BJP Janasena : బీజేపీ జనసేన పార్టీల మధ్య పొత్తు ఉందా..? లేదా..? పేరుకు పొత్తు ఉన్నా, ఆ రెండు పార్టీల మధ్య పరస్పరం అవగాహన ఉందా..? లేదా..? తిరుపతి ఉప ఎన్నిక విషయంలో BJP janasena బీజేపీ జనసేన పార్టీల అంతర్గత వైఖరి ఏమిటి..!? గడిచిన నెల రోజులుగా పరిణామాలు చుస్తే.., స్పష్టత లేక…, ఒకరిపై ఒకరికి అవగాహన లేక.., ఒకరిపై ఒకరికి నమ్మకం లేక… ఈ బీజేపీ- జనసేన రెండు పార్టీలు ఒక పార్టీకి తెలియకుండా మరో పార్టీ డ్యామేజీ చేసుకుంటున్నట్టే ఉంది..!!
BJP Janasena : మధ్య నమ్మకం – అవగాహన లేని స్నేహం..!
స్కూలు చదివే పిల్లల్లో స్నేహం ఎలా చిగురిస్తుంది..? ఒకరికి ఒకరు అవసరాల్లో తోడుగా ఉన్నప్పుడు. అంటే అవసరమైన సమయంలో పెన్ను, పుస్తకం సాయం చేస్తే బడి ఈడులో స్నేహం పుడుతుంది..! కాలేజీ వయసులో అయితే అభిరుచులు, మాటలు, జోకులు కలిస్తే స్నేహం కుదురుతుంది..! కాస్త మెచ్యూర్ అయిన తర్వాత అయితే మైండ్ లో ఆలోచనలు, మనసులో భావాలు కలిస్తే స్నేహం కుదురుతుంది..! వీటిలో ఏ దశలో స్నేహం కుదరాలన్నా ఒకరిపై ఒకరికి నమ్మకం, అవగాహన, గౌరవం ఉండాల్సిందే. స్నేహంలో ప్రాధమిక ధర్మాలు ఇవి..! కానీ బీజేపీ – జనసేన స్నేహంలో ఈ లక్షణాలు కనిపించడం లేదు. బీజేపీ అంటే జనసేనకి నమ్మకం లేదు, అవగాహన లేదు. జనసేన అంటే బీజేపీకి నమ్మకం లేదు, అవగాహన లేదు. అందుకే ఈ దాగుడు మూతలు. అందుకే కత్తులు దూసుకుంటూ పొత్తుల మాటలు చెప్పుకుంటున్నారు. ఆ నమ్మకం, అవగాహన లేకుండా పొత్తు ఎందుకు..? అనే అనుమానాలు రావచ్చు..- నమ్మకానికి, అవగాహనకు మధ్య ఈ రెండింటినీ డామినేట్ చేస్తూ “అవసరం” అనేది ఉంటుంది. ఈ అవసరమే ఈ బీజేపీ – జనసేన రెండు పార్టీల మధ్య పొత్తు చిగురించేలా చేసింది.
బీజేపీ జనసేన పెద్దలు – ఎవరి లెక్కలు వారివి..!!
తిరుపతి ఎంపీ స్థానానికి ఎవరు పోటీ చేయాలి అనే అంశంపై ఇప్పటికీ రెండు పార్టీలు ఒక స్పష్టతకు రాలేదు. “మేము పోటీ చేస్తాం మీరు మద్దతివ్వండి” అంటూ రెండు పార్టీలు ఒకరికి ఒకరు చెప్పుకుంటూ.., పైకి అంతా సర్దుకుంటుంది అని చెప్పుకుంటున్నారు.
* తిరుపతి ఎంపీ స్థానం పరిధిలో మొత్తం 14 లక్షల ఓట్లు ఉంటాయి. ఎక్కువగా ఎస్సి ఓట్లు, తర్వాత బీసీ…, రెడ్డి, కమ్మ, కాపు ఉన్నాయి. 2009 లో ప్రజారాజ్యం అభ్యర్ధికి లక్ష డెబ్బై వేల ఓట్లు వచ్చాయి. 2019 లో జనసేన పొత్తుతో బీఎస్పీ అభ్యర్ధికి 21 వేల ఓట్లు.., బీజేపీ అభ్యర్ధికి 16 వేల ఓట్లు వచ్చాయి.
* జనసేన లెక్కల ప్రకారం తిరుపతి ఎంపీ స్థానం మొత్తంలో కాపు సామజిక వర్గ ఓట్లు సుమారుగా 70 వేలు ఉన్నాయని.., పవన్ అభిమానుల ఓట్లు కలిస్తే ఈజీగా లక్షన్నర ఓట్లు తెచ్చుకోవచ్చు అనేది ఒక గుడ్డి అంచనా. కానీ ఈ అంచనాను బీజేపీ అంగీకరించడం లేదు.
* బీజేపీ లెక్కలు ప్రకారం ఏపీలో బీజేపీకి బలం బీభత్సంగా పెరిగిపోయింది. హిందువులు దగ్గరయ్యారు. మోడీ, అమిత్ షా ప్రభావంతో బీజేపీ పోటీ చేస్తే ఈజీగా 2 లక్షల ఓట్లు వచ్చేస్తాయి.. సో జనసేన కంటే బీజేపీ అభ్యర్థి బెటర్. మా 2 లక్షలకు మీ ఓట్లు కలిస్తే గెలిచేస్తాం అనే కాకి లెక్కల్లో ఉన్నారు.
* కానీ ఈ రెండు పార్టీల వాస్తవ పరిస్థితులు ఏమిటో ఆ రెండు పార్టీల పెద్దోళ్ళకు తెలుసు. అందుకే ఒకరిపై ఒకరికి నమ్మకం లేదు, ఒకరిపై ఒకరికి అవగాహన లేదు. జనసేన పోటీ చేస్తే మేము అనుకున్న కంటే తక్కువ వస్తాయని బీజేపీ భావిస్తుంటే.., బీజేపీ పోటీ చేస్తే మా అంచనా కంటే తక్కువ వస్తాయని జనసేన అనుకుంటుంది..!!
నేతలు ఎన్ని సార్లు మాట్లాడతారు..? ఎన్ని భేటీలు వేస్తారు..!?
గడిచిన రెండు నెలల్లో సుమారుగా ఆరుసార్లు బీజేపీ – జనసేన పార్టీల నేతలు భేటీ అయ్యారు. అటు హైదరాబాద్, ఇటు విజయవాడ, మధ్యలో తిరుపతి ఇలా పలు దఫాలుగా బీజేపీ – జనసేన నాయకులు కలిసి తిరుపతి ఉప ఎన్నికలో పోటీపై చర్చించుకున్నప్పటికీ ఒక స్పష్టతకు రాలేకపోయారు. మూడు రోజుల కిందట హైదరాబాద్ లోనే పవన్ నివాసంలో పవన్ కళ్యాణ్ తో సోము వీర్రాజు భేటీ అయ్యారు. అక్కడ ఏమి తేలలేదు. మళ్ళీ ఆ తర్వాత రోజున పవన్ కళ్యాణ్ తో బీజేపీ నేతలు సునీల్ ధియోధర్, పురంధేశ్వరి బేటా అయ్యారు. అయినా ఏమి తేలలేదు. ఇక చేసేదేమి లేక… కేంద్ర పెద్దలే కల్పించుకుని విషయంపై ఒక సూచన చేయాలని వదిలేశారు. అంటే కేంద్రం చెప్తేనే పవన్ వింటారు అనేది బీజేపీ నాయకుల ఆలోచన. జనసేన పోటీకి దిగాలని పవన్ కళ్యాణ్ పట్టుదలతో ఉన్నారు. పైగా ఆయనపై పార్టీ నేతల ఒత్తిళ్లు కూడా ఉన్నాయి. గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయలేదు కాబట్టి.., తిరుపతిలో బీజేపీ మద్దతుతో పోటీకి దిగాలని జనసేన గట్టిగా కోరుకుంటుంది..! దుబ్బాక, గ్రేటర్ లో గెలిచాం కాబట్టి.., తిరుపతిలో పోటీ చేసే ఊపు పెంచుకోవాలని బీజేపీ గట్టిగా అనుకుంటుంది.! అందుకే ఈ స్పష్టత ఉండడం లేదు..!!