గోపూజ నిర్హేతుకమైనది. దానితో పాటు హిందూ కర్మకాండలలో వాడే ఆవు పేడ, ఆవు మూత్రం, పాలు, నెయ్యి, పెరుగు మిశ్రమమైన పంచగవ్యం మీద మన నమ్మకం కూడా నిర్హేతుకమైనదే.
బ్రాహ్మణుడిని దైవసమానుడిగా భావించినట్టే ఆవుని కూడా దైవసమానమైన పశువుగా భావిస్తూ ఉంటారు. ఆవుని వధించే వాడు సదా ‘ఆస్పృశ్యుడే’.
దీన్ని భ్రమలు, నమ్మకం, భావజాలం, మతం ఏమైనా అనండి. అయితే ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థ నిర్హేతుకత్వాన్ని మాత్రం విస్మరించడానికి లేదు. ఆవు బ్రాహ్మణుడు, ఆవుని వధించేవాడు ఆస్పృశ్యుడు. గుజరాత్ శాసనసభ సభాపతి మొన్నీమధ్య మాట్లాడుతూ బ్రాహ్మణులకి వేరే డిఎన్ఏ ఉంది, వారు మిగతా వారికి తమ ఆశీస్సులు అందించటానికి జన్మనెత్తారు అని ఉవాచించాడు. ఈ మాటల ద్వారా ఆయన గోపూజ అనే ఒక నిర్హేతుకమైన తర్కానికున్న పునాది ఏమిటో వివరించాడు.
అయితే పౌరసత్వం అనే ఒక భావన సమానత్వం, న్యాయం అనే అంశాల మీద ఆధారపడి ఉంటుంది కానీ నిర్హేతుకత మీద కాదు.
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నేడు ఉవ్వెత్తున జరుగుతున్న నిరసనలు మన రాజ్యాంగంలో మిళితమై ఉన్న విమోచన సామర్ధ్యాన్ని, సమ్మిళిత భారతదేశం అనే భావానికి అందులో ఉన్న ప్రాముఖ్యతని మరొక్కసారి తెలియచేస్తున్నాయి. మన రాజ్యాంగం సాధించిన ఘనమైన విషయాలలో ఒకటి చట్టం ముందు అందరినీ సమానంగా చూడాలి అనే ఒక విలువని క్రోడీకరించడం.
కులం, ప్రాంతం, మతం, లింగం, వర్గం అనే బేధం లేకుండా అందరినీ సమానంగా చూడాలి అనేది ఆ భావన. మన రాజ్యాంగం ప్రజలలో జాతీయభావం పెంపొందించటమే కాకుండా పౌరసత్వం పొందటానికి మత- ప్రాంత భేదభావం లేకుండా ఒక కాస్మోపోలిటన్ భావనని పెంపొందించే ప్రయత్నాలకి ఒక పునాదిని ఏర్పాటు చేసింది.
మన రోజువారి జీవితాలని శాసించే నిచ్చెన మెట్ల నిర్హేతుక వర్ణ వ్యవస్థకు భిన్నంగా ఈ విధంగా పొందే పౌరసత్వం విప్లవాత్మకమైనది. మనది అనేక రకాల అసమానతల దొంతరలు కలిగి ఉన్న సమాజం. ఇక్కడ ఆడపిల్ల అంటే మోయలేని బరువని, పెళ్ళి అంటే కట్నానికి, కులానికి సంబంధించిన వ్యవహారం అని, గుడిలోకి ప్రవేశం కేవలం అగ్రకులాల వారికని భావించటం , ‘క్రింది’ కులాల వారి పట్ల ఏహ్య భావం ఇక్కడ సర్వసాధారణం. ఇక్కడ ఆవు పవిత్రమైన పశువు, మిగతా జీవులు సామాన్య జీవులు.
చెప్పుకోవాలంటే అనేక రకాలుగా మనది చాల కుచించుకుపోయిన సమాజం. నిచ్చెన మెట్ల వ్యవస్థ నరనరాన జీర్ణించుకుపోయిన సమాజం. తక్కువ వారి పట్ల ఏహ్య భావం ఇక్కడ సాధారణం. చివరికి పేద పిల్లలకి మధ్యాహ్న భోజనంలో గుడ్డు పెట్టడం కూడా భారతీయ సంస్కృతికి వ్యతిరేకం అనేటంత కుచించుకుపోయిన సమాజం మనది. ప్రపంచంలో ఇంకే దేశంలోనూ ఆహారంలో ఇటువంటి తరతమ బేధాలు లేవు. చివరికి ముస్లిం మతస్థులు అధిక సంఖ్యలో ఉన్న దేశాలలో కూడా ముస్లిమేతరులు పంది మాంసం తినకూడదు అని ఆంక్షలు లేవు.
ఇటువంటి సామాజిక విషయాలు నిర్హేతుకమైనవి. అయితే వీటికి సమాజంలో చాలా మద్దతు ఉంది. దానికి కారణం నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ భావజాలం అలాగే అసమానతలు.
మనది బాగా కుచించుకుపోయిన సమాజం. స్వాతంత్ర్యానంతరం ఈ దేశంలోని హిందూ సమాజం ఒక విషయం గురించి మాత్రమే బహిరంగంగా మాట్లాడుతుంది. అదే బహిర్భూమికి వెళ్ళటం గురించి. బహిర్భూమికి వెళ్ళటం అనేది కూడా కులానికి సంబంధించిన విషయమే. ఎందుకంటే ఇంట్లో మరుగుదొడ్డి ఉండటం అనేది కాలుష్య కారకం, మతానికి వ్యతిరేకం అనే బలమైన భావన.
మన సమాజం రకరకాల రుగ్మతలతో, సంకెళ్లతో నిండి ఉండగా దానికి విరుద్ధంగా మన రాజ్యాంగం సమాజంలో మార్పుకి ఒక ఆయుధంగా ఉండగలిగే ఒక ఆశని కల్పిస్తుంది. లౌకికంగా ఉండటం ద్వారా ఒక విశ్వజనీన పౌరసత్వ భావనని అది పెంపొందిస్తుంది. ఆ కారణంగానే చట్ట సమానత్వం అనేది బహుజనులకి సంబంధించినంత వరకు ఒక రాడికల్ విజయం.
రాజ్యాంగం అనేది ఒక మానవీయ భారతదేశం కోసం అవసరమైన నైతిక విలువల సమాహారం. చెప్పుకోవాలంటే ఒక రకంగా మన రోజువారి జీవితాన్ని శాసించే నిచ్చెన మెట్ల విలువలకి ఇది పూర్తిగా విరుద్ధమైనది. ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థలో మనుషుల్లో బ్రాహ్మలు, పశువులలో ఆవులు పై స్థానంలో ఉంటాయి.
రవిదాస్ మొదలుకుని జ్యోతిబా ఫూలే వరకు ఎంతోమంది బహుజన మేధావులు ఈ బ్రాహ్మణీయ సంస్కృతిలో సమానత్వం అనే దానికి సంబంధించి ఉన్న సమస్యని ముందే గ్రహించారు. అలాగే తమ స్వచ్ఛతనూ, గొప్పతనాన్నీ చాచేందుకు కొన్ని కులాల వారిని బహిష్కరించే అగ్ర కులస్థుల, ముఖ్యంగా బ్రాహ్మణుల తపనని కూడా వారు ముందే గ్రహించారు. బ్రాహ్మణీయ సంస్కృతిలోని ఈ నిర్హేతుక అసమానతలు, నిచ్చెన మెట్ల వ్యవస్థ ఈ దేశంలో వర్ధిల్లటానికి సహకరిస్తున్నది.
మరొకపక్క శాస్త్రీయ దృక్పధానికి తోడుగా సమానత్వానికి, న్యాయానికి బాటలు పరచటం ద్వారా రాజ్యాంగం ఈ శుద్ధ కుల సంస్కృతి అహేతుక స్వభావంపై పోరాడుతున్నది.
ఈ విధంగా రాజ్యాంగం అనేది ఈ నిర్హేతుక, ఆత్మహత్యా సదృశ్య మనువాది సంస్కృతి మీద బహుజనుల విజయం అని చెప్పుకోవాలి.
పౌరసత్వ సవరణ చట్టం ద్వారా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ నుండి వచ్చే ముస్లిమేతర శరణార్దులకి త్వరితగతిన పౌరసత్వం అందచేయ్యటం అనే ఈ నిర్హేతుక ప్రయత్నం భారతీయ ముస్లింలని ఏకాకులని చేసి ఈ దేశ రాజ్యాంగంలో ఉన్న మానవీయ, సమానత్వ విలువలని ధ్వంసం చెయ్యడానికే.
అమెరికా కానీ, ఐరోపా దేశాలు కానీ చైనా దేశం కాని అణిచివేతకి గురవుతున్న హిందువులకి ఆహ్వానం పలికితే దానిని చాలా మంది హిందువులు విముక్తిగా భావిస్తారు. ఈ మధ్య కాలంలో గుజరాత్ లోని ఊనాలో దళితుల మీద హింస అనంతరం తమని సమానత్వం అమలులో ఉన్న దేశానికి పంపించెయ్యమని నాటి హింస బాధితులైన దళితులు రాష్ట్రపతికి ఉత్తరం రాశారు.
బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా న్యూయార్క్లో, లండన్లో సమానత్వాన్ని అనుభవిద్దామని ఎవరికి మాత్రం ఉండదు?
భారతదేశంలో హిందువులు ‘నిమ్న’ కుల హిందువులని అణిచివేస్తుంటారని, అలాగే ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ లలో కూడా అక్కడి ముస్లింలు మైనార్టీ ముస్లింలని, ముస్లిం సమాజం నియమాలని పాటించని ముస్లింలని అణిచివేస్తుంటారని ప్రభుత్వం గ్రహించాలి. ముస్లిం మతతత్త్వం కేవలం ముస్లిమేతరులకే ప్రమాదం అని అనుకోవటం ఆలోచన లేమికి నిదర్శనం.
పౌరసత్వ సవరణ చట్టం అనేది ముస్లింల మీద ద్వేషంతో తీసుకువచ్చిందే కానీ హిందూ శరణార్ధుల మీద ప్రేమతో తీసుకువచ్చిందేమీ కాదు. శరణార్ధుల గురించిన విధానం మానవత్వంతో, కరుణతో రూపొందించాల్సి ఉంటుంది.
ప్రభుత్వం లేదా సుప్రీం కోర్టు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా బహుజనుల హితం కోరేవీ కాదు. ఈ విషయం మనకి ఎస్ సి ఎస్ టి (అత్యాచారాల నిరోధక చట్టం), 2018 విషయంలో స్పష్టంగా గోచరించింది. సుప్రీం కోర్టు ఈ చట్టాన్ని నీరుగార్చగా, దాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు వ్యక్తం చేస్తున్న బహుజనలని బిజెపి పాలిత రాష్ట్రాలలో కాల్చి చంపారు. 2019లో సుప్రీం కోర్టు తాను ముందు ఇచ్చిన తప్పుడు తీర్పుని వాపసు తీసుకుంది.
అదే విధంగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న నిరసనలు రాజ్యాంగబద్ధ విధానం మీద ఉన్న నమ్మకంతో జరుగుతున్నాయి. పౌరసత్వ సవరణ చట్టానికి తమ వ్యతిరేకతని తెలియచేసి బహుజన నాయకులు, ప్రజలు మంచి పని చేశారు.
ఈ నిరసనలు కేవలం లౌకికత్వాన్ని కాపాడటానికి మాత్రమే కాదు. ఇవి ఒక ప్రగతిశీల, మానవీయ రాజ్యాంగం మీద నిర్హేతుకమైన మనువాద భావజాలాన్ని రుద్దే ప్రయత్నాలని ఎదురించే నిరసనలు కూడా.
సూర్యకాంత్ వాగ్మోరే
వ్యాసకర్త బొంబాయి ఐఐటిలో సోషియాలజీ అసోసియేట్ ప్రొఫెసర్
‘ద వైర్’ వెబ్సైట్ సౌజన్యంతో