టీడీపీ..వైసీపీకి మద్దతుగా నిలిచే వర్గాలకు ధీటుగా…
పవన్ కళ్యాన్ తో కలిసి నడుస్తారా..
ఏపీ బీజేపీ నేతలకు హైకమాండ్ క్లాస్..!
ఏపీలో బీజేపీ నాయకత్వ మార్పు పైన ఆ పార్టీ అగ్రనాయకత్వం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుతం ఏపీ బీజేపీ చీఫ్ గా ఉన్న కన్నా లక్ష్మీనారాయణను మార్చాలని హైకమాండ్ నిర్ణయించినట్లుగా విశ్వసనీయ సమాచారం.
గతంలోనే ఏపీ బీజేపీ చీఫ్ అవుతారనే అంచనాలు వ్యక్తం అయినా..అనూహ్యంగా కన్నాకు ఏపీ బాధ్యతలు అప్పగించారు. ఏపీ బీజేపీలో ముఖ్య నేతల మధ్య సమన్వయం లేదని.. వ్యక్తిగత అభిప్రాయాలకు విలువ ఇస్తున్నారనే ఫిర్యాదుల పైన తాజాగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ కొద్ది రోజుల క్రితం క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో అమరావతి అంశం పైన పార్టీ నేతల భిన్న తీరు పైన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇక, కొత్త చీఫ్ నియామకం విషయంలోనూ పార్టీ సామాజిక సమీకరణాలు..జనసేనతో పొత్తు అంశాలను పరిగణలోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే, తాజాగా ఖరారైన వ్యక్తి ప్రస్తుత ముఖ్యమంత్రికి అనేక సందర్భాల్లో పరోక్షంగా మద్దతుగా నిలవటంతో పాటుగా..ఆయనతో సఖ్యతతో వ్యవహరించిన నేతగా పార్టీలో ప్రచారం ఉంది. దీంతో..ఇప్పుడు ఆయన విషయంలో పార్టీ చివరి నిమిషంలో ఏదైనా మర్పు చేస్తే మినహా ఆయనే పార్టీ కొత్త చీఫ్ గా రావటం ఖాయంగా కనిపిస్తోంది.
ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా సోము వీర్రాజు..
ప్రస్తుతం ఏపీ బీజేపీ చీఫ్ గా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ పదవీ కాలం ముగిసింది. కొద్ది నెలలుగా ఆయన స్థానంలో కొత్త వారిని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తారంటూ అనేక పేర్లు తెర మీదకు వచ్చాయి. అయితే, ఏపీలో నెలకొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ప్రధానంగా జనసేనతో పొత్తు..సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకొని పార్టీ అధినాయకత్వం లోతైన కసరత్తు చేసింది. ఇంతలో కరోనా కారణంగా కొత్త అధ్యక్షుడి నియామకం పైన నిర్ణయం జరగలేదు. తెలంగాణ బీజేపీ చీఫ్ గా బీసీ వర్గానికి చెందిన బండి సంజయ్ ను ఎంపిక చేసిన సమయంలోనే ఏపీకి నూతన అధ్యక్షుడి నియామకం జరుగుతుందని అందరూ భావించారు. ఆ సమయంలో ఉత్తరాంధ్రకు ఈ పదవి ఇస్తే ఎమ్మెల్సీ మాధవ్ కు ఇస్తారని..కాపు కోటాలో అయితే సోము వీర్రాజు పేరు..కమ్మ కోటాలో అయితే పురంధేశ్వరికి అవకాశం ఉందంటూ ప్రచారం సాగింది. అయితే, ఈ మధ్య కాలంలో అమరావతి అంశంతో పాటుగా పలు సందర్భాల్లో పార్టీ నేతలు…టీడీపీ నుండి బీజేపీలో చేరిన ఎంపీల మాటల మధ్య అభిప్రాయ బేధాలు స్పష్టంగా కనిపించాయి. దీంతో..వీరందరినీ నియంత్రిస్తూ..ముందుకు తీసుకెళ్లే విధంగా నూతన అధ్యక్షుడిని నియమించాలని నిర్ణయించిన పార్టీ అధినాయకత్వం..తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సోము వీర్రాజు పేరు ఖరారు చేసింది. త్వరలోనే దీనిని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు.
పార్టీ నేతలకు ఇన్ ఛార్జ్ క్లాస్…
పార్టీలో రాజ్యసభ సభ్యులు …ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు అమరావతి వ్యవహారంలో ఒక్కో విధంగా వ్యవహరించటం పైన తాజాగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ ఒక రేంజ్ లో వీరికి క్లాస్ తీసుకున్నట్లుగా విశ్వస నీయ సమాచారం. జీవీఎల్ వంటి వారు అమరావతి కేంద్ర పరిధిలోని అంశం కాదని చెప్పటం..సుజనా చౌదరి లాంటి వారు సరైన సమయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందని వ్యాఖ్యానించటం..ఇక, బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా నేరుగా గవర్నర్ కు లేఖ రాసి మూడు రాజధానుల బిల్లులను ఆమోదించవద్దని చెప్పటంతో పార్టీలో గందరగోళం ఏర్పడింది. కొందరు సీనియర్లు ఈ వ్యవహారాన్ని పార్టీ హైకమాండ్ వద్దకు తీసుకెళ్లగా…ఏపీ బీజేపీ ముఖ్య నేతల పైన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇక, కొత్త అధ్యక్షుడిగా నియమితులవుతారనే ప్రచారంలో ఉన్న సోము వీర్రాజు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ కు అనేక సందర్భాల్లో పరోక్ష మద్దతుగా వ్యాఖ్యల చేసారని కొందరు నేతలు హైకమాండ్ కు వివరించినట్లుగా తెలుస్తోంది. అయితే, టీడీపీ విషయంలో మాత్రం సోము వీర్రాజు సీరియస్ గానే ప్రతీ సందర్భంలో వ్యవహరించారనే చర్చ పార్టీలో ఉంది. ఇక, ఇప్పుడు మిత్రపక్షం పవన్ కళ్యాన్ తో సోము వీర్రాజు వైఖరి ఎలా ఉంటుంది..వివాదాలు లేకుండా కలిసి ప్రయాణం సాగిస్తారా అనేదీ ఇప్పుడు పార్టీలో చర్చ. పార్టీలో తొలి నుండీ ఉంటూ పార్టీ ఒంటరిగానే ఎదిగే అవకాశం ఏపీలో ఉందనే పదే పదే చెప్పే సోము వీర్రాజుకు అధికారికంగా ఏపీ బాధ్యతలు అప్పగిస్తే ఏపీ బీజేపీలో కొత్త రాజకీయాలు ఏ రకంగా టర్న్ తీసుకుంటాయ నేది ఇప్పుడు హాట్ టాపిక్.