ఈ వదంతులు ఎన్నో సంవత్సరాలుగా వినపడుతున్నాయి. సర్వవ్యాప్తమైన, నిర్విచక్షణమైన ప్రభుత్వ నిఘాని తప్పించుకోవటానికి వేలాది మంది ఎన్క్రిప్టెడ్ వాట్సాప్ కాల్స్ చేయడం మొదలుపెట్టారు. అయితే ఆ కాల్స్ను కూడా అధికారయంత్రాంగం వినేస్తున్నదని చాలా మంది ఎంతో కాలంగా వాదిస్తున్నారు. ఈ వదంతులు నిజమే అని గత కొద్ది రోజుల్లో తేలింది.
సాధారణంగా ప్రభుత్వ సంస్థలకి మాత్రమే తమ ఉత్పత్తులు అమ్మే ఇజ్రాయెల్కి చెందిన ఎన్ఎస్ఓ అనే సంస్థ రూపొందించిన పెగాసస్ అనే ఒక ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ ద్వారా వాట్సాప్ (అలాగే ఇతర మెసేజింగ్ యాప్స్) ని వాడుకుని కేవలం ఒక మిస్డ్ కాల్ ద్వారా మొబైల్ ఫోన్లను హ్యాక్ చేస్తున్నట్లు తేలింది.
వాట్సాప్లో వచ్చిన ఒక ఆడియో లేదా వీడియో మిస్డ్ కాల్- సాధారణంగా అంతర్జాతీయ నంబర్ నుండి- ద్వారా ఫోన్ని హ్యాక్ చెయ్యొచ్చు. దీని వల్ల బహిర్గతం అయ్యేది కేవలం ఇచ్చి పుచ్చుకున మెసేజులే కాదు. ఫోన్లోని పాస్ వర్డులు, ఈమెయిళ్ళు, ఫోటోలు కూడా బయటకు వెళ్లిపోతాయి. ఫోన్ వాడుతున్న వ్యక్తికి కూడా తెలియకుండా ఫోన్లోని కెమెరాను, మైక్ను కూడా ఈ సాఫ్ట్ వేర్ ఆన్ చెయ్యగలదు.
ఈ సాఫ్ట్వేర్ ఎవరెవరి మీద ప్రయోగించారు అనే విషయం కూడా గత కొద్ది రోజుల్లో మనకి తెలిసింది. ఈ సాఫ్ట్వేర్ చౌకగా ఏమీ రాదు- 2016 ధరల పట్టిక ప్రకారం మొదట ఓ పది ఫోన్లు హ్యాక్ చేసినందుకు అయ్యే ఖర్చు పది లక్షల డాలర్లకు పైమాటే. అంటే దీనిని ఆషామాషీగా వాడరు. లక్ష్యాన్ని చూసిచూసి నిర్ణయిస్తారని మనం అనుకోవచ్చు.
వాట్సాప్తో కలిసి పని చేస్తున్న కెనడాలోని టొరంటో విశ్వవిద్యాలయానికి చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ సిటిజన్స్ ల్యాబ్ ఈ హ్యాకింగ్కి గురయిన వారిని గత కొద్ది రోజులుగా అప్రమత్తం చేస్తూ వచ్చింది. ఇండియాలో వారి సంఖ్య కనీసం 17 మంది. అందులో ప్రధానంగా మానవ హక్కుల కార్యకర్తలు, న్యాయవాదులు, మేధావులు, పాత్రికేయులు ఉన్నారు. తమ ఫోన్ హ్యాక్ అయిందన్న సంగతి మెసేజ్ వచ్చినట్లు వారు స్క్రోల్.ఇన్కు నిర్ధారించారు.
ఈ విషయాలు కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
ఈ హ్యాకింగ్ ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తున్నదనీ, వాట్సాప్ను దీని గురించి వివరణ అడిగామని కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ గురువారం చెప్పుకొచ్చారు. దేశ అవసరాల దృష్ట్యా ఎవరి సంభాషణలనైనా ప్రభుత్వ వర్గాలు వినాలి అంటే దానికి స్పష్టమైన విధి విధానాలు ఉన్నాయి అని సందేహార్ధకమైన వ్యాఖ్య ఒకటి చేశారు. కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి కూడా ఈ సందర్బాన్ని ఆయన వాడుకున్నారు. గత ప్రభుత్వం నిఘా నిర్వహించింది అన్న ఆరోపణలని ఆయన ప్రజలకి “సున్నితంగా గుర్తుచేశారు”.
మంత్రి గారి మాటలు సరిపోవు. ఈ సాఫ్ట్వేర్ గురించి మరిన్ని వివారాలు చెప్పటానికి ఎన్ఎస్ఓ నిరాకరించింది. అయితే తాము ఈ సాఫ్ట్వేర్ని ప్రభుత్వాలకి మాత్రమే అమ్ముతాము అని పేర్కొంది. ఈ సాఫ్ట్ వేర్ ఖరీదు కూడా చాలా ఎక్కువ. కేవలం కొద్దిమంది మాత్రమే దీనిని కొనగలరు. అలాంటి వారి జాబితాలో ప్రభుత్వాలు ప్రధమ స్థానంలో ఉంటాయి.
అలాగే ఎవరెవరని టార్గెట్ చేశారు అని చూస్తే అందులో భారత రాజ్యం అణిచివేత కార్యకలాపాలని ఎప్పటికప్పుడు ఎత్తిచూపుతున్న మానవ హక్కుల కార్యకర్తలే ఉన్నారు అనేది స్పష్టం. వాళ్ళు ఏమి మాట్లాడుకుంటున్నారు, ఏమి చేస్తున్నారు అని తెలుసుకోవటం ప్రభుత్వానికే అవసరం. తన ప్రజల మీదే నిఘా పెట్టిన ఘనత భారత ప్రభుత్వానికి గతంలోనూ ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ఈ విషయం దృష్టిలో పెట్టుకుని భారత పౌరులకి సంక్రమించిన గోప్యత అనే ప్రాధమిక హక్కుని తాము ఉల్లంఘించలేదని, ఈ సాఫ్ట్వేర్ తాము వాడలేదని భారత ప్రభుత్వం నిర్ద్వంద్వంగా చెప్పవలసిన అవసరం ఉంది.
ఇది కేవలం కేంద్ర ప్రభుత్వానికి, ఇంటలిజెన్స్ బ్యూరో లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలకే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలకి కూడా వర్తిస్తుంది. ఈ నిఘా సాఫ్ట్వేర్ని ఉపయోగించాలని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిర్ణయించుకుని ఉండవచ్చు. తాము తమ పౌరులు మీద ఈ సాఫ్ట్వేర్ని వాడేది లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిజాయితీగా చెప్పగలవా?
సరే ఇది ప్రభుత్వం చేసిన పని కాదనుకుందాము. తక్కువలో తక్కువగా కేంద్ర ప్రభుత్వ ఘనకార్యం కాదు అని అనుకుందాము. అంతమాత్రాన వాట్సాప్ను వివరణ అడిగితే సరిపోతుందా? పాలక బిజెపి సభ్యులు ఇప్పటికే నిఘా పెట్టిన వాళ్ళని కాకుండా నిఘాకి గురయ్యిన వాళ్ళని ప్రశ్నించటం మొదలుపెట్టారు. ఎందుకంటే నిఘా బాధితులందరూ కూడా బిజెపి రాజకీయాలని విమర్శించే వాళ్ళే కాబట్టి.
Alarming ! What action did these people take since May 2019 ? did they approach Law enforcement agencies, courts, GOI ?? why are these eminent people so silent? they fight for human rights, but they couldn't fight for their privacy ?
— Vinit Goenka (@vinitgoenka) October 31, 2019
జరిగింది ఏ విధంగా చూసినా అన్యాయం. భారత పౌరుల ప్రాధమిక హక్కులు మీద జరిగిన దాడి ఇది. వారి వ్యక్తిగత రాజకీయాలతో పని లేదు ఇక్కడ. చట్టవిరుద్ధమైన ఇజ్రాయెల్ సాఫ్ట్వేర్ వాడుకుని ఒక అమెరికన్ సంస్థ భారతదేశ పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తుంది అంటే అది భారతదేశానికే ఎన్నో రకాలుగా ప్రమాదకరమైనది. అది ప్రభుత్వ స్థాయిలోనైనా సరే, వ్యక్తిగత స్థాయిలోనైనా సరే.
గతంలో జరిగిన డేటా ఉల్లంఘనల విషయంలో ప్రభుత్వం ఏవో నాలుగు మాటలు మాట్లాడటం తప్ప చేసిందేమీ లేదు. ఉదాహరణకి కేంబ్రిడ్జ్ ఎనలిటికా సంస్థ ఫేస్బుక్లో లక్షలాది మంది డేటాని చోరీ చేసి తమ అవసరాలకి వాడుకున్న ఉదంతం. కనీసం సారైనా ఏమన్నా చర్యలు ఉంటాయా?
భారీ సంఖ్యలో భారతీయుల క్రెడిట్ కార్డుల, డెబిట్ కార్డుల సమాచారం డార్క్ వెబ్లో అమ్ముతున్నారన్న సమాచారం, దేశంలో ఒక అణు విద్యుత్తు సంస్థ కంప్యూటర్ వ్యవస్థ మీద సైబర్ దాడి జరిగింది అన్న వివరాలు బయటకి వచ్చిన సమయంలోనే ఈ వాట్సాప్ హ్యాకింగ్ గురించిన వార్తలు కూడా వచ్చాయి. డేటా భద్రత విషయం గురించి భారత ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తుందా?
అధికారిక చట్రంలోనే కాకుండా చట్టసభల్లో కూడా ఈ విషయంలో తక్షణ చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది. డేటా భద్రత చట్టాన్ని తీసుకువస్తామని భారతీయులకూ, భారతదేశ సుప్రీం కోర్టుకీ ప్రభుత్వం చెప్పి చాలా సంవత్సరాలే అయ్యింది. వ్యక్తిగత డేటా భద్రత బిల్లు ముసాయిదా ఒక సంవత్సర కాలంగా చక్కర్లు అయితే కొడుతోంది కానీ పార్లమెంట్లో దీన్ని ఎప్పుడు ప్రవేశ పెడతారు అనే దానికి ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. అంతే కాక ఈ ముసాయిదా బిల్లులో నిఘాకి సంబంధించిన విషయాలు అన్నీ వదిలేశారు. దానికి వారు చెప్పిన కారణం అది వేరే చట్ట రూపంలో లో రావాలి అని.
రాబోయే శీతాకాలం పార్లమెంట్ సమావేశాలలో భారతదేశ ప్రజల వ్యక్తిగత డేటాని కాపాడే విధంగా- ప్రైవేటు సంస్థల, ప్రభుత్వ సంస్థలు రెండిటి నుండీ- చట్టం ఒకటి చెయ్యవలసిన అవసరం, అలాగే తన పౌరులు మీద భారత రాజ్యం నిర్వహించే నిఘాని నియంత్రించే చట్టం గురించి ముందడుగులు వెయ్యవలసిన అవసరం ఎంతో ఉంది. అటువంటి రక్షణ కావాలి తమ పార్లమెంట్ సభ్యులని అడగవలసిన బాధ్యత ప్రజల మీద ఉంది.
సైబర్ సెక్యూరిటీ, నిఘా, డేటా భద్రత విషయాలు వదంతులు స్థాయిని దాటి ముందుకు వెళ్ళాలి. ఈ దేశ ప్రజల ప్రాధమిక హక్కులని కాపాడటానికి చర్యలు తీసుకోవలసిన అవసరం ఇప్పుడు పాలకులకి ఉంది.
రోహన్ వెంకటరామకృష్ణన్
‘స్క్రోల్‘ వెబ్సైట్ సౌజన్యంతో