ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ని బదిలీ చేయిస్తారా…!? సీఎం జగన్ దర్శకత్వంలో వైసీపీ బృందం ఒకటి ఇదే పనిలో ఢిల్లీలో ఉందా..? కేంద్ర బీజేపీ పెద్దలను త్వరలో జగన్ కూడా కలిసి దీన్ని పూర్తి చేయనున్నారా..!? ఏమో.., సీపీఐ నారాయణ వ్యాఖ్యలు చూస్తే అలాగే ఉన్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి. అదే నిజమైతే ఏపీలో మరో “న్యాయ – రాజకీయ” వివాదం ఆవిష్కృతమైనట్టే..!!
నారాయణ ఏమన్నారంటే..!!
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ నిన్న మాట్లాడుతూ “ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మహేశ్వరిని బదిలీ చేయించడానికి ఏపీ ప్రభుత్వం కుట్ర చేస్తుంది. సీఎం జగన్ ఈ విషయంపై కేంద్రంలో లాబీయింగ్ నడిపిస్తున్నారు. త్వరలో ఢిల్లీ వెళ్లి, బీజేపీ పెద్దలను కలవనున్నారు” అన్నారు. ఇది అతి పెద్ద ఆరోపణ. ఇప్పటికే రెండు నెలల కిందట సీఎం జగన్ సుప్రీంలో సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణపై పలు ఆరోపణలు చేస్తూ లేఖ రాశారు. దానిపై ఎటువంటి అడుగులు పడనీ నేపథ్యంలో.. ఇప్పుడు హైకోర్టు సీజేని బదిలీ చేయించాలని చూడడం.. రాజకీయంగా సంచలనం కలిగించే అంశమే. అయితే నారాయణ దీనిపై లోతుగా మాట్లాడలేదు. జస్ట్ ఒక చురక అంటించి వదిలేశారు. కానీ..!
సీజేని బదిలీ చేయించడం సాధ్యమేనా..!?
ఒక హైకోర్టు చీఫ్ జస్టిస్ ని ఒక సీఎం అనుకుంటే బదిలీ చేయించడం సాధ్యమేనా..!? ముమ్మాటికీ అసాధ్యమే. కానీ.., కేంద్రం మద్దతు ఉంటె, కేంద్ర పెద్దల ఆశీస్సులు ఉంటె సాధ్యమే. అందుకే ఆ మద్దతు, ఆ ఆశీస్సులు పొందడానికే సీఎం జగన్ ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు అనేది ఒక ఆరోపణ. ఈ సాధ్యాసాధ్యాలు చర్చించే ముందు కొన్ని కీలక పాయింట్లు చెప్పుకోవాలి..!
* బీజేపీ ఏపీలో రాజకీయంగా ఎదగాలి అనుకుంటుంది. ఈ సమయంలో సీఎం జగన్ కోరినట్టు.., ఆయన నిర్ణయానికి అనుగుణంగా హైకోర్టు చీఫ్ జస్టిస్ ని బదిలీ చేయించడానికి ఎందుకు ఒప్పుకుంటుంది..!?
* అమరావతి కేసులో వాదనలు ప్రస్తుతం కీలక దశలో ఉన్నాయి. బీజేపీ కూడా అమరావతికి అనుకూలమే అంటుంది. అమరావతి అంశంలో మొదటి నుండి జేకే మహేశ్వరీ ఫాలో అవుతున్నారు. దీంతో పాటూ మరిన్ని కీలక కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ దశలో బదిలీ చేస్తే అది రాజకీయ బదిలీగానే ఉంటుంది. అంటే ఆ మచ్చ బీజేపీపై పడుతుంది. బీజేపీ అమరావతి విషయంలో పెద్ద డ్రామా ఆడిందని.., రాజధాని గొడవలో బీజేపీ బలవుతుంది.
* అన్నిటి కంటే ముఖ్యంగా ఏపీలో అనేక కేసుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వస్తున్నాయి. సీఎం జగన్, ప్రభుత్వం కోర్టుని, కొందరు న్యాయమూర్తులను టార్గెట్ చేస్తున్నారు. ఒకరకంగా కోర్టులు ప్రస్తుతం ఏపీని నియంత్రిస్తున్నాయి. (బీజేపీ దేశంలో వ్యవస్థలను ఎలా మేనేజ్ చేస్తుందో తెలుసుకుంటే.. ఈ పాయింట్ ద్వారా కీలక విషయం గ్రహించవచ్చు) కోర్టులకు కూడా కొన్ని అవకాశాలను ప్రభుత్వమే ఇస్తుంది. ఈ సమయంలో దొరికిన జగన్ ని వదిలేసి.., జగన్ కోరినట్టు చీఫ్ జస్టిస్ ని మారిస్తే జగన్ బీజేపీ నియంత్రణలో ఎక్కడ ఉంటారు..!? అందుకే..! బీజేపీ ఈ విషయంలో చాల జాగ్రత్తగా ఉంటుంది.
* ఇక్కడ జగన్ తరపున ఆలోచిస్తే ఒకే ఒక్క పాయింట్..! మూడు నెలల కిందట రాజ్యసభలో వ్యవసాయ బిల్లుల ఆమోదం సందర్భంగా వైసీపీ ఆ బిల్లుకి గుడ్డిగా మద్దతిచ్చింది. విజయసాయిరెడ్డి ఆ బిల్లుకి అనుకూలంగా మాట్లాడుతూ బీజేపీ భజన చేశారు. కాంగ్రెస్ ని తిట్టిపోశారు. కానీ అదే బిల్లుని వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న ఆందోళనలకు వైసీపీ మద్దతు ఇచ్చింది. ఇక్కడ కేంద్రానికి వైసీపీతో ఉన్న అవసరాలు, బీజేపీకి ఏపీలో తీరాల్సిన రాజకీయ అవసరాలు… ఈ రెండు అంశాలను క్షుణ్ణంగా స్టడీ చేసి.. బీజేపీ ఒక నిర్ణయం తీసుకుంటుంది. సో.. రాయి వాళ్ల చేతిలోనే, కొట్టేది వాళ్ళే..!!