కోర్టుల్లో అడుగడుగునా వ్యతిరేక తీర్పు వస్తుంది… ప్రతిపక్షం అర్ధరహిత ఆరోపణలు చేస్తుంది… కేంద్రం అరకొరగానే చూస్తుంది… ఒక వర్గం మీడియా అక్షర దాడి చేస్తోంది…! దీర్ఘకాలం ముఖ్యమంత్రిగా కొనసాగాలని సుదీర్ఘ లక్ష్యం పెట్టుకున్న జగన్ కి ఇలా ఎదురీత ఎదురవుతుంది…! ఆయనకు పాలనలో బలం, బలగంగా ఉండాల్సింది ఐఏఎస్, ఐపీఎస్ లే. కానీ ఇది అంతంత మాత్రం గానే కనిపిస్తుంది. ఏడాది తిరక్కుండానే అవాంతరాలు, అంతర్యుద్ధాలు జరిగాయి. ఎందుకిలా? ఎక్కడ తప్పు జరుగుతుంది?? ఐఏఎస్ లతో ఎందుకు చెడుతుంది..? జగన్ కు దగ్గరై వచ్చిన ఐఏఎస్ లు మళ్లీ ఎందుకు దూరమయ్యారు? దీనివలన జగన్ కు లాభమా నష్టమా? భవిష్యత్తు పై ప్రభావం ఎలా ఉంటుంది?? అనేది కీలకంగా తెలుసుకోవాల్సిన అంశం…! ఎల్ వి సుబ్రహ్మణ్యం, అజయ్ కల్లం రెడ్డి, ఐ వై ఆర్ కృష్ణా రావు… ఈ పేర్లన్నీ వింటే కాస్త విషయం అర్థం అయ్యే ఉంటుంది. వీళ్ళందరూ ఎన్నికలకు ముందు.., జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొద్దిపాటి దగ్గరై మళ్లీ దూరమయ్యారు. ఎందుకు? ఏం జరిగింది? వీరికి జగన్ కి ఎక్కడ చెడింది? పరిష్కారం ఏమిటి? అనేది కాస్త లోతుగా తెలుసుకుందాం.
రాజకీయ బంధం “కృష్ణా”ర్పణం…!
టిడిపి ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేసి చంద్రబాబుకి బాగా దగ్గర అయ్యారు. అందుకే పదవీ విరమణ చేసిన తర్వాత కూడా కేబినెట్ ర్యాంకు ఉన్న బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా పదవిని ఎక్కారు. కానీ ఎంత కాలం ఈ స్నేహం నిలబడలేదు. టిడిపి అంటే ఒక సామాజిక వర్గం డామినేషన్ అని తెలిసిందే. అందుకే బ్రాహ్మణ కార్పొరేషన్ వ్యవహారాలలో కూడా చంద్రబాబు, అతని బృందం వేలు పెట్టేవారు. స్వతహాగానే కృష్ణారావు స్వతంత్ర భావాలతో ఆలోచించే వ్యక్తి. ఇలా కొన్ని సున్నిత వ్యవహారాల్లో ఇద్దరికీ చెడింది. ఇది చిలికి చిలికి గాలివానగా మారి, ఇద్దరూ అహానికి వెళ్లారు. ఈ ఫలితంగా కృష్ణారావు తన పదవిని కోల్పోయారు, చంద్రబాబు రాజకీయంగా విమర్శలు ఎదుర్కొన్నారు. అంటే ఇరువురూ నష్టపోయారు. ఇక్కడ ముఖ్య పాయింట్ ఏమిటంటే చంద్రబాబుని వ్యతిరేకించడం వల్ల కృష్ణారావు స్వతహాగానే వైసీపీకి, జగన్ కి దగ్గర అయిపోయారు. ఎన్నికల తర్వాత ఆశించింది దక్కక బిజెపిలో చేరిపోయారు. జగన్ ని, వైసీపీని విమర్శిస్తున్నారు.
ఎల్వీ… ఎక్కడ చెడిందంటే..!
ఇక మరో కీలక అధికారి ఎల్ వి సుబ్రహ్మణ్యం విషయానికి వద్దాం. ఈయన సమర్ధుడు, చాకచక్యంగా వ్యవహరించగల అధికారిగా పేరుంది. టిడిపి ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శిగా పదవి చేపట్టేందుకు ప్రయత్నించారు. బాబు భజన చేశారు కానీ విఫలమైంది. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఎన్నికల సమయానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా వచ్చారు. అంతకుముందు చంద్రబాబుపై వ్యతిరేకత పెరిగింది. అంతకు ఎన్నో ఏళ్ల ముందే జగన్ తో కలిసి ఓ కేసులో ముద్దాయిగా ఉండటం వలన జగన్ కు బాగా దగ్గరయ్యారు. ఆయన రిటైర్ అయ్యే వరకూ అత్యున్నతమైన ప్రధాన కార్యదర్శి కొనసాగాలని ఆశపడ్డారు. కానీ మధ్యలోనే ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ప్రధాన కార్యదర్శి పేరుకు మాత్రమే ఎల్వి ఉండేవారు. కీలక కార్యక్రమానికి సంబంధించి ముఖ్య దస్త్రాలు అన్ని అజయ్ కల్లం చుట్టూ తిరిగేవి. ఈయన హవా ఉండేది. దీంతో ఎల్.వి చిన్న పుచ్చుకునేవారు. ఓ సందర్భంలో క్యాబినెట్ మీటింగ్ జరుగుతున్నప్పుడు “స్థానికులకు 75% ఉద్యోగాలు” అని సీఎం జగన్ ప్రతిపాదించినప్పుడు సుబ్రమణ్యం వ్యతిరేకించారు. చట్టబద్దం కాదని వాదించారు. దీంతో జగన్ ఆగ్రహించి అక్కడే అందరి ముందు ఆ ఫైల్ ని విసిరి కొట్టారు. ఇక్కడితో జగన్ కి, ఎల్వీకి దూరం పెరిగింది. తనకు ప్రాధాన్యత లేదని చట్టప్రకారం ఇబ్బందులు తప్పవని ఎల్వి గ్రహించారు.
ఇదే సమయానికి… సీఎం జగన్ కి ప్రవీణ్ ప్రకాశం బాగా దగ్గరయ్యారు.అప్పటికే సీఎం గా ఎవరు ఉంటే వాడితో బాగా మాట కలిపే ప్రవీణ్ ప్రకాష్ ని సీఎం జగన్ తన ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఇటు అజయ్ కల్లం, అటు ప్రవీణ్ ప్రకాష్ ద్వారా ఎల్ వి సుబ్రహ్మణ్యంకి ఇబ్బందులు తప్పలేదు. ఆ సమయంలో సీఎం జగన్ పంపించిన అనేక ఫైళ్లను ఎల్.వి సంతకం చేయకుండానే తిప్పి పంపించేశారు. సహజంగానే ఇటువంటి విషయాలను సీరియస్ గా తీసుకునే జగన్ అప్పటికప్పుడు ప్రవీణ్ ప్రకాష్ ద్వారా సీఎస్ ని మారుస్తూ ఉత్తర్వులు ఇప్పించారు. హోదాని చూసుకుంటే ఇది సాధ్యపడదు, ఒక రకంగా జరగకూడని వ్యవహారమే. కానీ జగన్ అనుకుంటే, తలచుకుంటే ఏదీ ఆగదు. అప్పట్లోనే ఇది తీవ్రమైన చర్చనీయాంశంగా మారింది. అలా ఎల్వీ దూరమయ్యారు. చివరికి అసలు ఏ హోదా లేకుండానే వారం రోజుల కిందట రిటైర్ అయ్యారు.
అజయ్ కి మధ్యలోనే “కళ్లెం” వేశారు…!
సామాజిక వర్గం కలిసివచ్చే అంశం. సమర్ధత ఉంది. ఈ రెండూ పుష్కలంగా ఉన్న అజయ్ కెల్లం జగన్ ప్రభుత్వంలో అయిదేళ్ళ అల్లుకుపోతారని అందరూ అనుకున్నారు. కానీ ఏడాది తిరగకమునుపే చెడింది. దీనికి కారణం ఆయనపై అభియోగాలే. అజయ్ కెల్లం కూడా చంద్రబాబు హయాంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. రిటైర్ అయిన తర్వాత కృష్ణారావు తరహాలోనే కేబినెట్ ర్యాంకు నామినేటెడ్ ఆశించారు. అది ఇవ్వకపోవడంతో చంద్రబాబుకి వ్యతిరేకంగా మారారు. జగన్ శిబిరంలో చేరారు. నిజానికి జగన్ కు అజయ్ కల్లం రెడ్డికి అంతకుముందు ఎటువంటి సంబంధమూ లేదు. జగన్ తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, కేసులు ఎదుర్కొన్నప్పుడు, జైల్లో ఉన్నప్పుడు, పార్టీ ఆరంభం నుంచి అజయ్ కల్లం నుంచి ఎటువంటి సాయం పొందలేదు. కేవలం చంద్రబాబు వ్యతిరేకంగానే జగన్ కు అనుకూలంగా మారారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కీలకమైన ముఖ్యమైన ముఖ్యమంత్రి సలహాదారుడిగా బాధ్యతలు చేపట్టారు. కానీ ఓ సామాజిక వర్గానికి బాగా సహకరిస్తున్నారని, బిల్లుల విషయంలో వేలు పెడుతున్నారని పుకార్లు రావడంతో జగన్ కు ఈ వ్యవహారాలు నచ్చలేదు. అందుకే ఈయన స్థానాన్ని ధనుంజయ రెడ్డి ఆక్రమించారు. నిజానికి ధనుంజయ రెడ్డి అంత సీనియర్ అధికారి కాదు, కానీ నాడు వైఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈయన కడప జిల్లాలో ఓ గ్రామానికి సర్పంచ్ గా బాగా పని చేశారని పేరుంది. తర్వాత ఐఏఎస్ గా మారడంతో జగన్ కి చేరువయ్యారు. ఎల్.వి కి చెక్ పెట్టే క్రమంలో అజయ్ కెళ్లం, ప్రవీణ్ ప్రకాష్ ఎలా రంగంలోకి దిగారో, ఇక్కడ అజయ్ కల్లంకి చెక్ పెట్టే క్రమంలో ధనుంజయ రెడ్డి కీలకమయ్యారు. ఇప్పుడు కెళ్లం హవా తగ్గింది. అంతా ధనుంజయరెడ్డి హవానే.
పట్టు విడుపు ఉండాలోయ్…!
అలా అలా సీఎం జగన్ తో ముగ్గురు ఐఏఎస్ లకు చెడింది. వీళ్ళు జగన్ తో ముందు నుండి అడుగులు వేసిన వారు కాదు. చంద్రబాబుతో పడక ఇటు వచ్చినవారు. వీళ్ళకి రాజకీయ గొడుగు నీడ కావాలి. జగన్ కి ఇటువంటి వర్గం తోడు కావాలి. కానీ ఎక్కువ కాలం నిలబడలేదు. కారణాలేమైనా ప్రస్తుతం ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని విషయంలో కూడా రెండు వైపులా అసంతృప్తే ఉన్నాయి. కానీ మరో రెండు నెలల్లో పదవీ విరమణ ఉండటంతో ఆమె నెట్టుకొస్తున్నారు. అంటే జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సీనియర్ ఐఏఎస్ ల తో పొసగడం లేదు. ఇదే ప్రస్తుతం రాష్ట్రంలో అత్యున్నత స్థాయిలో జరుగుతున్న చర్చ. ఒక్కటి మాత్రం నిజం. జగన్ లక్ష్యాలు నెరవేరాలి, కోర్టులో ఎదురుదెబ్బలు లేకుండా ఉండాలి అంటే అత్యున్నత అధికారి వర్గం అయిన ఐఏఎస్, ఐపీఎస్ ల విషయంలో ఇరువైపులా రాజీ ఉండాలి. జగన్ దీర్ఘకాలిక లక్ష్యాలతో సీఎం గా పనిచేస్తున్నారు. ముందు చెప్పుకున్నట్టు ఆయనకు ఒక వర్గం మీడియా నుంచి, ప్రతిపక్షాల నుంచి, కేంద్రం నుంచి కూడా సహకారం లేదు. ఆయనకు అండగా నిలవాల్సిన కోర్టుల్లో ఇబ్బందులు రాకుండా చూడాల్సిందే ఐఏఎస్, ఐపీఎస్ లు. అంటే మేధావి వర్గానికి చెందిన వాళ్ళు. జగన్ కూడ మధ్యే మార్గంగా ఆలోచించి, పట్టువిడుపుతో ఉండడం మంచిది. ఇదే సమయంలో ఆ అత్యున్నత అధికారులు కూడా సాధ్యాసాధ్యాలను జగన్ కు వివరించి.., కోర్టులో చిక్కులు రాకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. ఇలా రెండు వైపుల నుంచి పదును తగ్గించుకుని, కలిసి పని చేస్తే లక్ష్యాల దిశగా ముందుకు సాగవచ్చు. లేకుంటే జగన్ కి మచ్చ తప్పదు…, అటు ఐఏఎస్ ల కెరీర్లు ఎల్వి లా మారిపోయే ప్రమాదమూ ఉంది.