బీజేపీ వ్యూహాలకు జగన్ రివర్స్ ప్లాన్
స్థానిక నేతలు నో అంటున్నా..సీఎం వద్ద ఆ హామీతో
వైసీపీలో క్రియాశీలకంగా వ్యవహరించి గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో పార్టీ వీడిన ఒక్కొక్కరూ తిరిగి సొంత గూటికి చేరుకుంటున్నారు. అందులో భాగంగా 2014లో వైసీపీ నుండి కాకినాడ ఎంపీగా పోటీ చేసి తరువాత టీడీపీకి దగ్గరైన చలమలశెట్టి సునీల్ తిరిగి వైసీపీలోకి చేరటానికి రంగం సిద్దమైంది. ముఖ్యమంత్రి జగన్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంలో ఆయన తిరిగి ముఖ్యమంత్రి సమక్షంలోనే వైసీపీ కండువా కప్పుకోవటం ఖాయమైంది. అయితే, ఆయన రాకపైన స్థానిక జిల్లా వైసీపీ నేతలు కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో పార్టీకి కాదని వెళ్లి..పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వారికి ఇప్పుడు అధికారంలో ఉన్న సమయంలో అవకాశం ఇవ్వటం సరికాదని వారు వాదిస్తున్నారు. అయితే, పార్టీ ముఖ్య నేతలు జగన్ తో చర్చిచంగా..టీడీపీని దెబ్బ కొట్టాలంటే కొన్ని నిర్ణయాలు తప్పవని వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఇదే సమయంలో సునీల్ కు పార్టీ నుండి భవిష్యత్ లో ప్రాధాన్యత ఇస్తామంటూ ఒక ఆఫర్ సైతం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీనితోనే సునీల్ సైతం తన అనుచరులతో కలిసి సీఎం సమక్షంలో తిరిగి వైసీపీలో చేరుతున్నారని తెలుస్తోంది.
సీఎం సమక్షంలో తిరిగి సొంత గూటికి…
2014 ఎన్నికల్లో చలమలశెట్టి సునీల్ వైసీపీ నుండి కాకినాడ ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి తోట నరసింహం పోటీ చేసారు. ఆ ఎన్నికల్లో సునీల్ ఎంపీగా గెలవటం ఖాయమనే అంచనా లు బలంగా వినిపించాయి. కానీ, టీడీపీ ఎంపీ తోట నరసింహం 3,431 ఓట్ల మెజార్టీతో సునీల్ పైన గెలుపొందారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ నేతలను అనేక మందిని తమ వైపు తిప్పుకుంది. అందులో భాగంగా..జగన్ తో సన్నిహితంగా మెలిగిన సునీల్ సైతం టీడీపీలో జాయిన్ అయ్యారు. ఆయనకు టీడీపీలో తగిన ప్రాధాన్యత ఇస్తామని అప్పట్లోనే పార్టీ నుండి హామీ వచ్చినా..అది ఆచరణ లో అమలు కాలేదు. చివరకు 2019 ఎన్నికల్లో టీడీపీ నుండి సునీల్ కాకినాడ ఎంపీ అభ్యర్ధిగా బరిలో నిలిచారు. కానీ, వైసీపీ 2019 ఎన్నికల్లొ అభ్యర్ధుల ఎంపికలో అనుసరించిన వ్యూహాల్లో భాగంగా..గతంలో టీడీపీ నుండి రాజ్యసభ సభ్యురాలిగా..ప్రజారాజ్యం నుండి ఎమ్మెల్యేగా పని చేసిన వంగా గీతను కాకినాడ బరిలో దించారు. 2019 ఎన్నికల్లో టీడీపీ నుండి పోటీ చేసిన సునీల్ కు అయిదు లక్షల 11, 892 ఓట్లు రాగా.. వైసీపీ నుండి పోటీ చేసిన వంగా గీతకు అయిదు లక్షల 37 వేల 630 ఓట్లు వచ్చి గెలుపొందారు.
రాజ్యసభ హామీ ఇచ్చారంటూ..
కాకినాడలో ఓడిపోయిన తరువాత వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో సునీల్ కాకినాడలో పార్టీని పట్టించుకోలేదని..వ్యాపార ప్రయోజనాల కోసమే టీడీపీలో చేరారంటూ స్థానిక వైసీపీ నేతలు అప్పట్లోనే ఆగ్రహం వ్యక్తం చేసారు. 2019 ఎన్నికల సమయంలోనే ఆయన తిరిగి వైసీపీలోకి వచ్చేందుకు ప్రయత్నించినా..అప్పట్లో జగన్ నుండి గ్రీన్ సిగ్నల్ లభించలేదు. దీంతో..ఆయన టీడీపీ నుండి పోటీ చేయాల్సి వచ్చింది. కాకినాడ పార్లమెంటరీ స్థానంలోనూ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పెద్దాపురం నుండి మాజీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మినహా మిగిలిన ఆరు స్థానాల్లోనూ వైసీపీ గెలుపొందింది. అయితే, తూర్పు గోదావరిలో ఇప్పటికే తోట త్రిమూర్తులు లాంటి వారు వైసీపీలో చేరటం…జిల్లాలో బలమైన శెట్టి బలిజ వర్గానికి పదవుల్లో ఇస్తున్న ప్రాధాన్యత..బీసీ వర్గాలకు అమలు చేస్తున్న పధకాలతో పాటుగా జిల్లాలో బలమైన వర్గంగా ఉన్న కాపు నేతలను సైతం వైసీపీలోకి తీసుకోవటం ద్వారా టీడీపీ..జనసేనలను దెబ్బ కొట్టాలనేది జగన్ వ్యూహంగా కనిపిస్తోంది. బీజేపీ సైతం కాపు నేతలను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తుండటంతో జగన్ అప్రమత్తమయ్యారు. కఅందులో భాగంగా…సునీల్ కు 2022లో వైసీపీ నుండి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇస్తారనే హామీ ఇచ్చారని తెలుస్తోంది. వైసీపీ అమలు చేస్తున్న వ్యూహాలను ఇప్పుడు టీడీపీ..బీజేపీ..జనసేన ఏ రకంగా ఎదుర్కొంటుందో చూడాలి..