హయ్యారే…! ఈ కోర్టులేమిటో జగన్ పై పగ పట్టేసినట్టున్నాయి..! ఒకటి కాదు, రెండు కాదు.., వరుసగా కోర్టుల్లో సీఎం జగన్ కి ఎదురు దెబ్బలు అంటే ఇది సాధారణ విషయం కాదు..!! జగన్ అనుకుంటున్న ప్రతీ అంశం.., తీసుకుంటున్న నిర్ణయాల్లో చాల వరకు కోర్టుల ముంగిట బోల్తా పడుతున్నాయి. దీంతో ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టుకి వెళ్లడం అలవాటుగా మారిపోతుంది. జగన్ అలెర్ట్ కాకుంటే.., తన వద్ద ఉన్న “న్యాయ విభాగం”లో భజన పరులను కాకుండా సమర్థులను తీసుకుంటే మంచిదే.., లేకుంటే జగన్ కి ఈ తలనొప్పులు వెంటాడుతూనే ఉంటాయి..!
ఈ మధ్య ప్రతి విషయంలోనూ జగన్ బృందం అంటే ప్రభుత్వ అధికారులు, పోలీసులు కోర్టుల చేతిలో చివాట్లు తింటున్నారు. రాజధానుల వికేంద్రీకరణ, నిమ్మగడ్డ కేసు, గ్రామ, వార్డు సచివాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం నుండి దాదాపు 70 వ్యవహారాల్లోనూ ప్రభుత్వ వాదనలు బెడిసికొట్టాయి. అసలు ఈ వాదనల్లో అసమర్థత ఉందా…? నిర్ణయాల్లోనే అసంబద్ధత ఉందా అనేది ప్రభుత్వ పెద్దలు తమకు తామే విశ్లేషించుకోవాలి.
రాజకీయం అంటే రెండూ ఉండాలిగా…!!
మనిసన్నాక కొన్ని లక్షణాలు, అవ లక్షణాలు సహజమే. అలాగే పట్టూ విడుపు కూడా సహజమే. అందులోనూ రాజకీయం అంటే ఇవన్నీ శతశాతం ఉండాలి. ఈ లక్షణాలు అవపోషణ చేసుకుని మరీ ఉండాలి. సమయం వచ్చినప్పుడు బయటకు తీయాలి. అవసరమైతే మెట్టు/ గట్టు దిగాలి. లేకపోతే తనకు సందు ఉంటె దూరిపోయి, రెచ్చిపోవాలి. ఇదే సందర్భంలో లీగాలిటీలో ఒక పనికి, ఒక నిర్ణయానికి సరైన కారణం ముందే సిద్ధం చేసుకుని అమలు చేయాలి. జవాబుదారీగా ఉండాలి. లేకుంటే తిప్పలు తప్పవు. తప్పులు చేసిన దోషిలా ఉండాల్సి వస్తుంది. సర్ది చెప్పుకునే వాదన ఉండాలి. ఎదుటి వారి ప్రతి ప్రశ్నను ముందే ఊహించి సమాధానం సిద్ధం చేసుకోవాల్సిన సమయం ఇప్పుడు నడుస్తుంది. కానీ వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలను సమర్ధించడంలో, అంతర సదుద్దేశాన్ని సక్రమంగా చెప్పడంలో, సమ్మతమైన వాదనలు వినిపించడంలో ఇప్పుడు జగన్ ప్రభుత్వం వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకే వరుసగా హైకోర్టులో ఈ పరిస్థితి వస్తుంది. చివాట్లు ఎదురవుతున్నాయి.
జగన్ కి ఇది పెద్ద మచ్చగా ఖాయం..!!
రాజకీయంగా జాతీయ స్థాయిలో పేరున్న నాయకుడు జగన్. రాష్ట్రంలో తిరుగులేని నేతగా జగన్ ఉన్నారు. ఇదే తీరున సంక్షేమం అమలు చేసి, కొంచెం అభివృద్ధి కూడా చూపిస్తే ఆయన 30 ఏళ్ళ ముఖ్యమంత్రి లక్ష్యం నెరవేరే అవకాశాలున్నట్టే. కానీ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన నిర్ణయాలు వివాదాస్పదంగా ఉంటున్నాయి. ఆయన పరిపాలనా దూకుడు, సుదీర్ఘ ఆలోచనలు, భావి అవసరాల దృష్ట్యా తీసుకున్న నిర్ణయాలు అటువంటివి. ఇదే సందర్భంలో ప్రతిపక్షాలు వాటిని సవాలు చేయడం సహజమే. అయితే జగన్ నిర్ణయాలను కోర్టుల్లో సమర్ధించేలా, సరైన వాదనలు వినిపించట్లేదు. ఈ ఫలితమే వైఫల్యాలు. దీనికి కారణం నిర్ణయం లోపం, సమర్ధత వైఫల్యం.
పునరాలోచన.., సమీక్ష లేనట్టేనా..!!
ఈ విచారణలు సందర్భంగా న్యాయమూర్తులు కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేయడం జగన్ అండ్ బృందం పునరాలోచించుకివాల్సిన అంశం. జగన్ చుట్టూ వందల మంది సివిల్ సర్వీసెస్ అధికారులు, న్యాయ పట్టాలు పొందిన నిపుణులు.., పోలీసుల్లో చట్టాలు ఆరితేరిన వారు ఉంటారు. వారితో సంప్రదించి, సరైన నిర్ణయం అమలు చేసి, దాన్ని సమర్ధించుకోకుంటే ఇటువంటి అప్రతిష్టలు కొనసాగుతూనే ఉంటాయి. పిటిషన్లు పెరుగుతూనే ఉంటాయి. అధికారులు, పోలీసులు వాటి చుట్టూ తిరగడానికి, సమయం వెచ్చించడానికి బోలెడు మానసిక శ్రమ కూడా తప్పదు. వైసీపీకి రాజకీయంగా కాస్త చులకన తప్పదు. ప్రతిపక్షాలకు ఇవి ఆయుధాలుగా మారక తప్పదు. ఎటువంటి అంశాలను అయినా కోర్టులో బలంగా వాదించి, సమర్ధించగల నిపుణత ప్రస్తుతం కొరవడింది. అది వస్తేనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికేది.