Central Budget : రాజ్యాంగం ఎవరు రాశారు..!? నిర్మొహమాటంగా.., తడుముకోకుండా చెప్పే మాట బీఆర్ అంబేద్కర్..! ఇప్పుడు అమలవుతున్న రాజ్యాంగం ఎవరు రాశారు..!? మోడీనా..? అమిత్ షానా ..!? అంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి.., ఇప్పుడు అమలవుతున్న రాజ్యాంగానికి పెద్ద తేడా ఏమి లేదు. ఇప్పుడు కొంచెం నైతికత కొరవడింది. రాజ్యాంగంలో రాజకీయ నైతికత ఎక్కడా రాయలేదు కాబట్టి కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటె.., ఆ తరహాలో పాలన ఉంటుంది. పాలనలో భాగంగా బడ్జెట్ ఉంటుంది. బడ్జెట్ లో కేటాయింపులు ఉంటాయి..! ఇప్పుడు ఈ గోల మొత్తం ఎందుకు..? అంటే రాష్ట్రానికి నిధుల కేటాయింపు గురించి చెప్పుకోవాలి అంటే కచ్చితంగా “రాజ్యాంగం – నైతికత” అనే పెద్ద పెద్ద మాటలు వాడాల్సిందే..!
Central Budget : బీజేపీ వచ్చాక ఏపీకి ఏమిచ్చినట్టు..!?
బీజేపీ ఏపీకి ఏమిచ్చింది..!? ఈ ఒక్క మాటకి స్పష్టంగా సమాధానం ఇచ్చే స్థితిలో ఏపీలోని బీజేపీ నాయకులు కూడా లేరు. అది, ఇదీ అంటూ మంగళగిరి ఎయిమ్స్.., రాజధానికి 1500 కోట్లు.., పోలవరానికి జాతీయ హోదా.., ప్యాకేజి కింద అన్ని కోట్లు… అంటూ అస్పష్టమైన సోది పురాణం చెప్తారు తప్ప… ఏపీకి మాత్రమే ప్రత్యేకంగా ఇచ్చింది అనుకునేలా ఏమి లేవు. గడిచిన ఐదేళ్లలో పెద్దగా ఇచ్చింది లేదు, ఈ రెండేళ్లలో వైసీపీ అధికారంలోకి వచ్చాక కూడా ఏమి లేదు. ఒకదశలో ఏపీకి అంటూ కేంద్రం నుండి ప్రత్యేకంగా కనీసం రూ. 10 వేల కోట్ల విలువైన ప్రాజెక్టు కూడా లేదు.
ఇవ్వాలంటే ఎన్ని ఉన్నాయి..!?
ఏపీకి ఇప్పుడు కేంద్రం ఆర్ధిక అండ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దేశంలో ఏపీ ఉన్నంత ఆర్ధిక కష్టాల్లో ఇతర రాష్ట్రాలు ఏవి లేవు. కేంద్రం ఇవ్వాలె కానీ.. ఏపీకి బీజేపీ ఇవ్వాల్సిన వరాలు ఎన్నో ఉన్నాయి.
* ఈ బడ్జెట్ లో దేశం మొత్తం మీద 5 షిప్ యార్డులు అంటూ ప్రకటించారు. అందుకు ఏపీ అనువైన ప్రదేశం.. సుమారుగా 1200 కిలోమీటర్లు తీరప్రాంతం ఉన్న ఆంధ్ర ప్రదేశ్ లో షిప్ యార్డు ఏర్పాటుకి అత్యంత అనువైన ప్రాంతాలు ఉన్నాయి. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో డిమాండ్, అవసరం కూడా ఉంది. కానీ కేంద్రం నుండి కరుణ లేదు.
* తమిళనాడులోని చెన్నై మెట్రోకీ కేంద్రం ఇప్పుడు రూ. 65 వేల కోట్లు ప్రకటించింది. బెంగుళూరు మెట్రోకీ 14 వేల కోట్లు, కొచ్చి మెట్రోకీ 1479 కోట్లు ఇచ్చింది. ఏపీలో మెట్రో ప్రతిపాదనలు ఏ నాటి నుండో ఉన్నాయి. విశాఖపట్నం, అమరావతిలో మెట్రో ఏర్పాటు కోసం గత ప్రభుత్వమే ప్రతిపాదనలు పంపించింది. వైసీపీ వచ్చాక దీనిపై కదలిక లేదు, కేంద్రంలో కనీస పట్టింపు లేదు.
* జాతీయ రహదారుల నిర్మాణం అంటూ తమిళనాడుకి రూ. లక్ష కోట్లు, కేరళకి రూ. 65 వేల కోట్లు.., బెంగాల్ కి రూ. 25 వేల కోట్లు.., అస్సాం కి రూ. 35 వేల కోట్లు ఇచ్చారు. ఏపీలోనూ జాతీయ రహదారులు.. కారిడార్ ల నిర్మాణం అవసరం ఉంది. జాతీయ రహదారి 44 , 16 , 516 సహా అనేక దారులు నాలుగు లైన్లలోనే ఉన్నాయి. ఏపీలో జాతీయ రహదారులకు కేంద్రం నిధులు మంజూరు చేసి మూడేళ్లు గడిచింది. 2018 బడ్జెట్ నుండి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.
* తాడేపల్లిగూడెం లో నిట్ ఏర్పాటు చేసిన తర్వాత 2016 లో నిధులు కేటాయించారు. ఆ తర్వాత దాని బాగోగులు ఏమి చూడలేదు. ఇదే తరహాలో 2016 లోనే మంగళగిరి ఎయిమ్స్ కోసం నిధులిచ్చారు. ఆ తర్వాత దీనికి కూడా ప్రత్యేకంగా నిధులంటూ ఏమి ఇవ్వలేదు.
* రాష్ట్రంలో 16 మెడికల్ కళాశాలల ఏర్పాటుకి కేంద్రం అనుమతులు ఇచ్చింది. కానీ వీటి నిర్మాణానికి అవసరమైన నిధుల విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదు. 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్రం వేసుకుని ఈ మెడికల్ కళాశాలల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. కానీ వీటిపై కేంద్రంలో కదలిక లేదు. వీటి నిర్మాణం కోసం కనీసం రూ. 2500 కోట్లు నిధులు కేంద్రం నుండి రావాల్సి ఉంది.
* ఇలా చెప్పుకుంటూ వెళ్తే రాష్ట్రానికి రెవెన్యూ లోటు పూడ్చాలింది.., పోలవరానికి నిధులివ్వాల్సింది కేంద్రమే. అనేక అంశాల్లో రాష్ట్రానికి కేంద్రం మొండి చేయి చూపించింది.
మనదే దారుణమైన స్థితిలో ఉన్నది అని తెలిసి కూడా..!!
ఆర్థికపరంగా దేశంలోనే అత్యంత దారుణమైన పరిస్థితిలో ఉన్న రాష్ట్రం ఏపీ. ఈ విషయాన్నీ 15 వ ఆర్ధిక సంఘం స్వయంగా చెప్పింది. ఆర్ధిక మంత్రికి ఇచ్చిన నివేదికలో ఏపీ ఫైనాన్సియల్ పరిస్థితులపై స్పష్టమైన పాయింట్లు చెప్పింది. ఏపీలో ఆర్ధిక పరిస్థితులు ఏ మాత్రం బాగులేవని.., ఆదాయం పెంచుకుని, ఖర్చులు తగ్గించుకోకుంటే రాష్ట్రం దెబ్బతినే పరిస్థితులు ఉన్నాయంటూ హెచ్చరించింది. కానీ దీనిపై కేంద్రంలో కదలిక లేదు. ఒక సూచనతో సరిపెట్టింది తప్ప… రాష్ట్రాన్ని ఆదుకునేలా ప్రత్యేక నిధులు లేవు, కనీసం రావాల్సిన నిధులు కూడా ఇవ్వలేదు.
ఎన్నికలే బీజేపీ అజెండా..! అందుకే ఆ రాష్ట్రాలకు..!!
అస్సాం, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. అందుకే ఈ రాష్ట్రాలపై కేంద్రం ప్రత్యేక శ్రద్ధ చూపించింది అని బడ్జెట్ లెక్కల్లోనే తెలుస్తుంది. ఇది సబబే. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో బీజేపీ తన పార్టీ ఎదుగుదల, స్వార్ధం చూసుకోవడం ఏ మాత్రం తప్పు కాకపోవచ్చు..!! కానీ వీటి కోసం ఇతర రాష్ట్రాలకి దెబ్బ వేయడం.., ఏపీ లాంటి రాష్ట్రాలకు కనీసం నిధులు ఇవ్వకపోవడమే అసలు సమస్య. అందుకే ఇది అమిత్ షా – మోడీ ద్వయం రాసుకున్న నైతికత లోపించిన రాజ్యాంగ అమలుగా పేర్కొన వచ్చు. బహుశా ఇది ఏపీ దురదృష్టమో.., బీజేపీ లాంటి పార్టీ లేనందుకు ఏపీ అదృష్టమో కావచ్చు.
* ఒక్కటి మాత్రం నిజం..! రాష్ట్రానికి జరిగిన ఈ అన్యాయంపై జగన్ స్థాయిలో గట్టిగా గొంతు పెకిలిస్తే.., జగన్ నేరుగా విమర్శిస్తే ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది. కానీ జగన్ వ్యక్తిగత అవసరాలు, వ్యక్తిగత కారణాలతో ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేరు. అందుకే రెండు రోజుల పాటూ విజయసాయిరెడ్డి లాంటి నేతల చేతి చిన్నగా.. నెమ్మదిగా బీజేపీపై విమర్శలు చేయించి, తర్వాత సైలెంట్ అయిపోతారు.
* చంద్రబాబు కూడా ఈ స్థితిపై మాట్లాడలేరు. 2019 ఎన్నికలకు ముందు మోడీని, బీజేపీని ఇష్టం వచ్చినట్టు విమర్శించిన చంద్రబాబు.. అదే ఆవేశం ఇప్పుడు చూపిస్తే.. బీజేపీ చేసిన అన్యాయాన్ని ప్రశ్నిస్తే రాష్ట్రం కోసం ఈయన అనేట్టు ఉండేది. కానీ చంద్రబాబు అలా చేస్తే ఆయన “చంద్రబాబు” కానే కాదు. సో.. జగన్, చంద్రబాబుకి లేని దురద మనకు ఎందుకులే అనుకుని జనసేన, బీజేపీ లాంటి నాయకులు కూడా బడ్జెట్ సూపర్ అంటూ పాటలు అందుకున్నా ఆశ్చర్యం అవసరం లేదు..!!