పార్టీ నాయకుడికి, కార్యకర్తలకు ఉండే సంబంధం ఎలా ఉండాలి అంటే రాముడు, హనుమంతుడుకు ఉన్న సంబంధంలా ఉండాలి. చూసి రమ్మంటే కాల్చి రావాలి. రక్షించుకు రమ్మంటే కొండనైనా ఎత్తి తీసుకురావాలి. జనసేన పార్టీలో నాయకుడికి సైనికులు ఎన్ని చెప్పుకునే అభిమానులకు ఉండే సంబంధం దీనికి భిన్నంగా కనిపిస్తుంది. చూసి రమ్మంటే లంకను కాల్చాల్సింది పోయి… అయోధ్యకు నిప్పు పెడుతుంటే, సంజీవని కోసం వెతకండి అంటే… ఎందుకు వెతకాలి.. ఎప్పుడు వెతకాలి… దేనికోసం వెతకాలి అంటూ అధినేతనే ఎదురు ప్రశ్నించి ఇబ్బంది పెడుతున్నారు. కిందిస్థాయి కార్యకర్త నుంచి జనసేన పార్టీలో పవన్ తీసుకునే నిర్ణయాల పట్ల ప్రతిసారి ఎదురుప్రశ్నలు.. సోషల్ మీడియాలో రచ్చ చేయడం వల్ల ఆ పార్టీ పరువు బజారున పడుతుంది. అధినేత మాటలు, నిర్ణయాలే పట్టవు అనే కోణంలో ప్రజల్లో అభిప్రాయం కలుగుతుంది. ఇది పార్టీ మనుగడకే ప్రమాదం. తాజాగా గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ నుంచి విరమించుకోవడాన్ని రాజకీయ ప్రత్యర్థుల కంటే జనసేన కార్యకర్తలే తప్పు పడుతూ ఇష్టానుసారం రచ్చ చేయడం, దాన్ని చూస్తూ ప్రత్యర్ధులు ఆనందం పడటం తాజా తప్పిదం.
కొత్త కాదు.. ప్రతిసారి రచ్చే
జనసేన పార్టీలో కార్యకర్తలు అధినేత నిర్ణయాలను బహిరంగంగా తప్పు పట్టడం కొత్తేమి కాదు. ప్రతిసారి ఏదో ఒక రచ్చ చేయడం అలవాటుగా మారింది. ఇటీవల మంగళగిరి పార్టీ కార్యాలయ సమావేశంలో సైతం సోషల్ మీడియాలో ప్రతిసారి ఏబెరు పడితే వారు మాట్లాడొద్దని, పార్టీ నిర్ణయాలు నచ్చకపోతే వెళ్లిపోవచ్చని చెప్పారు. అయినా కార్యకర్తల్లో మాత్రం మార్పు లేదు. చేతిలో సెల్ ఫోన్ ఉంటె, ఏదైనా అనిపిస్తే వెంటనే ఫేస్ బుక్ లైవ్ లు, యూట్యూబ్ హంగామాలు చేయడం ఆ పార్టీ కార్యకర్తలకు అలవాటుగా మారింది.
* పార్టీలో కాస్త యాక్టీవ్ గా తిరిగే వారంతా 20 నుంచి 30 ఏళ్ల లోపున్న యువతరం అధికం. వీరిలో ఆవేశ పాళ్ళు ఎక్కువ. దీనితోపాటు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటున్నారు. ఏదైనా పవన్ నిర్ణయం అప్పుడు సోషల్ మీడియాలో వచ్చే ప్రశ్నలు, వెతకటానికి వీరు అతిగా స్పందిస్తూ ప్రత్యర్థులకు అస్త్రంగా మారుతున్నారు.
* ప్రత్యామ్నాయ రాజకీయాలు కోరుకునే వారు, దానికి పవన్ సమాధానం అవుతాడని నమ్మేవారు జనసేనలో ఎక్కువ. వీరు మానసిక సంఘర్షణలో పవన్ ఏ మాత్రం చిన్న తప్పు చేస్తున్నట్లు కనిపించిన వెంటనే వీరంతా ఆయననే ప్రశ్నిస్తున్నారు. అధినేత ఎదో ఒక వ్యూహం తో ముందుకు వెళ్తున్నారు అని ఆ పార్టీ కార్యకర్తలే నమ్మడం లేదు.
* మీడియా సహకారం లేదు అని ఒక ముద్ర వేసుకున్నారు తప్పితే, దాన్ని ఎలా అధిగమించాలి అనే దాని పై ద్రుష్టి లేదు. ఫలితంగా మెయిన్ స్ట్రీమ్ మీడియాను పక్కన పెట్టి, కనీసం చేసే కార్యక్రమాలకు మీడియాను దూరం చేసి, కేవలం సోషల్ మీడియాను మాత్రమే నమ్ముకుంటున్నారు. దీని వల్ల ఎక్కువ మందికి వీరి కార్యక్రమాలు తెలియడం లేదు.
* రాకీయాలను ఎదుర్కోవడం లో కొత్త వ్యక్తులు కావడం, పార్టీకి సరైన స్ట్రెక్చర్ లేకపోవడం, అజమాయిషీ కరువు కావడంతో చాలామంది పార్టీ పేరుతో నిత్యం సోషల్ మీడియాలో ఎదో ఒక చర్చకు తెరలేపుతున్నారు.
* పార్టీ లో వేగంగా ఎదగాలని, పార్టీ తీరు తాము ఉహించుకున్నట్లు ఉండాలని కోరుకున్న యువతరం లేని పోనీ అంశాలను హైలైట్ చేస్తున్నారు. పార్టీలో ఎవరి పని ఎవరు చేసుకోకుండా నన్ను ఫలానా వారు అవమానించారు, ఫలానా వారు అధినేత వరకు వెళ్లకుండా చేస్తున్నారు అనే దానిపై నిరంతరం ఫిర్యాదులు వస్తున్నాయి.
* అధినేతను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారు అని, సినిమాలు చేసుకుంటే పార్టీ నడపడం ఎలా అని, బీజేపీ వల్ల జనసేనకు నష్టం అని, కాపు ముద్ర అంటూ ప్రతిసారి ఆ పార్టీలోని కార్యకర్తలే నానాయాగీ చేస్తూ పార్టీను రోడ్డు మీదకు తెస్తున్నారు.
(చివరిగా…. జనసేన పార్టీను హనుమంతుడిలా కార్యకర్తలు అధినేతకు సహకరించి, ఆయన తీసుకునే నిర్ణయాలను గమనించి తగు విధంగా ముందుకు సాగితేనే ఆ పార్టీ ఒక క్రమంలో ముందుకు వెళ్తుంది. మనుగడ ఉంటుంది. అప్పుడే కార్యకర్తలకు తగిన గుర్తిపు ఉంటుంది.. హనుమంతుడిలా బలం పెరుగుతుంది.)