హెడ్డింగు చూడగానే అదేంటి కరోనా మనుషులకు కదా సోకుతుంది…! మరి పిన్నీసు, సెంపిన్నీసులకు ఆ వైరస్ ఏంటి అనే డౌటనుమానం రావచ్చు…! పిన్నీసు, సెంపిన్నీసులకే కాదు… కొద్దీ రోజులు ఆగితే ఛార్జర్లు, ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు మొదలుకుని ఫోన్లుకి వేసుకునే గొరిల్లా గ్లాసులు, ఇయర్ ఫోన్లు, హెడ్ సెట్లు… షర్టుకి వేసుకునే గుండీలు, జడకి పెట్టుకునే క్లిప్పులకు కూడా ఆ వైరస్ త్వరలోనే వస్తుంది. దేశ పెద్దలు అప్రమత్తమై ముందస్తు చర్యలు తీసుకోకపోతే ఆ వైరస్ దెబ్బ ఖాయమే. దీనిపై ఇంకా అనేక అనుమానాలు రావచ్చు. కాస్త లోతుగా వెళదాం పదండి.
చైనాలో కరోనా జబ్బు… భారత్ పై ఆర్ధిక పిడుగు…!
చైనా ఫోన్లు, చైనా టివిలు, చైనా వస్తువులు అని మనం వినే ఉంటాం. సాధారణ జనాలకు తెలిసేది ఏమిటంటే చైనా నుండి మనం టివిలు, ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు దిగుమతి చేసుకుంటున్నాం అనే. కానీ కొన్ని కఠోర వాస్తవాలు ఉన్నాయి. ఇండియాలో మారు మూల కుగ్రామంలో పేద కుటుంబాలు నిత్యం ఉపయోగించే చిన్నపాటి వస్తువులు కూడా అక్కడి నుండి వచ్చేవే. చివరాఖరికి రూ. పది పెట్టి కొనుగోలు చేసే గుండీలు, పిన్నులు, క్లిప్పులు, తక్కువ ధర చెప్పులు కూడా అక్కడి నుండి వచ్చేవే. ఇప్పుడు చైనాలో రెండు నెలల నుండి కరోనా వైరస్ ప్రభావంతో వీటి తయారీ నిలిచిపోయింది. తయారీ అక్కడక్కడా జరుగుతున్నప్పటికీ.., ఇతర దేశాలకు ఎగుమతి ఆగిపోయింది. అనేక దేశాలు చైనా నుండి దిగుమతులు నిలిపివేశాయి. వాటిలో మన దేశం కూడా ఉంది. అందుకే ఇప్పుడు ఉత్పత్తి లేక, దిగుమతి లేక, వస్తువులకు డిమాండ్ ఏర్పడి ధరలు అమాంతం పెరిగాయి. ఉదాహరణ గమనిస్తే.. : ఆడవాళ్ళూ జడకు పెట్టుకునే అందమైన చైనా(ఇది ఎక్కడిది అనేది తెలుసుకోలేరు) క్లిప్పు బయట దుకాణాల్లో రూ. ౩౦ వరకు ఉంటుంది. ఇది విజయవాడ లోని కాళేశ్వర మార్కెట్ లో హోల్సేల్ లో రూ. 15 ఉంటుంది. దీన్ని చైనా నుండి వారు రూ. 10 కి తెప్పించుకుంటారు. అందుకు పన్నులు, దిగుమతి సుంకం చెల్లిస్తారులెండి. తాజాగా వారం రోజుల నుండి చైనా నుండి సరఫరా ఆగిపోయింది. అందుకే ఉన్న వాటికి డిమాండ్ దృష్ట్యా రూ. 15 కి ఇవ్వాల్సింది రూ. 25 , 35 వరకు పెంచేశారు. ఇది వినియోగదారుడికి చేరేసరికి రూ. 70 కి చేరుతుంది. ఇదే ఉదాహరణ టివిలు, ఫోన్లు, ప్రతి పరికరం లోనో వర్తిస్తుంది. సగటున 50 నుండి 100 శాతం చైనా వస్తువుల ధరలు పెరగనున్నాయి.
నెలకు 36 వేల కోట్లు దిగుమతి…!
చైనా అంతర్జీతీయంగా అంత్యంత ఉత్పత్తి కర్మాగారం. అక్కడ తయారు చేయని వస్తువు అంటూ ఉండదు. ఇతర దేశాల్లో ఉత్పత్తి అయ్యే ముడి సరుకుని కూడా చైనా తమ దేశానికీ తీసుకెళ్లి, అందంగా తీర్చిదిద్ది తిరిగి అదే దేశానికి అమ్ముతుంది. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలో బాగా లభించే గ్రానైట్ రాళ్ళని చైనా తమ దేశానికీ తీసుకెళ్తుంది. అక్కడ పరిశ్రమల్లో పాలకులుగా, అందంగా తయారు చేసి మల్లి ఇండియాలోనే విడిగా అమ్ముతుంది. అది ఆ దేశ నైపుణ్యత. అందుకే నెలకు రూ. 36 వేల కోట్ల విలువైన వస్తువులను మన దేశం చైనా నుండి దిగుమతి చేసుకుంటున్నాం. ఇది గడిచిన మూడు నెలలుగా తగ్గుతూ వస్తుంది. 2019 నవంబర్ లో రూ. 366 వేల కోట్ల విలువైన వస్తువులు దిగుమతి చేసుకోగా, డిసెంబర్ నాటికీ 356 వేల కోట్లకు పడిపోయింది. అది ఫిబ్రవరి నాటికీ 250 వేల కోట్లకు పడిపోయి ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇండియా దిగుమతి చేసుకునే దేశాల్లో చైనా అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో యూఏఈ (నెలకు రూ. 220 కోట్లు), అమెరికా (నెలకు రూ. 180 కోట్లు) సౌదీ అరేబియా, ఇండోనేసియా ఉన్నాయి. దిగుమతి తగ్గే కొద్దీ, ఇక్కడ అమ్మకపు ధరలు పెరుగుతాయి. చైనా నుండి వచ్చే వస్తువులకు అడ్డూ, అదుపు లేదు. ప్రతి సాధారణ వస్తువు అక్కడి నుండి అలవాటు పడడంతో ఇప్పుడు కరోనా ప్రభావం పరోక్షంగా ఇలా ఆర్ధిక రంగంపై పడుతుంది.
– శ్రీనివాస్ మానెం