ఉదయం నుండీ ఓ వార్త అనేక మాధ్యమాల్లో గుప్పుమంటుంది..!! సీబీఐ దర్యాప్తుపై వివేకా కుటుంబ సభ్యులకు అనుమానాలు ఉన్నాయట. అందుకే కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాని కలవడానికి అపాయింట్మెంట్ అడిగారట..! ఏమో దీనిలో నిజాలు పక్కన పెడితే దర్యాప్తు మాత్రం కొత్త పుంతలు తొక్కుతుంది. సిట్ విచారణకు భిన్నంగా, కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి.
అనూహ్యంగా కొత్త పేర్లు తెరపైకి..!!
మున్నా.. అతని ముగ్గురు భార్యలు.. అతని కాల్ లిస్టు… ఆ ఆధారంగా మరో పది పేర్లు ఈ పేర్లుకీ, వివేకా కేసుకి సంబంధం ఏమిటో..!! అదే ఇప్పుడు సీబీఐ అధికారులు రాబడుతున్నారు.
* పులివెందుల బస్టాండ్ సమీపంలోని చెప్పుల షాపు యజమాని మున్నాను అధికారులు విచారించారు. అతనికి సంబంధించిన బ్యాంకు లాకరులో రూ.48లక్షల నదు, 25 తులాల బంగారం నగలను గుర్తించి జప్తు చేశారు. ఈ మున్నాకి ముగ్గురు భార్యలు. వారినీ విచారించారు. వీరికి సంబంధించిన ఓ కుటుంబ గొడవని వివేకా పరిష్కరించారట, పంచాయితీ చేశారట..!
* రియల్ ఎస్టేట్ వ్యాపారి పుల్లయ్య, నిజాంబీ, ప్రసాద్, ట్యాంకర్ బాషా, హజ్రత్, హిజ్రా చంటి మరో ఇద్దరు వ్యక్తులను అధికారులు ప్రశ్నించి వారి నుండి స్టేట్ మెంట్లు రికార్డు చేశారు. వీరిని రెండు రోజుల పాటూ విచారించారు.
* మున్నా కాల్ లిస్టులో ఈ పేర్లు ఉండడంతో పిలిపించారు. వివేకా హత్యకు నాలుగు రోజుల ముందు మున్నా ఫోన్ చేయడంతో కాల్ డేటా ఆధారంగా ఫోన్ నెంబర్ గుర్తించి సీబీఐ అధికారులు అతనిని అతని సంబందీకులను విచారించారు. వివేకా ఇంట్లో పని చేస్తున్న రాజశేఖర్… ఈ హత్యకు ముందు రోజు కాణిపాకం వెళ్లడంతో… ఇది ఎందుకు అని ఆరాతీసే క్రమంలో సీబీఐ అధికారులు అతన్ని వెంట పెట్టుకుని కాణిపాకం కూడా వెళ్లారు.
* ఇప్పటి వరకు సీబీఐ 300 మందికి పైగా విచారించింది. కడప, పులివెందుల, అనంతపురం, చిత్తూరు, కాణిపాకం వంటి ప్రాంతాలకు వెళ్లి కొందరితో మాట్లాడారు. కానీ ఇవన్నీ కొత్త పేర్లు. అంతకు ముందు విచారణ జరిపిన సిట్ సుమారుగా 1300 మందిని విచారించింది. కానీ ఈ దర్యాప్తు వేరు, ఆ దర్యాప్తు కోణం వేరు.
ఎక్కడో తేడా కొడుతోంది..!!
ఇది మొత్తం చూస్తున్న వివేకా కుమార్తె సునీత రెడ్డికి, ఆ కుటుంబ సభ్యులకు దర్యాప్తు పక్కదారి పడుతుందని అనుమానాలు కలుగుతున్నాయట. రాజకీయ నాయకులు… మాజీలు, తాజాలు, ప్రముఖులను పెద్దగా పెట్టుకోకుండా ఈ చిన్న, చితక వాళ్లకు సీబీఐ ఎక్కువగా దృష్టి పెడుతుంది ఏమిటీ ..? అనేది ఆ కుటుంబ సభ్యులకు తోయడం లేదు. అందుకే ఇక లాభం లేదు. ఓ సారి కేంద్ర హోమ్ మంత్రిని కలిసి తమ ఆవేదన తెలియజేయాలి అనుకుంటున్నారట. కొత్త పేర్లు, సంబంధం లేని పేర్లు ద్వారా ఈ కేసుని ఎటు తీసుకెళ్తున్నారా అర్ధం కాక.. తమ లోపలి అంతరంగాన్ని ఆయన వద్ద చెప్పుకోవాలనేది ఈ కుటుంబ సభ్యుల యోచన కావచ్చు.