ఏపీలో 2019 ఎన్నికల సందర్భంగా ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రముఖ నాయకుల ఇళ్ళల్లోనూ, కార్యాలయాల్లోనూ ఐటీ దాడులు జరిగాయి. అప్పట్లో వైసీపీ, బీజేపీ కలిపి ఈ కుట్రలు పన్నాయని, ఇవన్నీ చేస్తున్నాయని టిడిపి ఆరోపించింది. ఓకే. ఇటీవల జరిగిన ఢిల్లీ ఎన్నికల సందర్భంగానూ అప్ నేతలకు చెందిన కొందరి ఇళ్లల్లో ఐటీ దాడులు జరిగాయి. ఇది కూడా బిజెపి పనే అని రాజకీయంగా బిజెపి ఐటీ శాఖను వాడుకుంటోందని రాజకీయ కక్ష కోసం ఇలా చేస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు. కర్ణాటక లోనూ కాంగ్రెస్ పార్టీకి, జెడియు కి చెందిన అనేక నేతల ఇళ్లపై ఐటి దాడులు జరిగాయి. తాజాగా రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నాయకుల ఇల్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు నిన్న జరిగాయి, ఈ రోజు జరుగుతున్నాయి. వీటిపై బిజెపి ఏం చెప్పాలను కుంటుంది. రాజస్థాన్ లో రాజకీయ సంక్షోభం ఏర్పడిన రోజునే ఈ కాంగ్రెస్ నేతల ఆర్థిక లావాదేవీలు ఐటీ శాఖకు గుర్తొచ్చాయా?. అంతకు ముందు వీరు ఏమి తప్పు చేయలేదా? ఇప్పుడే చేశారా? అనేది సాధారణ రాజకీయ అభిమానుల్లో కూడా ప్రశ్న లేస్తుంది. ఈ ఐటీ దాడులు ద్వారా బీజేపీ ఏమి చెప్పాలనుకుంటుంది. ఎవరిని బెదిరించాలని అనుకుంటుంది.
రాజస్థాన్ లో ఏమి జరుగుతోంది..!
రాజస్థాన్ లో ప్రభుత్వం నిలకడగా ఉండాలంటే కనీసం 101 మంది శాసనసభ్యులు మద్దతు ఉండాలి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సీఎం అశోక్ గెహ్లాట్ కి అనుకూలంగా 106 గురు ఉన్నారంటూ ఆ పార్టీ సిఎల్పీ భేటీలో ప్రస్తావించారు. ఇదే విషయాన్ని అధికారికంగా కూడా ప్రకటించారు. కానీ సచిన్ పైలెట్.. సీఎల్పీ భేటీ హాజరుకాలేదు. ఆయన వర్గం ఎమ్మెల్యేలు కూడా చాలామంది హాజరు కాలేదు. సచిన్ పైలెట్ బిజెపిలో చేరుతారని, రాజస్థాన్లో బీజేపీ మద్దతు ఇచ్చి అక్కడ ప్రభుత్వం మారడంలో కీలక పాత్ర పోషిస్తారని రెండు మూడు రోజులుగా వార్తలు వస్తున్నాయి. మరోవైపు సచిన్ పైలట్ కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్ళకుండా, రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిలబడేలా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా రాజస్థాన్ లో రాజకీయ సంక్షోభం ముదురుతున్న తరుణంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అక్కడి కాంగ్రెస్ నాయకుల తప్పులన్ని గుర్తొచ్చాయి. వాళ్లు ఆర్థిక లావాదేవీలు, చేసిన తప్పులు, కంపెనీల పన్నులు కట్టకపోవడం అన్నీ నిన్న ఈ రోజు గుర్తుకు వచ్చాయి. అదేమిటో బిజెపి చెబితే తప్ప ఐటీ శాఖ అధికారులకు కాంగ్రెస్ నేతల ఇల్లు, కార్యాలయాల చిరునామాలు తెలియదేమో. రాజకీయ సంక్షోభం ఏర్పడినప్పుడే ఐటీ అధికారులు పనులు చేయడం వెనక ఏం జరుగుతుంది అనేది రాజకీయ అభిమానులకే కాదు సగటు మనిషి కూడా సులువుగా అర్థమయ్యే విషయమే.
బీజేపీ అనేక ఆయుధాల్లో ఇదీ ఒకటి
కేంద్రంలో బిజెపి అధికారంలో ఉంది. మోడీ, అమిత్ షాల హవా విపరీతంగా నడుస్తుంది. ఓటర్ల అభిప్రాయాలతో వారికి సంబంధం లేదు. వచ్చిన స్థానాలతో సంబంధం లేదు. సీఎం కుర్చీ ఉందా లేదా. మాకు ఎంత మంది ఉన్నారు. మాకు ఇంకా ఎంతమంది అవసరం. అంతమంది వస్తున్నారా లేదా. ఇవే లెక్కలు. ఈ లెక్కల ఆధారంగానే అనేక రాజకీయ మార్పులు, చర్చలు, ప్రలోభాలు, బెదిరింపులు, దాడులు అన్నీ జరిగిపోతాయి. ఇది 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జరుగుతూనే వస్తోంది. మధ్యప్రదేశ్ లో ప్రభుత్వ మార్పు, కర్ణాటక ప్రభుత్వం మార్పు, తాజాగా రాజస్థాన్ లో రాజకీయ సంక్షోభం, జార్ఖండ్ లో రాజకీయ సంక్షోభంలో ప్రభుత్వ మార్పు, భవిష్యత్తులో మహారాష్ట్ర ఇలా ఏ రాష్ట్రం లో చూసినా బిజెపి తరహా రాజకీయ మార్పులు, ఐటి దాడులు, ఆయుధాలు బయట పెట్టడం మాత్రం జరుగుతూనే ఉంది. పాపం.. రాహుల్ గాంధీ.. రాజకీయ ఓనమాలు నేర్చుకోకముందే ధీటైన ప్రత్యర్థులను ఎదుర్కొంటున్నారు. అయన ఇంకా దశాబ్దంన్నర దాటినా చురుకైన రాజకీయ నాయకుడిగా ఎదగలేక, క్షేత్రస్థాయిలో వచ్చిన బలాన్ని వినియోగించుకోలేక, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలను నిలబెట్టుకోలేక ముప్పుతిప్పలు పడుతున్నారు. బీజేపీ చేతిలో ఉన్న ఆయుధాలలో ఐటీశాఖ ఆయుధం బలంగా ఉపయోగపడుతుంది. రాజస్థాన్ లో రాజకీయ సంక్షోభం వేళ ఈ ఐటీ దాడులు ఎటువంటి పరిణామాలకు దారితీస్తాయి. బిజెపి అంతర ఉద్దేశం నెరవేరుతుందా లేదా అనేది మాత్రం వేచిచూడాల్సి ఉంది.