గత సంవత్సరం ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించిన తర్వాత నుండి ఏపీ ప్రధాన ప్రతిపక్షం టిడిపికి ఒకదాని వెంట మరొక సమస్య వెంటాడుతూనే ఉంది. దీని నుండి బయటపడేందుకు చంద్రబాబు ఎన్ని ఎత్తుగడలు వేసినా కూడా అన్నీ విఫలయత్నం అవుతున్నాయి. ఇక తాజాగా వచ్చిన తలనొప్పి సంగతి చూద్దాం…
ఇన్ని చేసినా అదిగో లోటు…..
నిన్న మొన్నటి వరకూ పార్టీలో నాయకత్వ సమస్య వెంటాడాయి. తాజాగా నియోజకవర్గాల్లో ఇన్చార్జుల నియామకం వంటి అంశాలు కూడా పార్టీని మరింత బలహీనపరిచాయే తప్ప వాటి వల్ల పెద్దగా ఒరిగిందేమీ లేదని స్పష్టమవుతోంది. వీటిని సరి చేసే క్రమంలో పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా ఇన్చార్జిలుగా పలువురిని నియమించారు బాబు. ఇదే సమయంలో పార్టీలో స్టేట్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పలువురికి పదవులు ఇచ్చారు. అందరూ అనుకున్నట్టుగానే బీసీలకు ప్రాధాన్యత పెంచారు. అయితే ఇప్పుడు అంతా సక్రమంగా జరుగుతుంది అనుకుంటున్న సమయంలో సామాజికవర్గాల విషయానికి వస్తే తమకు అన్యాయం జరిగిందని అసలు తమకు కనీస గుర్తింపు లేకుండా పోయిందని కొందరు నేతలు బాబు లేఖ రాయడం గమనార్హం.
అప్పుడు బానే ఉందే….
ఇదే విషయాన్ని కొంచెం తవ్వితే పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఎస్సీ సామాజిక వర్గానికి చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చారు. ఎస్సీ లోని రెండు సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చిన ఆయన కేఎస్ జవహర్ కు మంత్రి పదవి ఇస్తే అదే జిల్లాలోని మాల సామాజిక వర్గానికి చెందిన పీతల సుజాత కూడా మంత్రి పదవి ఇచ్చారు. అంతేకాకుండా పార్టీ అధికార ప్రతినిధిగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన వర్ల రామయ్య నియమించారు. ఇలా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్. ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవులను మాత్రం మాల వర్గానికి కట్టబెట్టారు. అధికారం ఉన్న సమయంలో ఇలా ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తూ వచ్చిన బాబుకి ఎక్కడ విమర్శలు ఎదురు లేదు
ఇవి మచ్చుకే…?
అయితే ప్రస్తుతం పార్టీలో పదవుల్లో తమకు అన్యాయం జరిగిందని మాల సామాజిక వర్గం గగ్గోలు పెడుతున్నట్లు సమాచారం. ఇటీవల ఇచ్చిన పార్టీ పదవుల్లో తమకు ఎలాంటి ప్రాధాన్యత లేకుండా పోయిందని ఒకరి తర్వాత ఒకరు ఆ వర్గానికి చెందిన నాయకులు లేఖాస్త్రాలు సంధించారు. మాదిగ వర్గానికి చెందిన జవహర్ కి రాజమండ్రి పార్లమెంట్ జిల్లా పగ్గాలు అప్పగించారు. వర్ల రామయ్య కు పార్టీ పొలిట్బ్యూరో చోటుకల్పించారు. అలాగే మాదిగ వర్గానికి చెందిన ఎం.ఎస్.రాజు కు టిడిపి ఎస్సీసెల్ అధ్యక్షులు అప్పగించారు. ఇకపోతే మాజీ ఎమ్మెల్యే మాదిగ వర్గానికి చెందిన వంగలపూడి అనితకు ఏకంగా రెండు పదవులు ఇచ్చారు.
కానీ మాల వర్గానికి మాత్రమే ఇలాంటి పదవులు లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరీ ముఖ్యంగా మాజీ మంత్రి పీతల సుజాత పేరు కూడా పట్టించుకోకపోవడంతో వారిలో ఆగ్రహం పెల్లుబికింది అని అంటున్నారు. మాజీ స్పీకర్ ప్రతిభా భారతికి పొలిట్బ్యూరో సభ్యులు తొలగించడం వంటివి చేయడంతో బాబు పై సర్వత్రా విమర్శలు సొంత పార్టీలోని నెలకొన్నాయి.