వంశీ వస్తేనేమి… రాకపోతేనేమి..! బలరాం లాంటి వాళ్ళు చేరితేనేమి, చేరకపోతేనేమి…? గంటా చేరికతో వైసిపికి ఒరిగేదేంత…?? ఇవన్నీ జగన్ కి ఒక చిన్న భాగం మాత్రమే. జగన్ ఇవేమి పట్టవు. “వస్తారా…? ఒకే రండి, ఒక మూల జాగ్రత్తగా ఉండండి. తోక జాడిస్తే కత్తిరిస్తా” అనే రకం జగన్. జగన్ టార్గెట్ వేరు, జగన్ లక్ష్యం వేరు…! అదే చంద్రబాబుని మాజీ ఎమ్మెల్యేని చేయడం. ప్రస్తుతానికి చంద్రబాబుని మాజీ ముఖ్యమంత్రిగా మార్చిన జగన్ ఇక బాబీని మాజీ ఎమ్మెల్యేగా మార్చడానికి సుదీర్ఘ వ్యూహాన్ని రచించి, అమలు చేస్తున్నారు. “కుప్పం”లో బాబుని ఓడించడానికి పావులు కదుపుతున్నారు.
ఆపరేషన్ “కుప్పం” మొదలు…!
ఎస్.., ఆపరేషన్ కుప్పం మొదలయింది. ఇక్కడ పావులు వేసేది సీఎం జగన్… అక్కడ అమలు చేసేది మంత్రి పెద్దిరెడ్డి. బలంగా, జాగ్రత్తగా, వ్యూహాత్మకంగా.., దశలవారీగా వెళ్తున్నారు. వారం కిందట మొదలైన ఈ ప్రక్రియ నెమ్మదిగా.., 2023 వరకు కొనసాగుతుంది. “ఒక మహా వృక్షాన్ని నరకాలంటే.. ముందుగా చిన్న కొమ్మలు.., చిన్న ఊడలు.. మొదలుకుని తర్వాత పెద్ద కొమ్మలు, పెద్ద ఊడలు… ఆపై మొదలు నరికి, చివరిగా వేర్లు పీకేయాలి. అదే ఇప్పుడు జగన్ అమలు చేస్తున్న పధ్ధతి. ఆరు దశల ఈ ప్రక్రియలో ఇప్పుడు మొదటి దశను అమలు చేస్తున్నారు.
ఇదే ప్రణాళిక..! అవసరం మేరకు మార్పులు…!
ఆరు దశల్లో కుప్పంలో చంద్రబాబు హవా తగ్గించాలి. 2024 ఎన్నికల్లో ఆయన్ను ఓడించాలి. అందుకు
* కుప్పంలో మండలాలు వారీగా చంద్రబాబుకి నమ్మకంగా ఉంటూ.., బాబు లేకున్నా పార్టీని, ఎన్నికలను నడిపిస్తున్న నాయకులను లాగెయ్యడం మొదటి దశ. సామజిక వర్గాల వారీగా కీలక నాయకులకు వైసిపిలో చేర్చుకోవడం.
* మూడు దశాబ్దాలుగా చంద్రబాబుకి అత్యంత నమ్మకంగా కుప్పంలో పని చేస్తున్న నాయకులకు గాలం వేయడం. వారికి అడిగినవి ఇచ్చి పార్టీలో చేర్చుకోవడం.
* ఈ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే 350 ముస్లిం, బీసీ కుటుంబాలను వైసిపిలో చేర్చుకున్నారు. వీరిలో బాబుకి బాసటగా నిలిచినా ప్రాంతాల వారున్నారు.
* ఇక బూతుల వారీగా బాబుకి అత్యంత బలంగా ఉన్న శ్రేణులను చెల్లాచెదురు చేయడం. బాబుకి ఉన్న తమిళ ఓట్లు తొలగించడం.., అవసరమైతే వైసిపి అనుకూల ఓట్లను చేర్చడం… ఇలా పక్కదారిలోకి వెళ్లేందుకు కూడా సిద్ధమే.
* మరో దశలో భాగంగా కుప్పంలో జగన్ ఓ బహిరంగ సభ నిర్వహించి, వరాల జల్లులు కురిపించి, 2024 నాటికి ఒక పెద్ద ప్రాజెక్టు ఇచ్చి ఫలితం చూపించడం. ఇక ఆ నియోజకవర్గంలో ఎక్కువ ఓట్లున్న బీసీ సామజిక వర్గ నాయకులకు రాష్ట్ర స్థాయిలో పదవులు ఇచ్చి వచ్చే ఎన్నికల నాటికి కీలకం చేయడం..! ఇలా అనేక ఎత్తులు ఉన్నాయి. ప్రస్తుతానికి మాత్రం పార్టీలో చేరికలు మాత్రమే అయ్యాయి. దీన్ని ప్రస్తుతానికి చంద్రబాబు లైట్ తీసుకుంటున్నారు. తన బలం అక్కడ తగ్గదని ధీమాలో బాబు ఉన్నారు.