(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
తెలుగుదేశం పార్టీ ఎందుకు ఓడింది? చంద్రబాబు గాలి హామీలా! లోకేష్ మీద నమ్మకం లేమా? ఎమ్మెల్యేల అవినీతా? జనసేన ఓట్లు చీలికా?జగన్ ప్రభంజనమా?ఇలా కారణాలు ఎన్ని చెప్పుకున్నప్పటికీ పార్టీ ఓటమి పరిపూర్ణం అయ్యింది. సరే ఓడిపోయాం, ప్రతిపక్షంలో కూర్చుందాం అని చంద్రబాబు ఫిక్స్ అయినా జగన్ ఊరికే ఉండనివ్వడం లేదు. ఎమ్మెల్యేలను లాగేస్తూ, మాజీలను లాగేస్తూ, తెలుగుదేశం పార్టీని, శ్రేణులను నైరాశ్యం చేసే ఒ పెద్ద కార్యక్రమానికి కంకణం కట్టుకున్నారు జగన్. మరి దీన్ని తట్టుకుని నిలబడాలంటే పార్టీ పునః నిర్మాణమే చంద్రబాబు ముందు ఉన్న అతి పెద్ద లక్ష్యం. దాని కోసమే ఇప్పుడు చంద్రబాబు అప్పుడెప్పుడో ఓడిపోయిన ఎన్నికలకు ఇప్పుడు పోస్టుమార్టం చేపట్టారనీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కులాల వల్ల ఓడిపోయామా?కొట్లాటల వల్ల ఓడిపోయామా?అవినీతి వల్ల ఓడిపోయామా? అనేది ఒక్కో అంశం తెలుసుకుంటూ ప్రస్తుతానికి కులాల దగ్గర ఆగి సమీక్ష చేసుకుంటూ మార్పులు, చేర్పులు చేసుకొస్తున్నారని వినికిడి.
నాడు టీడీపీకి బీసిలే పట్టుగొమ్మలు
తెలుగుదేశం పార్టీకి మొదటి నుండి కమ్మ సామాజిక వర్గంతో పాటు బలహీన వర్గాలు (బీసీ)లు, పలు ప్రాంతాల్లో దళితులు పట్టుగొమ్మలుగా ఉండేవారు. నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించినప్పుడు అన్ని వర్గాలకు పార్టీలో ప్రాధన్యత ఇచ్చారు. బిసిలకు మరింత ఎక్కువ ప్రాధాన్యత ఉండేది. దీంతో జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయిలో వివిధ కులాలకు చెందిన వారు నాయకులుగా ఎదిగారు. అనంతరం రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకూ పార్టీ పదవుల్లో అగ్ర వర్ణాల ప్రాధాన్యత పెరిగింది. దీంతో క్రమంగా టీడీపీ అనుకూలంగా బీసీలు, దళితులు దూరం అవుతూ వచ్చారు. గడచిన ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమికి ఈ వర్గాలు అధికంగా దూరం కావడం వల్లే అని ఒక అంచనాకు వచ్చినట్లు సమాచారం.
ఇకపై బీసీలు, దళితులకు పెద్దపీట
ఈ నేపథ్యంలో పార్టీలో జవసత్వాలు నింపేందుకు అధినేత చంద్రబాబు కొత్త వ్యూహాలు సిద్ధం చేస్తున్నారుట. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకూ ఇకపై అన్ని పదవుల్లో అగ్ర కులాలకు ప్రాధాన్యత తగ్గించి బిసిలు, దళితులకు పెద్ద పీట వేయాలని ఆలోచన చేస్తున్నారుట. పార్టీకి దూరమైన వర్గాలను తిరిగి రప్పిచేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించాలని పార్టీ సీనియర్ నేతలకు చంద్రబాబు ఆదేశించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల జరిగిన సీనియర్ నేతల సమావేశంలో వీటిపై ప్రస్తావనకు వచ్చిందని అంటున్నారు.
చంద్రబాబు ఆశలు ఫలిస్తాయా
ప్రధానంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ, ఉభయ గోదావరి జిల్లాలలో పార్టీ పదవులలో ఎక్కువగా బీసీలు, దళితులకు ప్రాధాన్యతను ఇస్తే రాబోయే ఎన్నికల నాటికి అయినా దూరమైన వర్గాలు దగ్గర అవుతారని టీడీపీ నేతలు ఆశాభావంతో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి బీసి వర్గానికి చెందిన సీనియర్ నేత కింజరపు అచ్చెన్నాయుడికి అప్పగించాలని భావిస్తున్న పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు..పార్టీలో నూతన జవసత్వాలు నింపేందుకు పూర్తి స్థాయిలో ప్రక్షాళనకు చేయడానికి కసరత్తు చేస్తున్నారని అంటున్నారు. ఒ పక్క జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం బిసిలు, దళితుల అభ్యున్నతికి ప్రత్యేకంగా కార్పోరేషన్లు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు ఇబ్బడి ముబ్బడిగా అందిస్తున్న ఈ తరుణంలో ఆ వర్గాలు తిరిగి టీడీపీకి దగ్గర అవుతాయా? చంద్రబాబు ఆశలు ఫలిస్తాయా? లేదా? చూడాలి మరి.