రాజకీయాల్లో కొన్ని స్ట్రాటజీలు ఉంటాయి. దాన్నే వ్యూహాలు అని అందరూ అంటుంటారు. కానీ..! వ్యూహం వేరు, స్ట్రాటజీ వేరు..! వ్యూహం ఒకరు ఎదగడానికి ఉపయోగపడుతుంది, స్ట్రాటజీ ఎదగడానికి, తొక్కడానికి, వివాదాలు సృష్టించడానికి ఉపయోగపడుతుంది..! ఇప్పుడు విశాఖలో ఒక రాజకీయ స్ట్రాటజీ నడుస్తుంది. రాజధానిగా విశాఖని అనుకుంటున్న జగన్ అక్కడ రాజకీయంగానూ బలాన్ని నిర్మించే పనిలో ఉన్నారు. దీనిలో భాగంగా టీడీపీ బలాన్ని తగ్గించే పనిలో ఉన్నారు. ప్రస్తుతం విశాఖలో ఎవరి బలం ఎంత..? ఈ వివాదానికి కారణం ఏంటి..? అనేది లోతుగా చూద్దాం..!!
టీడీపీకి గతంలో ఇలా.. ఇప్పుడు ఇలా..!!
విశాఖ అంటే టీడీపీకి మంచి కోట. జిల్లాలో మొత్తం 15 స్థానాలుంటే పార్టీ ఆవిర్భావం నుండి ప్రతీసారి 8 నుండి 10 గెలిచేది. 2004 లో కాంగ్రెస్ గాలి బలంగా వీచినప్పుడు మాత్రమే 3 .., 2019 లో జగన్ గాలి బలంగా వీచినప్పుడు 4 స్థానాలు గెలుచుకుంది. అయ్యన్నపాత్రుడు, వెలగపూడి రామకృష్ణ, గంటా శ్రీనివాసరావు లాంటి బలమైన నాయకులు టీడీపీలో ఉన్నారు. ఆ జిల్లాలో కాపు, తూర్పుకాపు, కళింగ సామాజిక వర్గాలు కూడా టీడీపీకి అండగా ఉండేవి. 2019 నాటికి జగన్ ఈ బలంపై కొట్టి అనేక స్థానాలు గెలుచుకున్నారు. అయితే ఇక్కడ రాజధాని ఏర్పాటుపై సంకల్పం పెట్టుకున్న సీఎం జగన్.. ఇక్కడ టీడీపీని పతనం చేసే స్ట్రాటజికి శ్రీకారం చుట్టుకున్నారు. విశాఖలో “ఆపరేషన్ టీడీపీ” కొద్దికాలంగా జరుగుతూనే ఉంది. దీనిలో భాగంగానే ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ జంపయ్యారు. ఇక్కడ గంటా కూడా వెళ్లాలనుకున్నప్పటికీ జగన్ ఆపేసారు. అందుకే గంటా అటూ, ఇటూ కాకుండా మధ్యలో ఉండిపోయారు. ఇక టీడీపీకి విశాఖలో బలమైన నాయకుడు వెలగపూడి రామకృష్ణ. ఈయనకు విశాఖ తూర్పులో మంచి పట్టుంది. మాస్ లీడర్ ఇమేజ్ ఉంది. అందుకే రాష్ట్రంలో ఎవరి గాలి ఉన్నప్పటికీ ఇక్కడ మాత్రం రామకృష్ణ వరుసగా మూడుసార్లు భారీ ఆధిక్యతతో గెలిచారు. టీడీపీకి పెద్ద దిక్కు ఈయనే.
నగరపాల ఎన్నికలు జరిగితే..!!
గంటాని సైలెంట్ చేయడం… వాసుపల్లి గణేష్ ని లాగేయడం ద్వారా టీడీపీ కొంత దెబ్బ పడింది. ఇక్కడ వెలగపూడి రామకృష్ణ, గీతం భరత్, గణబాబులని దెబ్బ తీస్తే టీడీపీ కోలుకోవడం కష్టం అనేది వైసీపీ స్ట్రాటజీ. అందుకే వారి ఆస్తులపై, పాత కేసులపై, గత పాపాలపై కన్నేసింది. వివాదాల్లోకి లాగుతుంది. వారు ఆక్రమించుకున్న భూములను తీసుకుంటుంది. వారిని బద్నామ్ చేస్తుంది. ఈ క్రమంలోనే వీళ్ళు కూడా టీడీపీకి అంటిపెట్టుకుని ఉన్నారు. గట్టిగానే పోరాడుతున్నారు. వచ్చే గ్రేటర్ ఎన్నికలను వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. టీడీపీకి కనీసం రెండంకెల కూడా దాటకుండా చెయ్యలేంది అధికార పార్టీ స్ట్రాటజీ. తద్వారా విశాఖలో టీడీపీ పునాదులు కూల్చేసి, పార్టీ జవసత్వాలు లేకుండా చేయొచ్చు అని పెద్ద స్ట్రాటజీ ప్రకారం వెళ్తుంది.
ఎవరికీ ఎన్ని వార్డులు..!!
ఒకవేళ విశాఖలో గ్రేటర్ ఎన్నికలు జరిగితే ఎవరికీ ఎన్ని వార్డులు వస్తాయి అనేది ఇప్పటికీ చర్చనీయాంశంగా మారింది. పార్టీలు కూడా లెక్కలు వేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో “న్యూస్ ఆర్బిట్” క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టింది. కొన్ని వార్డుల్లో.. కొన్ని నియోజకవర్గాల్లో అభిప్రాయ సేకరణ చేపట్టింది. తీసుకున్న నమూనాలు, కొన్ని లెక్కల ప్రకారం విశాఖలో మొత్తం 98 వార్డులు ఉండగా.., 65 నుండి 70 వార్డులు అధికార పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది. 25 నుండి 30 వార్డులు టీడీపీ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక బీజేపీకి 2 నుండి 6 వార్డులు లభించే అవకాశం ఉంది.
(ఇక విశాఖ వేదికగా బీజేపీ వేస్తున్న అతిపెద్ద ప్లాన్ ఏంటి..? ఆ పార్టీ రాజకీయ ఎత్తుగడలు విశాఖలో ఎలా ఉండబోతున్నాయి..? అనేది తదుపరి కథనంలో చర్చిద్దాం..!)