“హార్వర్డ్ కన్నా హార్డ్ వర్క్ శక్తివంతమైనది “ అని గతంలో ఒకసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కానీ, ఇప్పుడు బాగా కష్టపడుతున్న చౌకీదార్ గా తనని తాను అభివర్ణించుకుంటున్న తరుణంలో ఆయన పార్టీకి చెందిన హార్వర్డ్ విద్యావంతుడు సుబ్రమణ్యస్వామి బ్రాహ్మాణులు ఎప్పటికీ చౌకీదార్ పని చెయ్యరు అని అన్నారు.
ఇంతకు మునుపు మోదీ చాయ్ వాలా అవతారంలో ఉన్నప్పుడు కేంబ్రిడ్జ్ విద్యావంతుడు మణి శంకర్ అయ్యర్ మోదీని ఉద్దేశించి “నువ్వు చాయ్ అమ్ముకునే పని మాత్రమే చెయ్యాలి” అని అన్నారు. ఈ హార్వర్డ్, కేంబ్రిడ్జ్ బ్రాహ్మణులు తమ కులాన్ని ఎందుకు వదులుకోలేకపొతున్నారు? ఇందులో ఒకరు ఆర్.ఎస్.ఎస్ బ్రాహ్మణుడు, మరొకరు కాంగ్రెస్ బ్రాహ్మణుడు. ఒకరకంగా చెప్పుకోవాలంటే ఇటువంటి కులవాదుల కులతత్వాన్ని బహిర్గతం చేసినందుకు దేశం మొత్తం మోదీకి కృతజ్ఞత చెప్పుకోవాలి.
మోదీ తన పేరుకి ముందు చౌకీదార్ బిరుదు (ఈ చర్య తన సొంత సంఘ్ పరివార్లో పెద్ద చర్చకు దారి తీసిందికాబట్టి దీనిని బిరుదు అంటున్నాను) తగిలించుకున్నప్పటి నుండి బిజెపిలో ఒక వర్గానికి చెందిన పార్లమెంట్ సభ్యులు, మంత్రులు కుల ప్రాతిపదికన కానీ వర్గ ప్రాతిపదికన కానీ దీనిని వ్యతిరేకిస్తూ వచ్చారు.
కానీ, నెమ్మది నెమ్మదిగా ఒకొక్క మంత్రీ దారిలోకి వచ్చారు. ఇప్పుడు భారతదేశంలో చౌకీదార్ ప్రభుత్వం ఉన్నది. బిజెపి తిరిగి అధికారంలోకి వస్తే మిగిలి ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలని కూడా ప్రైవేటుపరం చేస్తుంది అని ప్రైవేటు రంగం ఉత్సాహంగా ఉంది. సామ్యవాదులు, సంక్షేమవాదులు, దళితులు, బహుజనులు తదితరుల నుంచి ప్రైవేటు పెట్టుబడిని కాపాడటానికి భారత రాజ్యం చౌకీదార్ గా పని చేస్తుంది.
‘నేను కూడా చౌకీదార్నే’ మోదీ అని ట్వీట్ చేసిన మరుక్షణం ఆయన అత్యంత విశ్వాసపాత్రుడైన అభిమాని అమిత్ షా తన ట్విట్టర్ పేరుకి ముందు ‘చౌకీదార్’ బిరుదు తగిలించారు. అందరూ అలాగే తగిలించాలి అని పార్టీ నాయకులకు ఆయన ఆజ్ఞ కూడా జారీ చేశారు. చాలామంది తుచ తప్పకుండా పాటించారు.
కానీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్.) కి చెందిన పై స్థాయి నాయకులు ఒక్కరంటే ఒక్కరు కూడా తమ ట్విట్టర్ పేరుకి ముందు ఆ బిరుదు తగిలించలేదు. మోహన్ భగవత్, భయ్యాజీ జోషీ ఇద్దరూ తగిలించలేదు.
బిజెపి ఎంపి సుబ్రమణ్య స్వామి
రాహుల్ గాంధీ ప్రచారంలోకి తెచ్చిన ‘చౌకీదారే దొంగ’ నినాదాన్ని తిప్పికొట్టే పని చెయ్యడానికి తమ కార్యకర్తలలో 25 లక్షలు మంది చౌకీదార్లు అయ్యారని బిజెపి చెబుతున్నది. రాహుల్ గాంధీ బిజెపి మీద చేస్తున్న దాడిని చౌకీదార్లు అందరి మీద, అలాగే దేశం మీద దాడిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నది. స్వయంసేవక్లు అందరినీ చౌకీదార్లుగా మార్చాలి అనేది వారి ఆలోచన.
చౌకీదార్లు నిర్వర్తించే బాధ్యతలు అత్యంత అమానవీయమైనవి. ధనికుల తలుపుల దగ్గర నిలబడి వారి ఆదేశాలు పాటించవలసి ఉంటుంది. ఒకరకంగా ప్రధానమంత్రి ‘నేను కూడా చౌకీదార్నే’ ప్రచారం నిజమైన చౌకీదార్లు చేసే పనులను అందరి దృష్టికి తీసుకువచ్చింది. మొదటిసారిగా వారి ఉద్యోగం గురించి చర్చ నడుస్తున్నది.
కానీ ఇదంతా కూడా వారి జీవితాలలో కానీ, వారి ఉద్యోగ బాధ్యతలలో కానీ, ఈ ఆధునిక బానిసలపై యజమానులు చేసే ఆజమాయిషిలో కానీ ఏమన్నా మార్పును తీసుకువచ్చిందా? ఈ ప్రచారం వారి జీతభత్యాలని పెంచిందా? ప్రధాన మంత్రికి కానీ ఆయన ప్రభుత్వానికి కానీ ఇవేమీ పడుతునట్టు లేదు. కేవలం కాంగ్రెస్ ప్రచారాన్ని తిప్పికొట్టడం గురించే వాళ్ళ ఆలోచన అంతా కూడా.
ఈ మొత్తం ప్రక్రియలో ఈ చౌకీదార్ ఉద్యోగం వెనుక ఉండే కుల-వర్గ నేపధ్యం, హిందుత్వ క్యాంపులో బ్రాహ్మణుల వైఖరి ఎలాంటిదో సుబ్రమణ్య స్వామి ద్వారా బహిర్గతం అయ్యాయి. ఆయన వ్యాఖ్య కేవలం హిందూ మత చారిత్రక వైఖరినే కాక, అణగారిన కులస్థులు చేసే చౌకీదార్ ఉద్యోగాన్ని హిందుత్వ వాదులు గౌరవప్రదమైనదిగా భావించరన్న విషయాన్ని కూడా బయటపెట్టింది. ఒక బ్రాహ్మణుడు, ఒక పూజారి, ఒక రాజకీయ పండితుడు ఈ రకం ఉద్యోగాల్ని ఏ విధంగా పరిగణిస్తారో స్పష్టంగా తెలిసిపోయింది.
సుబ్రమణ్య స్వామి చేసిన బ్రాహ్మణ (బ్రాహ్మిణవాద కాదు) వ్యాఖ్యపై ఆరెస్సెస్/బిజెపి పాటించిన మౌనం చూస్తే హిందుత్వ శక్తుల మూల సిద్ధాంతం ఏమిటో మనకి స్పష్టంగా తెలుస్తున్నది. కాంగ్రెస్ పార్టీ కనీసం మణి శంకర్ అయ్యర్ని మందలించింది. ఆర్.ఎస్.ఎస్. మాత్రం సుబ్రమణ్య స్వామి బాగా చెప్పాడు అని భావిస్తునట్టు తోస్తోంది. ఓబిసి కాబట్టి మీరు చౌకీదారు కావచ్చు కానీ బ్రాహ్మణులకి కుదరదు అని మోదీకి చెప్పటం ద్వారా ఆయన వర్ణధర్మాన్ని కాపాడిన వాడు అయ్యాడు.
“నేను చౌకీదార్ ను కాదు. నేను బ్రాహ్మణుడిని. కాబట్టి నేను చౌకీదార్ను కాలేను నేను నా అభిప్రాయం చెబుతాను. నేను చెప్పిన దానిని అనుసరించి చౌకీదార్ పనిచెయ్యాలి.” అని సుబ్రమణ్య స్వామి అన్నారు. బ్రాహ్మణుల అంతరంగాన్ని ఇంత నిక్కచ్చిగా చెప్పినందుకు ఆయనని మెచ్చుకోవాలి. మోదీ ఒక చౌకీదార్ ప్రధాని. కానీ ఆయన ఆధ్యాత్మికంగా ఒక బ్రాహ్మణుడితో ఎప్పటికీ సమానం కాలేరు.
ఒక హార్వర్డ్ విద్యావంతుడైన బ్రాహ్మణుడి అభిప్రాయం ఇలాఉంటే దేశంలోని శ్రమ జీవుల గురించి వారి ఉద్యోగాల గురించి ఒక సనాతన బ్రాహ్మణుడి అభిప్రాయం ఏమయ్యుంటుంది?
“హిందూ మతం గురించి చర్చించటానికి కావలసిన జ్ఞానం కేవలం బ్రాహ్మణుల దగ్గర మాత్రమే ఉన్నది. ఉమా భారతి కులం ఏమిటో ఎవరికైనా తెలుసా? సాధ్వీ రితంబర కులం ఏమిటో ఎవరికైనా తెలుసా? ఈ దేశంలో మతం గురించి తెలిసింది కేవలం పండితులకి, బ్రాహ్మణులకి మాత్రమే.” అని రాజస్థాన్ లో మొన్న జరిగిన శాసనసభ ఎన్నికలకి ముందు కాంగ్రెస్ బ్రాహ్మణుడు సి.పి. జోషీ అన్నారు.
“లోధ కులానికి చెందిన ఉమా భారతి హిందూ మతం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ఏదో మతానికి చెందిన సాధ్వీ రితంబర హిందూ మతం గురించి మాట్లాడుతున్నది. నరేంద్ర మోదీ గారు ఇంకేదో మతానికి చెందిన వారు. ఆయనా హిందువుల గురించి మాట్లాడున్నారు.” అని జోషి వ్యాఖ్యానించారు.
సి.పి. జోషి మోదీని హిందువుగా కూడా పరిగణించలేదు. బహుశా బ్రాహ్మణులు మాత్రమే హిందువులు అని చెప్పదలుచుకున్నట్లుంది. ఆయన నిజమే చెప్పారని నేను అనుకుంటున్నా.
బిజెపి, కాంగ్రెస్ రెండిట్లోనూ ఇటువంటి శక్తులు ఇంకా ప్రబలంగానే ఉన్నాయి. తమ కాయకష్టంతో ఈ దేశాన్ని నడిపిస్తున్న శూద్రులు, దళితులు, ఆదివాసీలు ఈ శక్తులకి ఊడిగం చేసేవారే. “నేను బ్రాహ్మణుడిని. నేను నా అభిప్రాయం చెబుతాను. చౌకీదార్వి అయిన నువ్వు దానికి అనుగుణంగా పని చెయ్యాలి” అని సుబ్రమణ్య స్వామి చెప్పటంలో అంతరార్థం ఇదే.
ఈ దేశంలో ఏది మారినా బ్రాహ్మణుల స్థానం మాత్రం చెక్కుచెదరదు.
కుల నిర్మూలన పోరాటాల నేపధ్యంలో మనకి ఇది చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. బ్రాహ్మణుడు ఇప్పటికీ మహోన్నతంగా, ఆధిపత్య స్థాయిలో ఉన్నాడు. రాహుల్ గాంధీ తనని తాను బ్రాహ్మణుడు అని చెప్పుకున్నప్పుడు “ఒక ముస్లిం తండ్రికి, క్రైస్తవ తల్లికి పుట్టినవాడు బ్రాహ్మణుడు ఎలా అవుతాడు” అని బిజెపికి చెందిన అనంత్ కుమార్ హెగ్డే ప్రశ్నించాడు. హెగ్డే అన్నదాంట్లోని నిజానిజాలను పక్కనుంచితే ఇక్కడ మనకి అర్థమయ్యేది ఏమిటంటే బ్రాహ్మణవాదం మత మార్పిళ్లను నమ్మదు అని.
బిజెపి కానీ ఆర్.ఎస్.ఎస్ కానీ సుబ్రమణ్య స్వామి, అనంత్ కుమార్ హెగ్డే వ్యాఖ్యలని ఖండించలేదు. వాళ్ళు మన భావాలనే మాట్లాడుతున్నారు అని ఆర్.ఎస్.ఎస్ నాయకత్వం భావించినట్టు ఉంది.
కాంగ్రెస్ నాయకుడు మణి శంకర్ అయ్యర్
తన ఓబిసి సర్టిఫికెట్తో, మొన్నటి చాయ్ వాలా, ఈనాటి చౌకీదార్ బిరుదులతో ఒక రకంగా నరేంద్ర మోదీ భారత రాజకీయాలలో కుల చర్చని లేవనెత్తారు. దీని ద్వారా మనకి తెలిసింది ఏమిటంటే తాము కులానికి అతీతం అని చెప్పుకునే బిజెపి, ఆర్.ఎస్.ఎస్ తమ దైనందినక కార్యకలాపాల్లో కులాన్ని తప్పక పాటిస్తున్నాయి అని.
కులానికి సంబంధించి మేధావులు, ఉదారవాద వామపక్షవాదులు నోరు కట్టేసుకుని ఉండటం కులాన్ని ఇంకో రకంగా కాపాడింది. ఇప్పుడు మితవాద మేధావులు బ్రాహ్మణత్వాన్ని నిర్భయంగా మోస్తుండటంతో ఆధ్యాత్మిక ఫాసిజం కొత్త పుంతలు తొక్కుతున్నది.
ఇంతక మునుపు దళిత ఉప ప్రధాని అయిన జగ్జీవన్ రాం అవమానాలకి గురయ్యారు. ఇప్పుడేమో నిరంకుశ ప్రధానమంత్రిగా పేరున్న ఒక ఓబిసి (గుజరాతీ కోమటి నేపధ్యం ఉన్నప్పటికీ)ని సుబ్రమణ్య స్వామి లాంటి ఒక సాధారణ రాజ్యసభ సభ్యుడు వెక్కిరించాడు.
హిందుత్వ మత రాజ్యం కనుక ఏర్పడితే శూద్రులు, దళితులు, ఆదివాసీలను వర్ణ ధర్మంలో వారికి కేటాయించిన స్థానాలకు తోయడం ఖాయం. అలాగే మూడు ద్విజ కులాలు ఉన్నత స్థానానికి వెళతాయి. ఇటువంటి హిందూ సామాజిక వ్యవస్థని అంబేద్కర్ మనుధర్మం అన్నారు. అది ఇప్పటికీ పటిష్టంగా ఉంది.
రాజకీయ పార్టీలో ఉన్న బ్రాహ్మణులు తమ బ్రాహ్మణత్వాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేనపుడు తాము చాయ్వాలాలం, చౌకీదార్లం అని చెప్పుకునేవారే ప్రజలకు నచ్చుతారు. బెంగాల్ కి చెందిన బ్రాహ్మణులైనటువంటి కమ్మ్యూనిస్ట్ నాయకుల విషయంలో కూడా ఇది నిజం. బెనర్జీ, ఛట్టర్జీ , ముఖర్జీ లాంటి కుల గుర్తింపుని వదులుకోకపోగా మేము కులాన్ని గుర్తించేదిలేదని వాదించారు.
ప్రపంచీకరణకు ముందు కాలంలో బతుకుతున్న భారతీయులు మాత్రమే వారిని నమ్ముతారు. ప్రపంచీకరణ తర్వాతి విద్యావ్యవస్థలో చదువుకున్న శూద్ర, బహుజన, దళిత ఆదివాసీలకు శ్రమ గౌరవం ఏమిటో తెలుసు. కులచట్రంలోని ప్రతి ఎత్తునూ వాళ్ళు పసిగట్టగలరు. ఇది మోదీకి సానుకూలాంశం.
-కంచె ఐలయ్య షెపర్డ్
వ్యాసకర్త రాజకీయ సిద్దాంతకర్త, సామాజిక కార్యకర్త, రచయిత
‘ద వైర్ ‘వెబ్సైట్ సౌజన్యంతో