అమరావతికి కావచ్చు.., విశాఖకు కావచ్చు… మొత్తం రాష్ట్రానికే కావచ్చు…! కొత్త పరిశ్రమల విషయంలో హైదరాబాద్ నుండి నిత్యం పోటీ ఉంటుంది.
గడిచిన ఐదేళ్లలో కియా, mi వంటి పరిశ్రమలను తీసుకువచ్చి… కొంచెమైనా ఫలితం చూపిన చంద్రబాబుకి సాటిగా జగన్ మార్కు పాలన చూపించాలంటే రానున్న మూడేళ్ళలో రాష్ట్రంలో కనీసం మూడు కొత్ భారీ పరిశ్రమలు రావాల్సి ఉంది. ఏవ్ ప్రస్తుతం చర్చలు దశలోనే ఉన్నాయి. గడిచిన ఏడాదిలో ఒక్క పెద్ద పరిశ్రమ కూడా లేకపోవడం జగన్ కి పెద్ద లోటుగానే ఉండనుంది.
ఏపీ ప్రభుత్వం కీలక అడుగులు వేసింది. పారిశ్రామికీకరణ.., యువతకు నైపుణ్యం.., ఉపాధి అంశాలపై కొత్త అడుగులు వేసింది. రానున్న మూడేళ్లకు సంబంధించి “పారిశ్రామిక పాలసీ”ని ప్రకటించింది. నిజానికి గతం కంటే గొప్పగా…, చాల అత్యున్నతమైన అంశాలు దీనిలో ఉన్నాయి. ఈ అంశాల్లో కనీసం సగం పూర్తిగా అమలు జరిగినా మంచి ఫలితాలు సాధ్యమవుతాయి…!!
2020-23పాలసీతో సుస్థిర పారిశ్రామికీకరణకు అడుగులు
రాష్ట్ర యువత, విద్యార్ధి.., పారిశ్రామిక లోకం ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న “పారిశ్రామికాభివృద్ధి విధానం 2020-23” ను రాష్ట్ర మంత్రి గౌతమ్ రెడ్డి, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా ఈరోజు ఆవిష్కరించారు. “పారిశ్రామిక వేత్తలుగా మహిళలు ఎదిగేందుకు, అన్ని సామాజిక వర్గాలు, ప్రాంతాలు అభివృద్ధిని కాంక్షించేలా కొత్త ఇండస్ట్రియల్ పాలసీ సరికొత్తగా రూపొందించబడిందని వారు పేర్కొన్నారు. పారిశ్రామిక, విద్యా, ఆర్థిక, వాణిజ్య వేత్తల సమక్షంలో మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయం వేదికగా సోమవారం కొత్త పారిశ్రామిక విధానం విడుదలైంది.
కొన్ని ఆసక్తికర విషయాలు…!
అన్ని ప్రాంతాల, సమగ్రాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం నిర్దేశించుకున్న కొత్త పారిశ్రామిక అభివృద్ధి విధానం సమానవృద్ధికి దిక్సూచిగా మారనుంది. పారిశ్రామిక ప్రపంచంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు వెన్నుదన్నుగా, వాణిజ్య ఖర్చును తగ్గించే వినూత్న పద్ధతులను అవలంబించనుందీ పాలసీ. 30 నైపుణ్య కళాశాలలను, 2 నైపుణ్య విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేసి యువతీ, యువకులను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దడం, పారిశ్రామికవేత్తలుగా మలచడం, ఉన్నతమైన జీవన ప్రమాణాలను సృష్టించడం వంటి కీలక విషయాలపై పారిశ్రామిక అభివృద్ధి విధానం దృష్టిసారించనుంది. పారిశ్రామికరంగంలో కీలకమైన ఔషధ,జౌళి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, పెట్రో కెమికల్ రంగాలతో పాటు కళాత్మక బొమ్మల తయారీ(టాయ్స్), గృహోపకరణాలు (ఫర్నిచర్), ఫుట్ వేర్,లెదర్, మెషినరీ, పనిముట్ల తయారీ,ఏరోస్పేస్, రక్షణ రంగాలలో పెట్టుబడులను ఆకర్షించే ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ పాలసీ 2020-23 అనుకున్నట్టు అమలైతే మాత్రం భవిష్యత్ లో ఆంధ్రప్రదేశ్ ను ప్రత్యేకంగా నిలబెట్టడం ఖాయం.
అన్ని రంగాలకు పెద్ద పీట…!
సహజ వనరులైన సుదీర్ఘ తీర ప్రాంతం, నిరంతర విద్యుత్ సరఫరా, నీరు, మౌలిక వసతులు, అన్ని ప్రాంతాలతో మన రాష్ట్రం అనుసంధానంగా ఉండడం ఆంధ్రప్రదేశ్ కు రాష్ట్రానికి ఓ వరం. అంతేకాకుండా మౌలిక సదుపాయాలైన విమానాశ్రాయాలు, పోర్టులు సమృద్ధిగా ఉండడం, అపార నైపుణ్యం కలిగిన మానవవనరులు మరో బలం. రాష్ట్రంలో పరిశ్రమలను స్థాపించడానికి, పర్యావరణంపై ప్రభావాన్ని తగ్గించడానికి ‘ప్రమాద రహిత(Investment-friendly) -స్నేహపూర్వక వాతావరణాన్ని(Friendly Environment) అందించడానికి పారిశ్రామిక జోనింగ్ ను అమలు చేయాలని పారిశ్రామిక విధానం 2020-23 సంకల్పించింది. ఒక ప్రత్యేక పద్ధతిలో ‘లీజు కమ్ బై ఔట్’ నమూనాలో భూ కేటాయింపు ఇవ్వనుంది.
పెట్టుబడిదారుల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని “వైయస్ఆర్ ఏపీ వన్” పేరుతో బహుముఖ వ్యాపార కేంద్రానికి శ్రీకారం చుట్టింది. దీని ద్వారా పెట్టుబడిదారులకు పూర్తి కాలం తోడ్పాటు అందించడమే చెక్కు చెదరని ఉక్కుసంకల్పం. ఇన్వెస్టర్ ఫెసిలిటేషన్, మార్కెట్ రీసెర్చ్, మార్కెటింగ్, బ్రాండింగ్, సేల్స్ సపోర్ట్, ప్రోత్సాహక నిర్వహణ మరియు స్పెషల్ కేటగిరీ సేల్ వంటి సేవలను విరివిగా అందించడానికే ‘వైయస్ఆర్ ఏపి వన్’ సెల్ ఏర్పాటుకు మూలకారణం. పెట్టుబడిదారులకు ఆద్యంతం అవసరం మేరకు మద్దతు అందిస్తూ పెట్టుబడులకు అవాంతరాలు లేకుండా పాలసీకి మూలస్తంభమైన పరిశ్రమల స్థాపనకు కృషి.
అమలులో అధికారుల పాత్ర కీలకం…!!
అయితే ఈ పారిశ్రామిక విధానాలు ప్రకటించడానికి ఆసక్తిగా ఉంటాయి. ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలాగా… పారిశ్రామిక విధానాలు కూడా ఆసక్తిగా ఉంటాయి. మేనిఫెస్టో అమలు చేస్తేనే పార్టీపై ప్రజలకు నమ్మకం కుదురుతుంది… అదే తరహాలో ఈ పారిశ్రామిక లక్ష్యాలను అమలు చేసి, విధానాలకు న్యాయం చేస్తేనే పాలసీలో పేర్కొన్న అంశాలు ఆచరణలోకి వస్తాయి. అప్పుడే ఈ ఫలితాలు రాష్టానికి దక్కుతాయి.