Tollywood: టాలీవుడ్ Tollywood విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశం ఏపీలో కాక రేపింది. ప్రధాని హోదాలో మోదీ ప్రకటన దీనికి ఆజ్యం పోసింది. ఇటివల కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన స్పష్టత మరింత మంటలు రేపింది. దీంతో విశాఖలో ఉద్యమం ఓ స్థాయిలో పెరిగిపోయింది. ఏకంగా ఈ సెగ తెలంగాణను తాకింది. మంత్రి కేటీఆర్ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. అవసరమైతే విశాఖ వచ్చేందుకు సిద్ధమని ప్రకటించారు. కేంద్రం నిర్ణయాలు ఎటు తిరిగి ఎక్కడి వరకూ వస్తాయోననే ఆందోళనే ఇందుకు కారణం. ఇప్పుడు సినీ పరిశ్రమ నుంచి కూడా పెద్ద కదలిక వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి విశాఖ ఉక్కు పరిరక్షణకు ‘నేను సైతం..’ అంటూ మద్దతు ప్రకటించారు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం.
రాష్ట్రంలో అనేక విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు సినీ పరిశ్రమ ఒక్కతాటిపైకి వచ్చి ఆదుకున్న సందర్భాలు కోకోల్లలు. ఇప్పుడు విశాఖ ఉద్యమం కూడా అదే స్థాయిలో పెరిగింది. దీనికి తన వంతుగా మెగాస్టార్ మొదటి అడుగు వేయడం విశేషం. ‘విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు’ అనే నినాదం విలువ తనకు తెలుసునని.. విద్యార్ధి దశలో ఈ పరిశ్రమ సాధన కోసం తాను సైతం అన్న రోజులను గుర్తు తెచ్చుకున్నారు చిరంజీవి. విశాఖ ఉక్కుకు ఎందరో ఊపిరి వదిలేశారని చెప్పిన చిరంజీవి ఆ త్యాగాలను మర్చిపోలేదు. తాను ఉద్యమానికి మద్దతు ప్రకటించడం ద్వారా సినీ పరిశ్రమను కూడా ఏకం కావాలని పరోక్షంగా పిలుపునిచ్చారు.
హీరో సుధీర్ బాబు కూడా ఇటువంటి సమయంలో విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకోవాలి అంటూ అంటూ ముందుకొచ్చారు. కరోనా సంక్షోభంలో సినీ కార్మికుల కోసం ‘సీసీసీ’ చారిటీని ఏర్పాటు చేసి కొన్ని నెలలపాటు కార్మికులకు నిత్యావసరాలు అందేలా చూశారు చిరంజీవి. ఆ సమయంలో పెద్దన్న పాత్ర పోషించి ఇండస్ట్రీని ఏకం చేశారు. తుఫాను వంటి విపత్తుల వచ్చినప్పుడు క్రికెట్ మ్యాచ్ లు, చారిటీలు నిర్వహించింది తెలుగు సినీ పరిశ్రమ. భారతీయ సినీ పరిశ్రమలో తెలుగు సినిమా ప్రత్యేకం. సినిమాను, నటులను ప్రజలు అభిమానించే తీరు ఎంతో ప్రత్యేకం. ప్రజాకాంక్షను కోరి ఇప్పుడు విశాఖ ఉక్కు పరిరక్షణలోనూ చూపించి సినీ పరిశ్రమ నుంచి ‘ఒక్క అడుగు’ పడటం శుభపరిణామం.