కొంతమంది మనోభావాలను మాత్రమే గౌరవిస్తే చాలా..
వరుస ట్వీట్లతో జగన్ ప్రభుత్వ నిర్ణయం పై ఫైర్
ఏపీ బీజేపీ నూతన చీఫ్ సోము వీర్రాజు వైసీపీ ప్రభుత్వం మీద ఎటాక్ మొదలుపెట్టారు. కొద్ది రోజుల క్రితం ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం పైన వీర్రాజు వరుస ట్వీట్లతో విమర్శల పరంపర కొనసాగించారు. కొంత మంది మనోభావాలను మాత్రమే గౌరవిస్తే చాలనకుంటనే..భవిష్యత్తులో అనేక మంది మనోభావాలను దెబ్బ తీస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేసారు. పూర్వ కాంగ్రెస్ కుటిల రాజకీయాలను తలపిస్తోందని.. తన ట్వీట్ లో వ్యాఖ్యానించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గుంటూరు నగరంలోని పాత గుంటూరు ప్రాంతంలో జరిగిన ఒక ఘటనలో ఆరు కేసులు నమోదయ్యాయి. అందులో ఒక వర్గానికి చెందిన వారిలో అసలు జరిగిన ఘటనతో సంబంధం లేకపోయినా కేసుల్లో చిక్కుకున్నారని స్థానికులు ప్రభుత్వంలోని ముఖ్యుల వద్ద వాపోయారు. దీని పైన విచారణ తరువాత ఆ కేసులను ఉప సంహరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిని ఇప్పుడు సోము వీర్రాజు ప్రశ్నించారు. ఆయన దీని పైన చేసిన ట్వీట్లలో బెంగుళూరులో తాజాగా జరిగిన సంఘటలనను ప్రస్తావించారు.
అవకాశవాద రాజకీయాలకు నిదర్శనమంటూ…
2018లో పాత గుంటూరు పోలీస్ స్టేషన్పై జరిగిన దాడికి సంబంధించిన అధికారులు అప్పట్లో ఆరు కేసులు నమోదు చేసారు. పాత గుంటూరులో ఒక వర్గానికి చెందిన వారి నివాసాలు ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఇక యువకుడు ఒక బాలిక పైన అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో..ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో ఆ యువకుడిని తమకు అప్పగించాలంటూ స్థానికులు కొందరు పోలీసు స్టేషన్ వద్దకు వచ్చి ఆందోళనకు దిగారు. ఆ సమయంలో చిన్న పాటి ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే, ఆ సమమంలో కొందరి పైన పోలీసులు పలు సెక్షన్ల తో ఆరు కేసులు నమోదు చేసారు. కొందరు అమాయకులపైనా కేసులు నమోదు చేసారంటూ స్థానికులు ప్రభుత్వ పెద్దలకు మొర పెట్టుకున్నారు. దీంతో..ఆ కేసులను ఉపసంహరిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. దీని పైన సోము వీర్రాజు తాజాగా ట్వీట్లు చేస్తూ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు బట్టారు. అందులో అనేక అంశాలను ప్రస్తావించారు. బెంగుళూరులో తాజాగా జరిగిన ఘటనతో పాటుగా..కాంగ్రెస్ కుటిల రాజకీయాలను తలపిస్తోందంటూ సోము వీర్రాజు చేసిన ట్వీట్లు ఇప్పుడు చర్చకు కారణమయ్యాయి.
మనోభావాలను దెబ్బ తీస్తుంది…
సోము వీర్రాజు ఈ అంశం పైన మూడు ట్వీట్లు చేసారు. అందులో.. ప్రజాస్వామ్యంలో చట్టం ముందు ఎంతటివారైనా తప్పుచేస్తే శిక్షించబడాలన్న న్యాయాన్ని ఆవహేళనచేస్తూ ఒకప్పుడు గుంటూరులో పోలీస్ స్టేషన్ పై దాడిచేసిన నిందితులపై పెట్టబడిన కేసులను ఎత్తివేస్తూ సంఘవిద్రోహ శక్తులకు మరిన్నిఅవకాశాలను కల్పించటం ఈ రాష్ట్రప్రభుత్వ అవకాశవాద రాజకీయాలకు నిదర్శనం అని పేర్కొన్నారు. మరో ట్వీట్ లో..ఇది పూర్వ కాంగ్రెస్ కుటిల రాజకీయాలను తలపిస్తుంది..ఇది చాలా దురదృష్టకరం.. ఇటువంటి నిర్ణయాలు బెంగుళూరు నగరం లో జరిగిన దాడుల వంటి దురదృష్టకర సంఘటనలు మన రాష్ట్రం లో మరిన్ని జరిగే అవకాశాలను పెంచుతున్నాయి..అంటూ అభిప్రాయపడ్డారు. మరో ట్వీట్ లో..రాష్ట్ర ప్రభుత్వం కేవలం కొంతమంది మనోభావాలను మాత్రమే గౌరవిస్తే చాలనుకుంటే దాని పరిణామం భవిష్యత్తు లో అనేకమంది మనోభావాలను, వారి ఆత్మస్తేర్ధ్యాన్ని దెబ్బతీస్తుందనటం లో ఏమాత్రం సందేహం అవసరం లేదు..అని తన అభిప్రాయం వ్యక్తం చేసారు. ఇప్పుడు దీని పైన వైసీపీ నేతలు ఏ రకంగా రియాక్ట్ అవుతారనేది చూడాల్సి ఉంది.