వైయస్సార్ చేయూత వారికేనా..కారణమిదేనా
అగ్రవర్ణాల మహిళల్లో పేదలు లేరా..!
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రతిష్ఠాత్మ పధకం వైయస్సార్ చేయూత ప్రారంభించారు. ఆర్దిక సమస్యలు..కరోనా కష్టాల నడుమ ప్రభుత్వ ఖజానా ఖాళీ అయినా..ఇచ్చిన మాట కోసం ఈ పధకం లో తొలి విడత నిధులు ఈ రోజు విడుదల చేసారు. దాదాపు 23 లక్షల మందికి రూ 18,750 చొప్పున ఒక్కొక్కరి ఖాతాలో జమ అయింది. తన ఎన్నికల హామీలో భాగంగా దీనిని అమలు చేస్తున్నట్లు జగన్ చెప్పుకొచ్చారు. అయితే, ఇక్కడే కొత్త సమస్య మొదలైంది. ఈ పధకం అమల్లో అనేక సడలింపులు ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్..ఈ పధకాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకే పరిమితం చేసారు. ప్రభుత్వంలోని ఇతర స్కీంల విషయంలో ఈ రకమైన తేడా లేకుండా అందిస్తున్న సమయంలో..ఈ పధకంలో మాత్రం అగ్రవర్ణాల మహిళలను పరిగణలోకి తీసుకోకపోవటం పైన చర్చ మొదలైంది. వైయస్సార్ హాయంలో పేదరికం అనే ఏకైక నిబంధనతో ప్రభుత్వ పధకాలను అమలు చేసేవారు. ఇప్పుడు జగన్ అగ్రవర్ణ మహిళలను ఈ పధకంలో భాగస్వాములను చేయక పోవటం పైనా… అగ్రవర్ణాల్లో పేద మహిళలు లేరా అనే ప్రశ్న వినిపిస్తోంది. ఇది రాజకీయంగా వైసీపీకీ ఎంతో కొంత నష్టం చేస్తుందా..లేక ఆ వర్గాల మెజార్టీ ఓటింగ్ తనకు దక్కించుకోటంలో భాగంగా ఈ రకమైన నిర్ణయం తీసుకున్నారా..అసలు ఈ నిర్ణయం వెనుక అసలు విషయం ఏంటి…
వైయస్సార్ చేయూత కొందరికేనా…
ముఖ్యమంత్రి జగన్ గతంలో ఇచ్చిన హామీ మేరకు వైయస్సార్ చేయూత ఆవిష్కరించారు. ఈ పధకం ద్వారా ఎస్సీ..ఎస్టీ..బీసీ..మైనార్టీ వర్గాల్లోని 45 నుండి 60 ఏళ్ల మధ్య వయస్సు గల పేద మహిళలకు ఈ పధకానికి లబ్ది దారులుగా ఎంపిక చేసారు. దాదాపు 23 లక్షల మంది ఈ పధకానికి అర్హులుగా తేల్చారు. అర్హత ఉండీ ఎంపిక కాని వారికీ ప్రభుత్వం మరో అవకాశం లభించింది. ఏపీ ఆర్దిక పరిస్థితులు సహకరించక పోయినా..రెవిన్యూ వసూళ్లు పూర్తిగా పడిపోయినా..ఇచ్చిన హామీల అమలు విషయంలో మాత్రం జగన్ ముందుకే వెళ్తున్నారు. అందులో భాగంగా అయిదేళ్ల కాలంలో ఈ వర్గాలకు చెందిన ఒక్క పేద మహిళకు 75 వేల రూపాయల ఆర్డిక సాయం అందించటం ముఖ్యమంత్రి జగన్ లక్ష్యం. అందులో భాగంగా తొలి విడతగా ఒక్కొక్కరికి రూ 18,750 చొప్పున ఒకేసారి ఈ 23 లక్షల మంది బ్యాంకు ఖాతాల్లో జమ చేసారు. ఈ పధకం లో మరిన్ని వెసులుబాట్లు కల్పించారు. ప్రభుత్వ పెన్షన్ పొందుతున్న ఈ వర్గాలకు చెందిన మహిళలు లబ్దిదారులుగానే గుర్తిస్తున్నారు. ఈ సొమ్ము ద్వారా మహిళలు స్వయంగా వ్యాపారం చేసుకొనే అవకాశాలను సైతం ప్రభుత్వమే కల్పిస్తోంది. ఇదంతా బాగానే ఉన్నా..ఒకే అంశం ఇప్పుడ కొందరు మహిళల్లో జగన్ నిర్ణయం పైన ఆక్రోశం వెల్లగక్కుతున్నారు. ఈ వర్గాలకు ఈ పధకం అమలు చేస్తున్న జగన్.. అగ్రవర్ణ మహిళలను మాత్రం ఎందుకు పక్కన పెట్టారనేది వారి ప్రశ్న. అగ్రవర్ణాల్లోనూ పేద మహిళలు ఉన్నారని వారు గుర్తు చేస్తున్నారు. అయితే, దీనికి వైసీపీ నేతల నుండి సమాధానం లేదు.
జగన్ అసలు లక్ష్యం అదేనా…!
ఇప్పటికే 60 ఏళ్లు దాటిన ప్రతీ ఒక్కరికీ రూ 2,250 చొప్పున ప్రభుత్వం ఒకటో తేదీనే అందిస్తోంది. ఇప్పుడు 45 నుండి 60 ఏళ్ల మధ్య వయసు గల పేద మహిళలకు ఈ పధకం ద్వారా భారీ ప్రయోజనం అందిస్తోంది. అయితే, దీనిని అగ్రవర్ణ పేద మహిళలకు ఇవ్వకపోవటం వెనుక రాజకీయంగా వ్యూహం ఏంటనే చర్చ మొదలైంది. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజునే ప్రతీ పధకం అర్హులైన ప్రతీ లబ్దిదారునికి అందాలని..తనకు ఓటు వేయని వారికి సైతం అందేలా పాలన చేస్తామని ప్రకటించారు. కానీ, ఈ వైయస్సార్ చేయూతలో మాత్రం అగ్రవర్ణ పేద మహిళలను పక్కన పెట్టారు. గతంలో వైయస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏ పధకానికి అయినా పేదరికమే అర్హతగా అన్ని స్కీంలను అమలు చేసారు. అయితే, జగన్ ఇప్పుడు ఈ రకమైన నిర్ణయంలోనూ రాజకీయ వ్యూహం ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
తొలి నుండి వ్యూహాత్మకంగానే…!
ముఖ్యమంత్రి తన కేబినెట్ లో ఎస్సీ..ఎస్టీ..బీసీ..మైనార్టీ లకు ఉప ముఖ్యమంత్రులు ఇచ్చి రాజకీయంగా షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. అదే విధంగా ప్రభుత్వ పదవుల్లోనూ ఈ వర్గాలకి 50 శాతం కేటాయించారు. మహిళలకు అందులో 50 శాతం అమలు చేయాలని డిసైడ్ అయ్యారు. ఇక, ఇప్పుడు ఆ వర్గాల ఓట్ బ్యాంక్..ప్రధానంగా మహిళలను ఆకర్షించేందుకు ఆ వర్గాలకు తాను ఇచ్చే ప్రాధాన్యత ఏంటనేది వివిరస్తూనే..గతంలో తాము ఏం నష్టపోయామనే విషయం తెలిసేలా జగన్ ఈ పధకం ఎస్సీ..ఎస్టీ..బీసీ..మైనార్టీ వర్గాలకే అమలు చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. అగ్రవర్ణాల్లోని పేదలకు వారి కార్పోరేషన్ల ద్వారా సాయం అందిస్తున్న విషయం వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. అయితే, ఓట్లు పరంగా ఈ నాలుగు వర్గాలకు చెందిన ఓట్ బ్యాంక్ ఎక్కవ కావటంతో..వ్యూహాత్మకంగానే వారికి మరంతగా దగ్గరయ్యేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. మరి..ఈ నిర్ణయం నిజంగా జగన్ అంచనా వేస్తున్నట్లుగా పూర్తిగా ప్రయోజనం చేకూరుస్తుందా..లేక అగ్రవర్ణాల మహిళల్లో మరో రకమైన చర్చకు కారణమవుతుందా అనేది వేచి చూడాల్సిందే.