కరోనా కొంత మందిని ముంచేసింది. కొంత మందిని తుంచేసింది. ఈ అయిదు నెలల కరోనా కాలంలో కొందరు కోట్లకు పడగలెత్తారు. కొందరు కోట్లు కోల్పోయారు. కానీ… కరోనా వచ్చినా, దానికి అమ్మమ్మ వచ్చినా ఎప్పుడూ సంపాదన పెంచుకునే ఏకైక భారతీయుడు మాత్రం ముకేశ్ అంబానీ…! తెలివి, తైలం (డబ్బు), తెగింపు ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటికీ మించి టెక్నాలజీ ఉన్నవాడు ముకేశుడు..! అందుకే అన్నీ కొంటాడు తప్ప అమ్మడు. ఇక మ్యాటర్ లోకి వచ్చేస్తే అంబానీ వలన చంద్రబాబు రూ. వందల కోట్లలోనే సంపాదించుకున్నాడా..? అసలు ముకేశ్ అంబానీకి, చంద్రబాబుకి సంబంధం ఏమిటి..? ఆయన కొంటె ఈయన లాభపడడం ఏమిటి..? అనే వ్యాపార లెక్కలు కొంచెం చెప్పుకుందాం..!!
నారా వారికి చెందిన హెరిటేజి రిటైల్స్ ని 2016 లో ఫ్యూచర్ గ్రూపుకి అమ్మిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పుడు ఈ అమ్మకం విలువ రూ. 295 కోట్లు. అప్పటికి ఫ్యూచర్ గ్రూపు మొత్తం విలువ రూ. 8083 కోట్లు. అంటే మొత్తం ఫ్యూచర్ గ్రూపులో హెరిటేజీ వాటా 3 . 65 శాతం. సో… ఈ లెక్క జాగ్రత్తగా గుర్తు పెట్టుకుంటే ఇప్పుడు తాజాగా నిన్న ఫ్యూచర్ గ్రూపుని రిలియన్స్ రూ. 24 , 713 కోట్లకు కొనేసింది. దీనిలో హెరిటేజీ వాటాగా ఉన్న 3 . 65 శాతం ని లెక్కిస్తే నారా వారి ఆస్తులు విలువ రూ. 902 కోట్లు. అప్పుడు అమ్మిన రూ. 295 కోట్లు తీసేస్తే రూ. 607 కోట్లు నారా వారు గడించినట్టే. సో…, రిలయన్స్ కొనుగోలు వలన చంద్రబాబు ఆస్తి 607 కోట్లు పెరిగినట్టే..?? కానీ ఇక్కడే అనేక లెక్కలున్నాయి. కొన్ని అంతర్గత చిక్కులుంటాయి.
నాడు ఫ్యూచర్ గ్రూపుకి అమ్మిన హెరిటేజి విభాగానికి చంద్రబాబు, నారా కుటుంబం ఒక్కరే యజమానులు కాదు. మరో నలుగురు భాగస్వాములు ఉన్నారు. సో.., ఈ 607 కోట్లు అందరికీ చెందుతుంది. ఇంకా పెద్ద మెలిక ఏమిటంటే ఇప్పుడు అంబానీ ఫ్యూచర్ గ్రూపు మొత్తాన్ని కొనేశారు. దీనిలో రిటైల్ వాటాగా వచ్చేది తక్కువే ఉంటుంది. ఫ్యూచర్ గ్రూప్ కి రిటైల్ సహా, ఫుడ్, బ్రాండ్ ఫ్యాక్టరీ, హోల్ సేల్, లాజిస్టిక్స్ వంటి అనేకం ఉన్నాయి. ఇవన్నీ లెక్కేసుకుంటే ఆ 607 కోట్లులో చాలా తగ్గుతుంది. అందుకే మొత్తానికి నారా వారికి బాగానే వస్తుంది కానీ, సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టు 607 కోట్లు మాత్రం కాదు.