భీమా కోరేగావ్ కేసులో ఖైదులో ఉన్న హక్కుల కార్యకర్తలు: పై వరుస ఎడమ నుంచి: సుధీర్ దవాలే, సురేంద్ర గాడ్లింగ్, మహేష్ రౌత్. మధ్య వరుస: షోమా సేన్, వెర్నాన్ గంజాల్వెస్, వరవర రావు. కింది వరుస: సుధా భరద్వాజ్, అరుణ్ పెరీరా, రోనా విల్సన్
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
ముంబై: భీమా కోరేగావ్ కేసులో మహారాష్ట్ర పోలీసులు బయటకు చెప్పినదాంట్లో అవాస్తవాలు ఉన్నాయా? ఇప్పుడు అసలు వాస్తవాలు బయటకు వస్తాయని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం భయపడుతోందా? అకస్మాత్తుగా కేంద్రం భీమా కోరేగావ్ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ)కు అప్పగించాలని నిర్ణయించడంతో ఈ సందేహాలు తలెత్తుతున్నాయి.
ఎన్ఐఎ చట్టం కింద కొన్ని నేరాల దర్యాప్తునకు రాష్ట్రాల సమ్మతి లేకుండానే కేంద్రం ఎన్ఐఎను రంగంలోకి దించవచ్చు.
ఈ నెల 22న మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ పూనా పోలీసులతో భీమా కోరేగావ్ కేసును సమీక్షించారు. భీమా కోరేగావ్ కేసు దర్యాప్తును పునపరిశీలించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఒకదాన్ని నియమించే విషయంపై వారంలో నిర్ణయం తీసుకుంటారని సమావేశం అనంతరం దేశ్ముఖ్ మీడియాతో చెప్పారు. ఆయన ఆ మాట చెప్పారో లేదో కేంద్రం మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట మాత్రంగా చెప్పకుండా భీమా కోరేగావ్ కేసు దర్యాప్తును ఎన్ఐఎకి అప్పగించింది.
హింసాత్మకంగా పరిణమించిన భీమా కోరేగావ్ ఆందోళనను ప్రేరేపించారన్న అభియోగంపై పూనా పోలీసులు న్యాయవాదులపై, మానవ హక్కుల కార్యకర్తలపై కేసు పెట్టారు. దీనికి సంబంధించి తొమ్మిది మంది నిందితులు 2018 జూన్ నుంచి జైలులో మగ్గుతున్నారు. ప్రొఫసర్ ఆనంద్ తేల్తుంబ్డె, గౌతమ్ నవలఖా వంటి మరికొందరు కూడా ఈ కేసులో నిందితులు. అయితే కోర్టులు అడ్డుకోవడం వల్ల వారిని ఇంకా అరెస్టు చేయలేదు.
విప్లవ కవి వరవర రావు, దళిత హక్కుల కార్యకర్త సుధీర్ దవాలే, న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్, గడ్చిరోలికి చెందిన కార్యకర్త మహేష్ రౌత్, నాగపూర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ షోమా సేన్, ఖైదీల హక్కుల కార్యకర్త రోమా విల్సన్, న్యాయవాదులు సుధా భరద్వాజ్, అరుణ్ పెరీరా, వెర్నోన్ గంజాల్వెస్ అండర్ ట్రయిల్స్గా ఖైదులో ఉన్నారు.
వీరందరికీ పోలీసులు ‘అర్బన్ నక్సల్స్’ అని పేరు పెట్టారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదిని హత్య చేసేందుకు వీరు కుట్ర పన్నారని పూనా పోలీసులు ఆరోపిస్తున్నారు. దానికి ఒక నిందితుడి కంప్యూటర్లో దొరికిందని చెబుతున్న ఒక లేఖను సాక్ష్యంగా చూపుతున్నారు. మహారాష్ట్రలో గత నవంబర్లో జరిగిన ఎన్నికలలో బిజెపి ప్రభుత్వం పోయి శివసేన – ఎన్సిపి – కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. అప్పటినుంచీ భీమా కోరేగావ్ కేసు నిగ్గు తేల్చాలన్న మాట ప్రభుత్వ వర్గాల నుంచి వినబడుతూనే ఉంది.
దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం హక్కుల కార్యకర్తలపై అర్బన్ నక్సల్స్ అన్నముద్ర వేసి వారిని తప్పుడు కేసులో ఇరికించిందని గృహ నిర్మాణ శాఖ మంత్రి జితేంద్ర అవధ్ అసెంబ్లీలోనే ఆరోపించారు. ఆ తర్వాత భీమా కోరేగావ్ కేసును పరిశీలించి నిజానిజాలు తేల్చాలని ఎన్సిపి నేత శరద్ పవార్ కూడా డిమాండ్ చేశారు. దీనిపై సిట్ వేయాలని కోరుతూ ఆయన రాష్ట్ర హోంశాఖకు రెండు లేఖలు రాశారు. దానిపై చర్య తీసుకునే లోగా కేంద్రం రంగంలోకి దిగి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేసింది.
భీమా కోరేగావ్ కేసు దర్యాప్తును కేంద్రం స్వాధీనం చేసుకుందని తెలియగానే మహారాష్ట్రలో పలువురు ఎన్సిపి, కాంగ్రెస్ నాయకులు ఈ చర్యను రాజ్యాంగ విరుద్ధంగా అభివర్ణించారు. భీమా కోరేగావ్ కేసు గుట్టును బయటకు తీయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించగానే కేంద్రం కేసును చెప్పా పెట్టకుండా స్వాధీనం చేసుకోవడం రాజ్యాంగ వ్యతిరేకమనీ, ఫెడరల్ విధానానికి తూట్లు పొడవడమేననీ హోంమంత్రి అవధ్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్కు చెందిన రెవిన్యూ మంత్రి బాలాసాహెబ్ థోరాట్ కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. కేంద్రం ఎందుకు భయపడుతోదనీ, వారికి హఠాత్తుగా మహారాష్ట్ర పోలీసులపై నమ్మకం ఎందుకు పోయిందనీ ఎన్సిపి అధికార ప్రతినిధి మహేష్ తపసే ప్రశ్నించారు.
I strongly condemn the decision to transfer the investigation of "Koregaon-Bhima" case to NIA, by the Central Government without any consent of Maharashtra State Government..@PMOIndia@HMOIndia@PawarSpeaks@supriya_sule pic.twitter.com/Ov8PZlSknG
— ANIL DESHMUKH (@AnilDeshmukhNCP) January 24, 2020
భీమా కోరేగావ్ కేసులో పూనా పోలీసులు ఇప్పటివరకూ జరిపిన దర్యాప్తులో కొన్ని వైరుధ్యాలు, సమాధానం దొరకని ప్రశ్నలు ఉన్నాయి. పూనా పోలీసులు చూపిస్తున్న సాక్ష్యాలలో పరస్పరం అతుకు పడని అంశాలను ఎత్తి చూపుతూ ‘ద వైర్’ వెబ్సైట్ గత నెలలో ఒక రిపోర్టు ప్రచురించింది. నిందితులు గాడ్లింగ్, విల్సన్ కంప్యూటర్ల నుంచి తీశామని చెబుతున్న సాక్ష్యాలను పోలీసులు డిజిటల్ పద్ధతుల్లో తారుమారు చేసినట్లు కూడా Sవైర్ రాసింది.
యుపిఎ ప్రభుత్వం ముంబై దాడుల తర్వాత ఉగ్రదాడుల కేసులను దర్యాప్తు చేసేందుకు 2008లో ఎన్ఐఎ చట్టాన్ని తెచ్చింది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ దానిని రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్నదన్న విమర్శలు ఉన్నాయి. ఈ నెల 15న చత్తీస్గఢ్ ప్రభుత్వం ఎన్ఐఎ చట్టం రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో కేసు వేసింది.