జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోవడం…. అదేపనిగా లక్ష్మీ నారాయణను తప్పించి సోము వీర్రాజు కి పార్టీ పగ్గాలు అప్పగించడం తో బిజెపి…. ఆంధ్ర రాష్ట్రంలో పాగా వేసేందుకు సిద్ధమైందని అంతా ఊహించారు. ఇంకేముంది వైసీపీ కి గట్టి పోటి వచ్చేసింది…. కమలనాథులు ఇక్కడ కూడా రాజ్యమేలుతారని కొద్దిమంది ఆశించారు. అయితే ఈ బండి ఏదో ట్రాక్ తప్పు తున్నట్టు ఉంది…
పర్మెనెంట్ ప్రతిపక్షమే లక్ష్యమా?
ముందు నుండి గమనించినట్లయితే జనసేన పార్టీ తో వీర్రాజు పొత్తు పెట్టుకున్నారు అనే కానీ వారిద్దరి సిద్ధాంతాలు కలిసి రాష్ట్రంలో ప్రభావం చూపించిన రోజు అయితే ఇప్పటివరకు రాలేదు. అది కాకుండా పవన్ జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించిన తర్వాత సంచలనాత్మకంగా బిజెపి మాట మీద వెనక్కి తగ్గడం చూస్తుంటే వారి మధ్య సమాచార లోపం ఎంతుందో తెలుస్తుంది. ఇదంతా పక్కన పెడితే సోము వీర్రాజు అధికార పార్టీని విమర్శించేందుకు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. ఎంతసేపటికీ చంద్రబాబు పైనే ఆయన కన్ను. అతనే టార్గెట్. ప్రతిపక్ష పార్టీ హోదా వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా తీసుకోవాలని ఆ వ్యూహం అనుకోవచ్చు కానీ ఈ వ్యవహారం చూస్తుంటే భవిష్యత్తులో పూర్తిగా ప్రతిపక్షానికి పరిమితం అయ్యేందుకు సిద్ధపడినట్లు ఉందని కొందరు సెటైర్లు వేస్తున్నారు.
మీ నిజాయితీకి జోహార్….
ఈ మధ్యనే వీర్రాజు రాష్ట్ర చీఫ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పైన విమర్శలు గుప్పించారు. కరోనా సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల ముచ్చట ఏమిటని ప్రశ్నించారు. హుటాహుటిన వాటిని చేపట్టవలసిన అవసరం ఏమీ లేదని… కోవిడ్ ముప్పు ఇంకా ఉందని అన్నారు. అయితే వైసిపి ఇదే విషయంపై నిమ్మగడ్డ రమేష్ తో గత కొద్ది కాలంగా పెద్ద యుద్ధమే చేస్తుంది. ఇది ఎన్నికల సమయం…. ఇలాంటి సమయంలో జగన్ వాదనకు బలం చేకూర్చేలా వ్యాఖ్యలు చేయడం ద్వారా వీర్రాజు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారో తెలియక బిజెపి వర్గాలు తలలు పట్టుకున్నాయట. సరే నిజాయితీగా వీర్రాజు తన వాదనను వినిపించారు అనుకుంటే…. ఇన్ని రోజులు లేనిది ఒక్కసారిగా ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనక అంతరార్థం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు.
ఇది మాత్రం కొత్త రాజకీయమే….
రాజధాని విషయంలో కూడా అంతే…. రాష్ట్రమంతా ఒకవైపు పోతే బిజెపి మరొకవైపు వెళ్ళింది. అసలు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం విషయంలో సంబంధం లేదని వారికి పూర్తి హక్కులను ఇచ్చేశాము అని చెప్పి పార్లమెంటులో శాసన మండలి రద్దు బిల్లుని అలాగే ఉంచారు. బీజేపీ రాజకీయాల గురించి ఏమీ తెలియనివారు లేరు కానీ అసలు నిజంగా ఒక దిశానిర్దేశం ఉందా లేదా అన్నది అనుమానమే. ఇంకా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీకి తిరుపతి ఉప ఎన్నికల్లో రెండో స్థానం రావడం కూడా చాలా కష్టమైన విషయమే. గత సంవత్సరం జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో రెండవ స్థానం టిడిపిది. అయితే మూడో స్థానం నోటాకి వెళ్ళగా…. కనీసం నాలుగో స్థానమైనా బిజెపి సాధించిందా అంటే అది కాస్తా కాంగ్రెస్ కు వెళ్ళింది.
ఐదవ స్థానంలో ఉన్న బిజెపి పుంజుకునిఅనూహ్యంగా గెలవాలన్నా…. లేదా రెండో స్థానంతో సరిపెట్టుకోవాలన్నా సోము వీర్రాజు సమయానుకూలంగా వ్యాఖ్యలు చేస్తే మంచిదని రాష్ట్రంలో బీజేపీ పార్టీని అభిమానించే వాళ్ళా బాధ…. బిజెపి వారు ఏమి ఆలోచిస్తున్నారో ఇంతకీ మీకైనా అర్థమైందా…?