర్ ఈ ముగ్గురు రాజ్యసభ సభ్యులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వీరు వారి స్వప్రయోజనాల కోసం బీజేపీలో చేరారనీ, వారి
ఆటలు బీజేపీలో సాగవని, కారు పార్కింగ్ కు వాడుకున్నట్లు బీజేపీని వారు వాడుకోవాలని చూస్తున్నారనీ, కారుకు పంచర్ చేసి బయటకు కదలకుండా చేస్తామంటూ సునీల్ ధియోధర్ కామెంట్స్ చేశారు. బీజేపీకి తాము రాజ్యసభలో అండగా ఉండి పార్టీ కోసం పని చేస్తుంటే ఇలా మాటలు అనడం ఏమిటంటూ వీళ్లు కేంద్ర బీజేపీ పెద్దలకు ఫిర్యాదు చేశారు. పీఎం మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డాలకు సునీల్ ధియోధర్ చేసిన వ్యాఖ్యలపై ఈ ముగ్గురు నేతలు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం వీరి ఫిర్యాదు కేంద్ర బీజేపీ పెద్దల వద్ద ఉంది. కేంద్ర బీజేపీ పెద్దలు దీనిపై పరిశీలన చేసి ఈ రాజ్యసభ సభ్యులకు అనుకూలంగా వ్యవహరించినట్లైయితే సోము వీర్రాజు, ధియోధర్ లను పిలిచి మందలించే అవకాశం ఉంటుంది.. లేదు వీళ్ల అవసరం తీరిపోయింది వీరు పార్టీలో ఉన్నా లేకున్నా పెద్దగా ఒరిగేది లేదని భావిస్తే ఆ ఫిర్యాదుపై ఎటువంటి యాక్షన్ ఉండదు. ఆ పరిస్థితే ఏర్పడితే వీరు ముగ్గురు మళ్లీ సొంత గూటికి చేరడానికి సిద్ధంగా ఉన్నారుట. వీరు పార్టీని వీడి బీజేపీలో చేరినా టీడీపీని, చంద్రబాబును పెద్దగా విమర్శించిన దాఖలాలు లేవు. వీరు మళ్లీ వస్తానంటే టీడీపీలో చేర్చుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కేంద్ర బీజేపీ ఎలా స్పందిస్తుంది. వీరి రాజకీయ భవితవ్యం ఏమిటి అనేది కొద్ది రోజుల్లో తేలనుంది. ఏమి జరుగుతుందో వేచి చూద్దాం.!