ప్రస్తుతం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ దీనస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ రోజు ఏ నాయకుడు పార్టీని వదిలి వెళ్ళిపోతాడో అర్థం కాక చంద్రబాబు తల పట్టుకున్నాడు. ఇక ఇదే సమయంలో పార్టీపై కీలక నేతల ఆశలు వదులుకోక ముందే ఎలాగైనా పురోగతి సాధించాలని బాబు తపన పడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే అతను తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు సంచలనంగా మారింది.
జంపింగులన్నీ తలపోటే…!
గత ఏడాది ఎన్నికల్లో తీవ్రస్థాయిలో దెబ్బతిన్న టిడిపిని లైన్లో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే అనూహ్యంగా పెరిగిన పార్టీ నుండి జంపింగులు ఇప్పుడు చంద్రబాబు ని విపరీతంగా కలవరపెడుతున్నాయి. కొందరు ఇప్పటికే సైకిల్ దిగేశారు. ఈ క్రమంలో అనేక నియోజకవర్గాల్లో పార్టీ బలం కోల్పోయి జెండా పట్టుకునే తమ్ముడు కూడా లేకుండాపోయారు. ఇప్పటివరకు వ్యవహరిస్తున్న పార్టీ నేతలు ఒక్కొక్కరే లైన్లో పెట్టేందుకు చంద్రబాబు సరికొత్త పంథాను అమలు చేయనున్నారు.
వారే కీలకం…!
పార్టీకి ఉన్నఫలంగా చికిత్స చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చంద్రబాబుకి ఇటీవల కాలంలో అనేక మంది సీనియర్లు చెబుతున్నారు. మాటలు చెబితే వినే రోజులు పోయాయి. ఇప్పుడు కావలసింది కేవలం నాయకులను సంతృప్తి పరచడమే అన్న సూచనలు వచ్చాయి. ఈ క్రమంలోనే టిడిపిలో యువతకు తగిన గుర్తింపు రావట్లేదన్న అపవాదుని పోగొట్టుకునేందుకు పార్టీలో వారికి 33 శాతం ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. దీనిపై ఇంకా చర్చ జరుగుతూనే ఉంది అయితే చంద్రబాబు ఇప్పుడు ఏర్పాట్లను ముమ్మరం చేసే పనిలో పడ్డారని సమాచారం.
ఇదే ఆఖరి ప్రయత్నం…?
ఇదిలా ఉండగా అదే రాష్ట్రంలోలో ఇప్పుడు ప్రత్యేకంగా పార్లమెంట్ స్థానాల ఆధారంగా టిడిపి కమిటీలను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. అంతే…. రాష్ట్రవ్యాప్తంగా 175 అసెంబ్లీ స్థానాలకు కూడా సీనియర్లు, మాజీ మంత్రులను టీడీపీ పార్లమెంటరీ స్థానం అధ్యక్షునిగా నియమించాలని నిర్ణయించారు. దీనివల్ల పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అవకాశం ఉంటుందని అంటున్నారు. వాస్తవానికి ఇది టిడిపిలో చాలా పెద్ద సంచలనమే. ఇప్పటి వరకు జిల్లాలో, మండలాల్లో, బూత్ స్థాయి కమిటీలు మాత్రమే కొనసాగుతుండగా ఇప్పుడు వాటికి అనుబంధంగా పార్లమెంట్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేయడం ద్వారా టిడిపి మళ్లీ ఏ మేరకు బలపడుతుందో చూడాలి.