కేంద్రం అంటే కొత్త బిల్లులు తెస్తుంది. దేశాన అమలు చేస్తుంది. రాష్ట్రాలు అంగీకరించకపోతే ఒప్పిస్తుంది..! కానీ అవి రాష్ట్రాల అధికారాలకు కత్తెర పెట్టేవి అయితే..? అవి రాష్ట్రాల ఆర్ధిక స్వేచ్ఛకు భంగం కలిగించేవి అయితే..? అవి రాష్ట్రాల్లో పరిస్థితులకు వ్యతిరేకమైనవి అయితే..!? రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకిస్తాయి..!! ఈ ప్రక్రియ అంతా సహజమే. కానీ ఇప్పుడు కేంద్రం (బీజేపీ) తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు, తీసుకొస్తున్న కొన్ని బిల్లులు… రాష్ట్రాలకు పూర్తిగా వ్యతిరేకమే. పెత్తనం కేంద్రం చేతుల్లోకి నెట్టేసేవే..! ఇంత సీరియస్ వ్యవహారాలను, బిల్లులను కూడా కేంద్రం సింపుల్ గా తీసుకొచ్చేస్తుంది. తన అధికారాలతో.. రాష్ట్రాల పాలకుల లోపాలు, లొసుగులతో సైలెంట్ గా రాష్ట్రాలకు దెబ్బ వేసేస్తుంది..! తాజాగా పోర్టులపై కేంద్రం పెత్తనం బిల్లుతో పాటూ.., మరిన్ని ఉదాహరణలు చూద్దాం..!!
తాజా బిల్లులో ఏముందంటే..!?
“ఇండియన్ పోర్ట్స్ బిల్లు – 2020 ” కేంద్రం దీన్ని రూపొందించి రాష్ట్రాల అభిప్రాయాలూ కోరుతూ పంపించింది. దీని సారాంశం ఏమిటంటే… రాష్ట్రాల్లో పోర్టులపై పూర్తిగా కేంద్రానికే పెత్తనం ఉంటుంది. ఇప్పటి వరకు మేజర్ పోర్టులు కేంద్రం చేతిలో… మైనర్ పోర్టులు రాష్ట్రాల చేతిలో ఉండేవి. కానీ పైన చెప్పుకున్న బిల్లు ప్రకారం ఇకపై పోర్టులన్నీ కేంద్రం చేతిలోకి వెళ్తాయి. వాటి ద్వారా వచ్చే ఆదాయంలో కొంత రాష్ట్రాలకు కేంద్రమే ఇస్తుంది. దీని వలన కేంద్రం తనకు నచ్చిన వాళ్లకు పోర్టుల బాధ్యతలు అప్పగించవచ్చు. అదానీ లాంటి వారికి అతి పెద్ద సముద్రం సామ్రాజ్యం అప్పగించేయొచ్చు..! ఇప్పటికే కార్పొరేట్ కి దాసోహంగా ఉంటున్న విమర్శలు ఎదుర్కొంటున్న మోడీ మరోసారి ఆ విమర్శలను నిజమ్ చేసేలా ఈ నిర్ణయానికి ఒడిగట్టారు.
ఏపీలో వ్యతిరేకత.. మిగిలిన రాష్ట్రాల్లో..!?
దేశంలో ఆంధ్ర ప్రదేశ్ సహా.., మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, కేరళ, కర్ణాటక, గోవా, ఒడిశా తదితర రాష్ట్రాల్లో తీరా ప్రాంతాలు అధికంగా ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లోనే పోర్టులు ఉన్నాయి. ఏపీలో పదకొండు పోర్టులు ఉండగా… వాటిలో ఒకటి (విశాఖపట్నం) మాత్రమే మేజర్ పోర్టు. మిగిలినవి అన్ని మైనర్ పోర్టులు. అంటే విశాఖ పోర్టు మినహా మిగిలిన పోర్టులపై పెత్తనం మొత్తం రాష్ట్ర ప్రభుత్వానిదే. ఇదే పెత్తనంతో ఎపి ప్రభుత్వం ఇటీవల కృష్ణపట్నం పోర్టులో శాతం వాటాని అదానీకి అప్పగించింది. ఇకపై కేంద్రానికి ఈ పోర్టులపై పెత్తనం వెళ్తే.. ఇదే తరహాలో కార్పొరేట్ కి పోర్టులు బానిసలుగా మారతాయి. అందుకే దీన్ని ఎపి, తమిళనాడు రాష్ట్రాలు ఏ మాత్రం అంగీకరించే పరిస్థితులు కనిపించడం లేదు. ఇప్పటికే ఎపి ప్రభుత్వం కేంద్ర బిల్లుని వ్యతిరేకిస్తూ లేఖ కూడా రాసింది. ఒడిశా, కేరళ ప్రభుత్వాలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటాయి అనేది తేలాల్సి ఉంది.
నెమ్మదిగా రాష్ట్రాలకు దెబ్బలు..!?
అప్పుడెప్పుడో తీసుకొచ్చిన జీఎస్టీ ద్వారా రాష్ట్రాల ఆర్ధిక స్వేచ్ఛకు కేంద్రం గండి కొట్టింది. “అనధికార లావాదేవీలు ఇకపై జరగవు.. ఒకే దేశం.., ఒకే పన్ను” పేరిట జీఎస్టీని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చాకా… రాష్ట్రాలకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఆ డబ్బుని కూడా కేంద్రం లెక్కల ప్రకారం సకాలంలో విడుదల చేయడం లేదు.
* ఆరు నెలల తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణల బిల్లు కూడా అటువంటిదే. రైతులకు అందిస్తున్న వ్యవసాయ విద్యుత్ పై రాష్ట్రాలకి పెత్తనం లేకుండా… కేంద్రం చేతిలో బొమ్మలుగా ఉంటాయి. ఈ మీటర్లన్నీ కేంద్రం నియంత్రణలోకి వెళ్తాయి. దీన్ని కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నప్పటికీ.. కేంద్రం ముందుకు వెళ్ళింది.
* ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లుల ఉద్దేశం కూడా అటువంటిదే. ఈ బిల్లుల వలన రైతులకు మిశ్రాల ఫలితాలు, భిన్న అభిప్రాయాలూ ఉన్నప్పటికీ… ఆయా రాష్ట్రాల వ్యవసాయ ఉత్పత్తులపై రాష్ట్ర ప్రభుత్వాలకు హక్కు ఉండదు. అంటే రైతులకు స్వేచ్ఛ పేరిట.. రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలకు కత్తెర వేయడం ఈ బిల్లుల అంటారా ఉద్దేశం..!
* ఇప్పుడు పోర్టులపై పెత్తనానికి బిల్లు కూడా అటువంటిదే. ఇలా నెమ్మదిగా ఒకే దేశం… ఒకే పార్టీ… ఒకే దేశం… ఒకే ప్రభుత్వం… ఒకే దేశం .. ఒకే నిర్ణయం అంటూ…. కేంద్రం కొన్ని భిన్న, సంచలన నిర్ణయాలు తీసుకున్నా ఆశ్చర్యం అవసరం లేదు. పెద్దగా వ్యతికరేకించే సీఎంలు ఎవరూ లేరు. ఉన్నా.. ఎంతో కాలం అలా ఉండలేరు..!!