Corona Vaccine: దేశంలో కరోనా విజృంభిస్తుంది. రోజుకి మూడున్నర లక్షల కొత్త కేసులు వస్తున్నాయి. ఆసుపత్రులు నిండుతున్నాయి.బెడ్లు దొరకడం లేదు. ఆక్సిజన్ అందడం లేదు. ఈ సమస్యకు ఒక్కటే పరిష్కారం వెతికి కేంద్రం చేతులు ముడుచుకుంది. అదే వాక్సిన్ సరఫరా. దేశంలో 18 ఏళ్ళు నిండిన అందరికీ రెండు డోసులు వాక్సిన్ వేసేస్తే కరోనా రాదూ.., వచ్చినా ఏమి కాదు అనే ధీమాతో కేంద్రం ఉంది. ఏమో అక్కడి వరకు బాగానే ఉంది. కానీ.. దేశంలో అందరికీ కావాల్సిన వాక్సిన్లు అందుబాటులో ఉన్నాయా..!? దేశం వరకు ఎందుకు తెలుగు రాష్ట్రాల్లో 18 ఏళ్ళు నిండిన అందరికీ వాక్సిన్లు అందించే స్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయా..!? ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది..! అనేది ఓ సారి లోతుగా చూద్దాం..!
Corona Vaccine: తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఇదీ..!!
దేశంలో కరోనా వాక్సిన్లు గత ఏడాది డిసెంబర్ చివరి నుండి అందుబాటులోకి వచ్చాయి. మొదటి మూడు వారాలు వాక్సిన్ పై అపనమ్మకం.., భయం.., అపోహలతో ఫ్రంట్ లైన్ వారియర్లు కూడా వేసుకోలేదు. కానీ క్రమేణా వాటి పనితీరు తెలిసాక ఫ్రంట్ లైన్ వారియర్లకు వేశారు. ఆ తర్వాత 45 ఏళ్ళు నిండిన వారికి వేశారు. రెండు తెలుసు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు దాదాపుగా కోటి మందికి పైగా వాక్సిన్లు వేశారు. ఏపీలో 62 లక్షల మందికి, తెలంగాణాలో 45 లక్షల మందికీ పూర్తి చేశారు. వీరిలో దాదాపు 55 శాతం మందికి మొదటి డోస్ మాత్రమే పూర్తయింది. రెండో డోసు వేయలేదు.
8 కోట్ల డోసులు ఎప్పుడివ్వగలరు..!?
నిన్నటి నుండి దేశ వ్యాప్తంగా 18 ఏళ్ళు నిండిన వారికి నమోదు ఆరంభమయింది. మే ఒకటో తేదీ నుండి వాక్సిన్లు వేస్తారు. బాగానే ఉంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో వాక్సిన్లు అందుబాటులో లేవు. ఇప్పటికే 45 ఏళ్ళు నిండిన వాళ్లకి మొదటి డోసు వేసి, రెండో డోసు కోసం వేచి చూస్తున్నారు. ఇక ఈ 18 ఏళ్ళు నిండిన వారికి ఇప్పుడే వచ్చే అవకాశమే లేదు. రెండు రాష్ట్రాల్లో సుమారుగా 8 కోట్ల దోషుల వాక్సిన్ అవసరం ఉంది. ఏపీకి నాలుగున్నర కోట్లు డోసులు.., తెలంగాణాకి మూడున్నర కోట్ల డోసులు అవసరం ఉంది. ఇవి వస్తేనే యువకులకు వాక్సిన్ ప్రక్రియ ప్రారంభించగలరు. అయితే ఇవి ఈ నెల రోజుల్లో వచ్చే ఆవకాశమే లేదు. ఏపీ నుండి కోవిషీల్డ్, కోవక్జిన్ ఇద్దరికీ ఇండెంట్ లు వెళ్లాయి. మే నెలలో పంపించాలని వెళ్లాయి. కానీ వాటికి ఉన్న డిమాండ్ దృష్ట్యా అప్పుడే అందే అవకాశమే లేదు. జూన్ నెల మొదటి వారంలో వచ్చే వీలుంది అంటున్నారు. అదే జరిగితే ఏపీలో జూన్ పదో తేదీ తర్వాత నుండి వాక్సిన్లు వేస్తారు. అప్పటికీ రాకపోతే జులై వరకు ఆగాల్సిందే. ఈ లోగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఆగాల్సిందే.
మన దగ్గరే తయారీ అయినా ఎందుకు ఈ పరిస్థితి..!?
టీకాలు రెండూ మన దేశంలోనే తయారవుతున్నాయి. కానీ ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అనేది ఒక సగటు మనిషి అనుమానం. దానికీ సమాధానాలున్నాయి. కరోనా టీకాలు గత ఏడాది డిసెంబర్ నాటికి అన్ని ట్రయల్స్ పూర్తి చేసుకుని ఉత్పత్తి ఆరంభమయింది. నెమ్మదిగా ఒక్కో దశ వేసుకుంటూ వస్తున్నారు. అప్పటికి కరోనా రెండో దశ వస్తుందని.. దేశాన్ని అల్లకల్లోలం చేస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. అందుకే డిమాండ్ ఇంతగా లేదు. వాక్సిన్ లపై ఎవ్వరూ ఆసక్తి కూడా చూపలేదు. మార్చి వచ్చే సరికి డిమాండ్ పెరిగింది. కరోనా రెండో దశ విజృంభణతో ఆ ఉత్పత్తి కంపెనీలకు డిమాండ్ పెరిగింది. అప్పటి వరకు రోజుకు లక్ష డోసులు ఉన్న ఉత్పత్తి కాస్తా ప్రస్తుతం వారానికి రెండు కోట్లు వరకు చేరింది. గడిచిన నెల రోజుల్లో వాక్సిన్ పై అవగాహన పెరగడం.. కరోనా రెండో దశ విజృంభించడం.. డిమాండ్ విపరీతంగా పెరగడంతో ఉత్పత్తి వేగం పెరిగింది. ఇదే సమయానికి ఆ కంపెనీలకు కేంద్రం విధించిన షరతుల గడువు పూర్తయింది. అంటే ఏప్రిల్ 15 వరకు ఆ కంపెనీలు ఉత్పత్తి చేసే ప్రతీ వాక్సిన్ కేంద్రానికి ఇవ్వాలి. ఏప్రిల్ 15 తర్వాత నుండి ఈ షరతు లేదు. వాటి ఉత్పత్తిలో సగం బయటకు అమ్ముకోవచ్చు. సగం కేంద్రానికి ఇవ్వాలనే షరతు ఉంది. సో… ఈ డిమాండ్, ఈ ఉత్పత్తి ఆధారంగా తెలుగు రాష్ట్రాలకు జూన్ నాటికి చేరుకునే వీలుంది అనేది ఒక అంచనా..!