CBI Court: ఏపీ సీఎం జగన్ నీ.., వైసీపీ ప్రభుత్వాన్ని, ఆ పార్టీని రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు పెడుతున్నంత “మానసిక టార్చెర్” ఇంకెవ్వరూ పెట్టడం లేదు.. టీడీపీ, బీజేపీ కూడా జగన్ కి భయపడి కొన్ని విషయాల్లో వెనకడుగు వేస్తున్న వేళ… ఈ ఎంపీ మాత్రం ప్రభుత్వం, జగన్, విజయసాయిరెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ.. ఇలా వైసీపీకి సంబంధించి ఎక్కడ ఏం చిన్న తప్పు జరుగుతున్నా దాన్ని బూతద్దం పెట్టి వెతికి సరైన లాజిక్కు పట్టుకుని రచ్చబండలో రచ్చ చేస్తూ జగన్ అండ్ బ్యాచ్ కీ ఈ రెబల్ ఎంపీ తలనొప్పిగానే తయారయ్యారు. కానీ ఏడాదిగా అతన్ని ఏ మాత్రం అదుపు చేయలేక.. చర్యలు తీసుకోలేక.. ఎంపీ పదవి పోగొట్టలేక.. ఏ మాత్రం సమాధానం చెప్పక.. అలా వదిలేశారు. అలా అలా చిలికి చిలికి గాలివానగా మారిన రఘురామకృష్ణం రాజు వ్యవహారం సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలనేంత వరకు వెళ్ళింది. ఇక్కడితో ఆగుతుందా..!? అసలు సీబీఐ కోర్టులో ఈ బెయిల్ రద్దు పిటిషన్ ఏం ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉందో చూద్దాం..!
CBI Court: మొదటి దశలో నోటీసులు ఆపై..!?
సీబీఐ కోర్టు ఈ పిటిషన్ ని విచారణకు స్వీకరించింది. ఈరోజే స్వీకరించింది. అంటే వెంటనే బెయిల్ రద్దు అయిపోయినట్టు కాదు.. దీనిలో చాలా తతంగం, లోతైన అంశాలు ఉన్నాయి. మొదటి దశలో కోర్టు ఈ పిటిషన్ లో ప్రతివాదులుగా ఉన్న సీఎం జగన్, సీబీఐకి నోటీసులు జారీ చేస్తుంది. కౌంటర్లు దాఖలుకు కొంత గడువునిస్తుంది. ఈ కౌంటర్లలో ప్రతివాదులు పేర్కొనే అంశాలే ఈ పిటిషన్ లో తదుపరి వాదనలకు బలాన్నివ్వబోతున్నాయి.
* పిటిషనర్ తరపు నుండి కొన్ని స్పష్టమైన వాదనలున్నాయి. “సీఎం జగన్ బెయిల్ పై ఉన్న కారణంగా విచారణ సరిగ్గా జరగడం లేదు. ఆయన కోర్టు విచారణకు, వాయిదాలకు కూడా హాజరుకావడం లేదు. తన అధికారంతో సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కేసు పక్క దారి పడుతుంది. దేశంలో ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులను త్వరితగతిన విచారణ పూర్తి చేయాలని కేంద్రం, సుప్రీం భావిస్తుంది. కాబట్టి ఆయన బెయిల్ రద్దు చేసి త్వరగా విచారణ పూర్తి చేయాలి” అనే కోణంలో పిటిషనర్ తరపు వాదనలు ఉండబోతున్నాయి.
సమాధానాలు కీలకం.. న్యాయ విభాగం ఏం చేస్తుందో..!?
పిటిషనర్ తరపు వాదనల్లో కొన్ని కీలక పాయింట్లు ఉన్నాయి. సీఎం జగన్ సీబీఐ విచారణలు హాజరు కావడం లేదు అనేది మాత్రం అంగీకరించాల్సిన అంశం. బలమైన అంశం. ఈ పాయింట్లకు సీఎం తరపున వేసే కౌంటర్ లో బలమైన అంశాలుండాలి. “తాను సాక్షులను ఏ మాత్రం ప్రభావితం చేయడం లేదని.., తాను పాలనలో బిజీగా ఉన్నానని.., తనపై ఒక రాష్ట్రం ఆధారపడి ఉందని.., తాను ఆ కేసులను, విచారణను పక్కదారి పట్టించడం లేదని” నిరూపించుకోవాలి. దీనికి జగన్ తరపున బలమైన వాదనలు ఉండాలి. ఇప్పటికే జగన్ సీఎం అయ్యాక తనకు న్యాయవిభాగం అంతగా కలిసి రావడం లేదు. కోర్టులో ఎదుర్కొన్న కేసుల్లో దాదాపు 90 % వ్యతిరేక తీర్పులు వచ్చాయి.
* ఈ కేసులో మాత్రం అలా జరగకూడదు. అదే జరిగితే తనకు వ్యక్తిగతంగా, పార్టీ పరంగానూ ఇబ్బందులు తప్పవు. ఈ కేసుని రఘురామకృష్ణంరాజు కూడా తాను ఒక్కడే కాకుండా వెనుక నుండి ఎవరూ డీల్ చేస్తున్నారనే ధైర్యంతో నడిపిస్తున్నారు. రఘురామకృష్ణం రాజు ఒక్కరే అయితే ఇది పెద్ద మ్యాటర్ కాదు. మేనేజ్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఆయన వెనుక ఎవరైనా ఉంటే మాత్రం జగన్ ఇది తలనొప్పి కాబోతుంది. “జగన్ బెయిల్ త్వరలో రద్దు అవుతుంది అని బీజేపీ నేత సునీల్ ధియోధర్ వ్యాఖ్యానించడం.., ఆ తర్వాత రఘు పిటిషన్ వేయడం.., జగన్ తీవ్రంగా వ్యతిరేకించిన జస్టిస్ ఎన్వీ రమణ సుప్రీం బాస్ గా బాధ్యతలు స్వీకరించడం.., కరోనా తర్వాత ఏపీ రాజాకీలపై బీజేపీ గట్టిగా ఫోకస్ పెట్టబోతోంది..” అంటూ బీజేపీ వర్గాల్లో వినిపిస్తుండడం.. ఇవన్నీ చూస్తుంటే అపశకునాలు కొన్నింటిని జగన్ అధిగమించాల్సి ఉంటుంది. తన న్యాయవిభాగాన్ని దృఢం చేయాల్సి ఉంటుంది..!