మోదీ – జగన్ కలయికపై అనేక పుకార్లు, అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి..! జగన్ అడిగినవి, మోదీ చెప్పినవి అంటూ జాతీయ మీడియా సహా అనేక మీడియాల్లో రకరకాలుగా వండి వడ్డిస్తున్నారు..!! అఫ్ కోర్స్ మోదీతో కలయిక సందర్భంగా జగన్ తనకు కావాల్సినవి అడగడంలో ఆశ్చర్యం లేదు. “తన వ్యక్తిగత ఇబ్బందులు.., రాజధాని వికేంద్రీకరణకు, ఇతర అంశాల్లో న్యాయ సహాయం.., టీడీపీ అవినీతిపై సీబీఐతో విచారణ.., రాష్ట్రానికి నిధులు..! ఇవన్నీ సహజమే. ఇదే విధంగా బీజేపీ కూడా జగన్ ని ఎన్డీఏలో చేరమనడంలో ఆశ్చర్యం లేదు. అయితే..!!
ఈ కలయిక ఓ కీలక అంశం చుట్టూ తిరిగింది అనేది తాజాగా “న్యూస్ ఆర్బిట్” కి చిక్కిన సంచలన అంశం..! కొన్ని లాజిక్కులు క్షుణ్ణంగా పరిశీలిస్తే… సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ నియామకం కోసం జగన్ ద్వారా బాటలు వేస్తున్న బీజేపీ కొత్త ఎత్తుకి.., ఈ కలయిక వేదికగా మారింది అనేది ఒక పెద్ద అంశం..! అదెలాగో, అదేమిటో చూద్దాం..!!
బీజేపీ కొత్త ఎత్తులు ఇవే..!!
జగనూ – బీజేపీ మధ్య బంధం ఉన్నట్టే. అది ఎన్డీఏలో చేరితో వెలుతురులో.., చేరకపోతే చీకట్లో కొనసాగుతుంది. అయితే త్వరలో సుప్రీం కోర్టుకి కొత్త ప్రధాన న్యాయమూర్తిని నియమించాల్సి ఉంది. ప్రస్తుతం పరిశీలనలో ఉన్న జాబితాలో జస్టిస్ ఎన్వీ రమణ పేరు ముందు వరుసలో ఉంది. ఆ స్థానానికి రమణని నియమించాలి అన్నా, ఆపెయ్యాలి అన్నా బీజేపీకి కారణాలు కావాలి. అందుకు జగన్ ఒక పావు(దారి)గా ఉండాలి అనేది బీజేపీ ఎత్తు. ఎన్వీ రమణ మూలాలన్ని ఏపీలోనే ఉన్నాయి. ఆయనపై కొన్ని పాత కేసులున్నాయి. స్టూడెంట్ లీడర్ గా ఉన్నప్పుడు చేసిన ధర్నా కేసు.., హైకోర్టు న్యాయమూర్తిగా నియామకం సమయంలో ఇచ్చిన సెల్ఫ్ డిక్లరేషన్ పత్రం వివాదాస్పదమైంది. అయితే ఇవేమీ లీగల్ గా నిలబడలేదు, తర్వాత కొట్టేశారు. తాజాగా అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ కేసులోనూ ఆయన బంధువులకు భూములున్నాయని కొన్ని ఆరోపణలున్నాయి. అంటే ఈ కారణాలు బూచిగా చూపించి రమణని ఆపేయాలన్నా…! లేదు.., “ఇదిగో నీపై ఇన్ని ఉన్నా నీకు ఆ స్థానం ఇస్తున్నాం. కాస్త చూసుకోవోయ్” అని చేయి అందించాలన్నా ఈ అంశాలే కీలకం. అందుకే జగన్ ని దువ్వి, జగన్ ద్వారా కొన్ని పాయింట్లు పట్టుకుని.., ఆ స్థానాన్ని శాసించాలి అనేది బీజేపీ వేసిన ప్లాన్ కావచ్చు.
అయితే… ఈ డేంజర్ గేమ్ లో జగన్ ఎందుకు దూరినట్టు..!?
అన్నిటి కంటే ముఖ్యంగా జగన్ ఇప్పుడు అత్యంత డేంజర్ గేమ్ (తన 16 నెలల పాలనలో ఇదే అత్యంత సున్నితమైన, ప్రమాదకరమైన వ్యవహారం)లో దూరడం పెద్ద సాహసమే. కానీ జగన్ కి ఇది అనివార్యం. “ప్రస్తుతం సుప్రీం జడ్జిగా ఉన్న జస్టిస్ రమణ… గతంలో ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు హైకోర్టు న్యాయమూర్తిగా ప్రతిపాదించబడి, నియమించబడ్డారు. పైగా రమణ, చంద్రబాబు ఒకే సామాజికవర్గం. అందుకే ప్రస్తుతం న్యాయవ్యవహారాలపై జగన్ కి పట్టు ఉండాలి అంటే ఈ రిస్క్ చేయాల్సిందే”..! తన పాత్ర పోషించాల్సిందే. అందుకే బీజేపీ గేమ్ లో జగన్ కూడా ఒక మార్గం. తన అవసరాలు తీర్చుకునే క్రమంలో జగనూ బీజేపీకి సై అనే అవకాశమూ లేకపోలేదు. ఇదన్నమాట లోతుగా వెళ్తే ఇన్ని అంశాలు ఉన్నాయి. సీఎంలు, పీఎంలు, చీఫ్ జస్టిస్ లు ఊరికే అయిపోరు..!!