ప్లాన్ – 1 : ఈ ఏడాది చివరన బీహార్ లో ఎన్నికల నాటికి జేడీయుని కలుపుకోవాలి…!
ప్లాన్ – 2 : వచ్చే ఏడాది ఏప్రిల్ లో తమిళనాడులో ఎన్నికల నాటికి అన్నా డీఎంకేని చేతుల్లో పెట్టుకోవాలి…!
ప్లాన్ – 3 : పశ్చిమ బెంగాల్ లో మమతా పీఠాన్ని పూర్తిగా లాగేసుకోవాలి…!
ప్లాన్ – 4 : 2023 నాటికి ఎలాగైనా తెలంగాణాలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలి…!
ప్లాన్ – 5 : ఏపీలో బలపడాలి. చంద్రబాబు కనుమరుగవ్వాలి. జగన్ తమ చేతల్లో ఉండాలి.
* ఒకటోది సాధ్యమే. అందుకే ధీమాగానే ఉన్నారు. జేడీయూ మొదటి నుండి బీజేపీ కి దోస్తీనే. ఇప్పుడు పెద్ద కష్టం కాబోదు.
* రెండోది సాధ్యమే. తమిళనాడులో జయలలిత లేని లోటు ఆ పార్టీలో ఉంది. అందుకే బీజేపీ పెత్తనం ఆరంభమయింది.
* మూడోది సాధ్యమే. అక్కడ మమతకు వ్యతిరేక గాలులు మొదలయ్యాయి. బీజేపీ పుంజుకుంటుంది. గత లోక్ సభ ఎన్నికల్లో అదే తేలింది.
* నాలుగోది సాధ్యమూ కాదు, అలా అని అసాధ్యమూ కాదు. తీవ్రంగా ప్రయత్నం చేయాలి. అక్కడ కాంగ్రెస్ ఉన్నత కాలం, బీజేపీ పైకి రాదు. బీజేపీ ఉన్నంత కాలం కాంగ్రెస్ పైకి రాదు. ఈ రెండూ కలవవు కాబట్టి. కేసీఆర్ కి ఫామ్ హౌస్ లో పడుకున్నా ఓట్లు పడతాయి. ఎన్నికలకు మూడు నెలల ముందు నుండి జనంలోకెళ్ళి సెంటిమెంటుని గిల్లితే చాలు. అది కేసీఆర్ కి బాగా తెలుసు. రేవంత్ లాంటి వాళ్ళు ఇద్దరో, ముగ్గురో బీజేపీలోకి దూరితే ఏమైనా అవకాశం ఉండే వీలుంది.
* ఇక అయిదోది. ఇదే కీలకం. అక్కడే బీజేపీ ముప్పు తిప్పలు పడుతుంది. ఇక్కడ ఆ పార్టీకి బలమైన, స్థిరమైన నాయకుడు లేరు. ప్రజాకర్షణ ఉన్న నాయకులు లేరు. మైకుల ముందు గంటల కొద్దీ మాట్లాడే నేతలకు కొదవ లేదు.., కానీ జనం ముంగిట ఆకట్టుకునేలా స్పీచ్ దంచే, ఓట్లు కురిపించే నాయకుడు లేరు. అందుకే ఆ లోటు తెలియకుండా “పవన్ కళ్యాణ్” అనే నాయకున్ని అద్దెకు తెచ్చుకున్నారు. ఎంతైనా సొంతం, సొంతమే.. అద్దె అద్దెదే కదా…!
* అందుకే పవన్ ఆయన తరహా రాజకీయం చేస్తున్నారు తప్ప బీజేపీ తరహా అలవాటు పడలేదు. బీజేపీ పట్ల అత్యంత భక్తితో ఉన్నారు, కానీ ఆ పార్టీ తరహాలో మత, వర్గ రాజకీయాల జోలికి వెళ్ళలేదు. ఇక బీజేపీకి ఇప్పుడు ఏపీలో పవన్ చాలట్లేదు. ఒక కులానికి పవన్ అనుకున్నా.., ఆ కులానికి కూడా పూర్తిగా పవన్ సరిపోవట్లేదు. అందుకే ఆ ఆ కులాన్నీ ఏకతాటిపైకి తేవాలి. మూకుమ్మడిగా తమతో ఉండేలాగా అన్నమాట”… ఇక ఇంకో కులానికి ఒక నాయకుడు కావాలి. ఆ రెండు కులాలు కలపాలి. వచ్చే ఎన్నికల నాటికి జగన్ కి, ఆయన కులానికి ప్రత్యామ్నాయం తయారవ్వాలి.” ఇదే ఇప్పుడు బీజేపీ లెక్క. పాపం ఈ లెక్కలన్నీ వేసుకుని మొదటి అవసరమైన బీజేపీ అధ్యక్షుడిని ఇంకా ఖరారు చేసుకోలేకపోతుంది. ఒక వ్యవహారం చూద్దామంటే.., ఇంకో వ్యవహారం చుట్టుకుంటున్నాయి.
* ఇవన్నీ పక్కన పెడితే కనీసం రాష్ట్ర కీలక వ్యవహారాల్లో కూడా బీజేపీ ఒక నిర్ణయానికి రాలేక తడబడుతుంది. ఒక్కో నాయకుడూ ఒక్కోలా స్పందిస్తూ మాట్లాడుతున్నారు. కుల ప్రయోజనాలే ముఖ్యంగా.., తమ సొంత అభిప్రాయాలే కీలకమై పార్టీలో వర్గాలు వేర్వేరుగా స్పందిస్తున్నాయి. అందుకే పార్టీ లెక్కలు ఒకలా ఉంటె.. అవి మరోలా అమలవుతున్నాయి. ఇవన్నీ తర్వాత చూద్దాం ముందు రాష్ట్రంలో పెద్ద దిక్కుని చూడలేకపోతున్నారు. అందుకే అనేది దేశానికి బీజేపీ రాజకీయం నేర్పితే… ఏపీ రాజకీయం మాత్రం బిజెపికి పాఠాలు నేర్పుతుంది.