మనిషన్నాక కొన్ని వీక్నెస్సులు ఉంటాయి. వాటిని సొంతంగా ఉంచాలే తప్ప బయటకు తేలినీయకూడదు..! కానీ రాజకీయాల్లో అలా కుదరదు. రాజకీయాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తుల వీక్నెస్సులు బయటకు తెలిస్తే ఎవరెవరు ఎలా వాడేస్తారో తెలియంది కాదు..!! ఇప్పుడు ఏపీ సీఎం జగన్ కి అటువంటి చిక్కే వచ్చి పడింది. ఆయన వీక్నెస్ తో పార్టీ నేతలు ఆడేసుకుంటూ.., వాడేసుకుంటూ.., పార్టీని గంగన ముంచుతున్నారు..!!
మొన్నామధ్య మంత్రి గుమ్మనూరు జయరాం కుమారుడు బెంజి కారు లంచంగా తీసుకున్నారన్న సంగతి ధారాళంగా పాకింది. వీడియోలు, ఆడియోలు, ఫోటోలు కొన్ని సాక్ష్యాలుతో సహా సామజిక మాధ్యమాల్లో దొరికిపోయాయి. ఆ తర్వాత తాటికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వైసిపిలో రెడ్డి కుల ఆధిపత్యాన్ని మాట్లాడుతూ.. ఇష్టమొచ్చిన కామెంట్లు చేస్తూ ఆడియో సందేశంతో దొరికిపోయారు. ఈ మధ్యనే వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ రేవతి టోల్ ప్లాజా దగ్గర రచ్చ చేస్తూ వీడియో సాక్షిగా దొరికిపోయారు. ఇలా పార్టీలో, ప్రభుత్వంలో కీలక హోదాలో ఉన్న నేతలే అడ్డంగా దొరికిన సందర్భాలు అనేకం. కానీ వీరిపై చర్యలు లేవు. విచారణ లేదు. కనీసం మందలింపు లేదు. బయటకు ఏమి రావడం లేదు. ఎందుకంటారు..!?
తప్పు చేసి.. టీడీపీని తిడితే చాలు..!!
పైన ఉదహరించిన ముగ్గురూ తప్పులకు దొరికిపోయారు. కొన్ని ప్రాధమిక ఆధారాలతో సోషల్ మీడియాలోనూ., ప్రధాన మీడియాలోనూ బుక్కైపోయారు. ఇలా జగన్ కంటికి కూడా దొరికిపోయారు. కానీ ఎలా తప్పించుకున్నారు అంటే… టీడీపీని తిట్టేసి. ఎస్.. తప్పు చేసి టీడీపీని తిట్టేస్తే… ఆ మీడియాని తిట్టేస్తే.. ఆ మీడియా అధిపతిని నాలుగు మాటలు అనేస్తే చాలు.. జగన్ దృష్టిలో మంచి మార్కులు కొట్టేయొచ్చు.., పాపాలను కడిగేసుకోవచ్చు. ఇదే ధోరణిలో కొందరు నేతలున్నారు.
* ఎమ్మెల్యే శ్రీదేవి తన వాయిస్ రికార్డులను ఎవరు బయట పెడుతున్నారో.., ఎవరు తనకు వ్యతిరేకంగా పని చేస్తున్నారో.., సొంత పార్టీలోనే తనకు వ్యతిరేకంగా పావులు కడుపుతున్నారో తనకు తెలుసు..! కానీ ఆ ఆడియోపై వివరణ ఇచ్చుకునే క్రమంలో టీడీపీపైనా.., ఎల్లో మీడియా పైనా విమర్శలు గుప్పించారు. అలా ఆమె టాపిక్ ని ముగించారు. తనపై టీడీపీ, ఆ మీడియా కుట్రలు అంటూ తేల్చి చెప్పేసారు.
* అంతకు ముందు మంత్రి జయరాం కూడా ఇదే తరహాలో ఇది మొత్తం ఒక మీడియా కుట్ర అని, అర్ధం లేని వివరణ ఇచ్చారు.
* తాజాగా రేవతి కూడా అడ్డంగా దొరికిపోయిన తర్వాత కూడా మీడియా కుట్ర అని, గుండాలు అని, టీడీపీ పని అని.. ప్రత్యర్థులను టార్గెట్ చేసారు. అంటే… జగన్ ని ప్రసన్నం చేసుకునే పనిలో భాగంగా జగన్ శత్రువులను తిట్టేస్తే.., ఆ మీడియాని తిట్టేస్తే.. జగన్ కోపాన్ని చల్లార్చేయొచ్చు అనే చీప్ ట్రిక్స్ ని ప్లే చేస్తున్నట్టే కనిపిస్తుంది.
జగన్ అలెర్ట్ గానే ఉంటారు..! కానీ చేటు సుమీ..!!
ఇటువంటి వ్యవహారాలన్నీ సీఎం జగన్ కి తెలియక కాదు. ఎవరు ఏమి చేశారు..? ఎవరు ఎక్కడ తప్పు చేసారు అనేది సీఎం కి తెలియక కాదు..! వాస్తవ నివేదికలు నిత్యం ఆయనకు చేరుతుంటాయి. కానీ వీటన్నిటికీ జగన్ సమాధానాలు ఇస్తారు. పార్టీలోనే అంతర్గతంగా పరిష్కరిస్తారు. కాకపోతే ఈ లోగా వారే భుజాలు తడుముకుని.. టీడీపీపైకి నెట్టేస్తుంటారు. కాకపోతే టీడీపీని తిట్టాలి.., తనను పొగడాలి అనే ఒక మూస రాజకీయాల నుండి జగన్ బయటకు రావాల్సి ఉంది. లేకపోతే ఇదే ఆయుధంగా వాడుకుని పార్టీలో చాల మంది హద్దు దాటేసే అవకాశాలు లేకపోలేదు. సాక్షాత్తు స్పీకర్ కుర్చీలో ఉంటూనే ఒక నాయకుడి స్తుతి చేయడం “రాజ్యాంగ విరుద్ధమే”.., ఒక ఎమ్మెల్యే ఆడియో బయటకు వస్తే.. చెక్ చేసుకోండి.., ట్రుథ్ ల్యాబ్ కి పంపించుకోండి అనడం సహజం.. కానీ టీడీపీ కుట్ర, ఆ మీడియా కుట్ర అంటూ లేనిపోని మాటలు చెప్తే మరీ ఛీప్ గా ఉంటుంది. ఇవే పార్టీని కాస్త డేంజర్ బెల్స్ గా మారనున్నాయి. అసలే సోషల్ మీడియా చురుకుగా ఉంటుంది. నిజాలు ఏమిటో తెలుసుకోవడం యువతకు కష్టమేమి కాదు..! రాజకీయమే మారాలి, అధినేత వైఖరే కాస్త అప్రమత్తం కావాలి..!!